Viral video: బాలుడు విలవిల్లాడుతున్నా.. మానవత్వాన్ని మరిచిన మహిళ

పాఠశాలకు వెళ్లి వస్తున్న ఓ బాలుడిని అతడుండే సొసైటీకి చెందిన ఓ కుక్క కరిచింది. అయితే, బాలుడు బాధతో విలవిల్లాడుతున్నా.......

Published : 06 Sep 2022 15:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాఠశాలకు వెళ్లి వస్తున్న ఓ బాలుడిని అతడుండే సొసైటీకి చెందిన ఓ కుక్క కరిచింది. అయితే, బాలుడు బాధతో విలవిల్లాడుతున్నా.. ఎలాంటి జాలి, కరుణలేని ఆ శునకం యజమాని అలాగే చూస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ మహిళా యజమాని ప్రవర్తన పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌ ఘజియాబాద్‌లోని ఓ హౌజింగ్‌ సొసైటీలో నివసిస్తున్న బాలుడు సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వస్తున్నాడు. పైకి వెళ్లేందుకు లిఫ్ట్‌లోకి ఎక్కగా.. ఆ తర్వాత ఓ మహిళ తన పెంపుడు శునకంతో ఆ లిఫ్ట్‌లో ఎక్కింది. అయితే, లిఫ్ట్‌ ఎక్కిన కొద్దిసేపటికే ఆ బాలుడి కుక్క కరిచేసింది. ఫలితంగా అతడు కాలును పట్టుకొని బాధతో విలవిల్లాడుతూన్నా.. ఆ మహిళ మాత్రం తనకేమీ పట్టనట్లు నిర్దయగా వ్యవహరించింది. బాలుడిని అలాగే చూస్తూ ఉందే తప్ప ఏమాత్రం స్పందించలేదు. బయటకు వెళ్లే సమయంలోనూ ఆ శునకం మరోసారి దాడికి యత్నించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

ఈ వీడియోను అకాశ్‌ ఆశోక్‌ గుప్తా అనే ట్విటర్‌ యూజర్‌ ట్వీట్‌ చేస్తూ.. ఎవరూ చూడకపోతే నైతికంగా ఉండాల్సిన బాధ్యతలేదా? అంటూ ప్రశ్నించారు. కాగా ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆ మహిళపై మండిపడుతున్నారు. ‘అనైతికం, సిగ్గుచేటు.. మానవత్వాన్ని మరిచిపోతున్నారు. బాలుడి బాధను పట్టించుకోని ఆమెను ఏమనాలి?’ అంటూ ఓ నెటిజన్‌ ఘాటుగా స్పందించాడు. ‘అలా వ్యవహరించిన ఆ జాలిలేని మహిళను శిక్షించాలి’ అంటూ మరికొందరు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఘజియాబాద్‌ పోలీసులు స్పందించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ శునకం యజమానిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని