UP police: వామ్మో బుల్లెట్ ఇలా కూడా లోడ్ చేస్తారా..? ఎస్ఐ ప్రతిభకు ఖంగుతిన్న డీఐజీ
తన సిబ్బంది ప్రతిభకు ఉత్తర్ప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారి ఖంగుతున్నారు. కనీసం తుపాకీ లోడ్ చేయడం కూడా రాదని తెలుసుకొని అవాక్కయ్యారు.
లఖ్నవూ: కిందిస్థాయి పోలీసుల పనితీరు పరిశీలిద్దామని ఆకస్మిక తనిఖీలు చేసిన డీఐజీ బుర్రతిరిగిపోయే విషయాలను గుర్తించారు. తమ సిబ్బందికి కనీసం గన్లోడ్ చేయడం, టియర్ గన్స్ వాడటం కూడా రాదని తెలుసుకొని నివ్వెరపోయారు. ఈ వ్యవహారం ఉత్తర్ప్రదేశ్(Uttar pradesh) సంత్ కబీర్ నగర్లోని ఓ పోలీసు స్టేషన్లో చోటుచేసుకుంది.
సాధారణ ప్రజలు కూడా తుపాకీ(Gun) లోడ్ చేసే దృశ్యాలు చిత్రాల్లో చూస్తుంటారు. ఈ పని ఒక పోలీసు(Police)కు రాదని ఎవ్వరూ అనుకోరు. ఈ విషయంలో యూపీకి చెందిన సదరు ఎస్ఐ తన బాస్ను ఆశ్చర్యానికి గురిచేశారు. తుపాకీ ముందు భాగం నుంచి బుల్లెట్ను లోడ్ చేశారు. ఎవరు గాయపడకుండా కాల్చే ప్రక్రియ ఇదంటూ తన ప్రతిభను బయటపెట్టారు. దాంతో షాకైన డీఐజీ.. ఇదంతా తనకేమీ వివరించాల్సిన పనిలేదని, బుల్లెట్ను బయటకు తీసి చూపించమన్నారు. ఆయన సింపుల్గా తుపాకీని వంచడంతో బుల్లెట్ బయటకు జారి వచ్చింది. దీంతో ఉన్నతాధికారితో పాటు పక్కన ఉన్న ఇతర అధికారులు కూడా అవాక్కయ్యారు. దాంతో అప్రమత్తమైన డీఐజీ.. వీరందరికీ వెంటనే తగిన శిక్షణ అందించాలని, క్రమం తప్పకుండా సాధన చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు. అలాగైతేనే అత్యవసర పరిస్థితుల్లో విధులు నిర్వర్తించగలమని వెల్లడించారు.
కాగా ఈ దృశ్యాలు వైరల్ కావడంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడ్డాయి. ‘యోగిజీ పోలీసులకు కనీసం తుపాకీ పేల్చడం కూడా తెలీదు. తుపాకీ ముందుభాగం నుంచి వారు బుల్లెట్ను లోడ్ చేస్తున్నారు. అజ్ఞానానికి ఇది పరాకాష్ఠ’ అంటూ సమాజ్వాదీ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.