Viral Video: తన విమానంలో తండ్రిని తీసుకెళ్లిన వేళ.. మహిళా పైలట్‌ భావోద్వేగ క్షణాలివి!

ఓ మహిళా పైలట్‌ తాను నడిపిన విమానంలోనే తండ్రిని తీసుకెళ్లింది. అంతకుముందు ఆయన్ను కలుసుకుని, ఆశీర్వాదం తీసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 16 Jan 2023 18:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నతంగా ఎదిగితే సంతోషిస్తారు! మరోవైపు.. పిల్లలు సైతం కన్నవాళ్లు తమను చూసి గర్వపడేలా ఏదైనా సాధించాలనుకుంటారు. అలాగే గొప్పగా చేసి చూపించి, వారి కళ్లలో ఆనందాన్ని చూస్తారు. మనసును హత్తుకునే ఇలాంటి దృశ్యమే తాజాగా ఓ విమానంలో ఆవిష్కృతమైంది. ముంబయి(Mumbai)కి చెందిన కృతజ్ఞ అనే మహిళా పైలట్‌.. తాను నడిపే విమానంలోనే తండ్రిని కలుసుకోవడం.. ఆ సమయంలో ఇద్దరి మధ్య భావోద్వేగ క్షణాలకు సంబంధించిన ఈ వీడియో(Viral Video) సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

విమానంలో తన తండ్రిని కలుసుకున్న కృతజ్ఞ.. ఆయన పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదాలు తీసుకుంది. ఆ క్షణంలో ఆయన భావోద్వేగంతో ఆనంద బాష్పాలు రాల్చగా.. ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఈ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ‘నేను పైలట్‌గా ఉన్న విమానంలో నాన్నను తీసుకెళ్లా. టేకాఫ్‌కు ముందు ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నా. తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా ఇంటి నుంచి బయటకు రాను. ఉద్యోగరీత్యా కొన్నిసార్లు తెల్లవారుజామునే బయల్దేరాల్సి ఉంటుంది. ఆ సమయంలో వారు నిద్రలో ఉంటారు. అయినప్పటికీ.. వారి పాదాలను తాకకుండా బయటకు రాను’ అని పేర్కొంది.

ఈ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌కు ఇప్పటివరకు 5.7 లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయి. తండ్రీకూతుళ్ల అనుబంధంపై నెటిజన్లు తమ ప్రేమను కురిపించారు. ‘ఆమె తన తండ్రికి గౌరవం ఇచ్చే విధానం నచ్చింది’ అని ఒకరు స్పందించారు. ‘నాకు నీళ్లొచ్చాయి. మీలాంటి మహిళలు మమ్మల్ని గర్వపడేలా చేస్తారు. ప్రేరణగా నిలుస్తారు’ అని మరొకరు కామెంట్‌ పెట్టారు. ‘ఒక తండ్రి ఇంతకంటే ఏం కోరుకుంటారు’ అని ఒకరు.. ‘ఈ వీడియో చూసి కదిలిపోయా! నిజమైన సంప్రదాయాలు ఇవి’ అని మరొకరు పేర్కొన్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని