Viral video: ఇదేంటి పెద్దాయనా..? పరాఠాకు నెయ్యిలో స్నానం చేయిస్తున్నావా ఏంటి?

Viral video: సామాజిక మాధ్యమాల్లో ఏది భిన్నంగా, కొత్తగా కనిపించినా వైరల్‌ అయిపోతుంది. తాజాగా నెయ్యిలో పరాఠాను వేయిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

Updated : 02 May 2023 19:55 IST

Pic Credit: officialsahihai

ఇంటర్నెట్‌డెస్క్‌: స్ట్రీట్‌ ఫుడ్‌ తయారీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. మనం చూసే రెగ్యులర్‌ వంటలే అయినా భిన్నరీతిలో వండడం అందులో మనకు కనిపిస్తుంటుంది. అందులో కొన్ని వీడియోలు చూసినప్పుడు ఎంతో ముచ్చటేస్తుంది. అవి చూస్తే నోరూరిపోతుంది కూడా. మరికొన్ని వీడియోలు చూస్తే మాత్రం  ‘అరె! ఏంటీ ఇలా కూడా వండుతారా’ అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ వ్యక్తి పరాఠా తయారు చేస్తున్న వీడియో చూస్తే మాత్రం మీకూ అదే అనుభూతి కలగుతుంది. ఇంతకీ ఆ పరాఠా ముచ్చటేంటో చూడండి..

ఎవరైనా పరాఠా తయారు చేసేటప్పుడు కాసింత నెయ్యి వేస్తారు. మరీ ఎక్కువ ఇష్టం ఉంటే మరో నాలుగు స్పూన్లు జోడిస్తారు. కానీ, ఈ వీడియోలోని వ్యక్తి మాత్రం అందుకు భిన్నం. ఈయన పరాఠా చేయాలంటే కనీసం ఓ కేజీ నెయ్యి ఉండాల్సిందే. పరాఠా కాల్చే సమయంలో అందులో అది స్విమ్మింగ్‌ చేయాల్సిందే. అలా నెయ్యిలోనే దాన్ని రెండు వైపులా కాలుస్తాడు. అది చాలదన్నట్లు ఆ పరాఠాకి రంధ్రం పెట్టి మరింత నెయ్యి పోస్తాడు. ఈ వీడియోను ఓ వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు. దీంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తక్కువ సమయంలోనే వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. 

ఈ వీడియోను చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘మొదటి ముక్క తింటే స్వర్గం అంచుకు వెళ్లొచ్చు.. రెండో ముక్క తింటే ఏకంగా స్వర్గానికే వెళ్లొచ్చు’ అంటూ ఓ వ్యక్తి కామెంట్‌ పెట్టాడు. ‘ఇది మదిని దోచే పరాఠా కాదు.. గుండె పోటుకు కారణమయ్యే పరాఠా’ అని కామెంట్‌ చేశాడు. ‘ఇది పూరినా.. పరాఠానా? ఇంతకీ ఏం చేస్తున్నావ్ భయ్యా?’ అంటూ మరో వ్యక్తి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ‘ఇదే నా చివరి ప్రయాణం అని గుండె అనుకుంటుంది’ అంటూ నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు. 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని