నానీని ఒప్పించి

ఒక షార్ట్‌ ఫిల్మ్‌ చేస్తే... ఫ్రెండ్స్‌ నుంచి ఫోన్‌ వస్తుంది.. మహా అయితే ఆత్మీయుల నుంచి అభినందనలు వస్తాయి. మరి ఒక కుర్రాడికి నేరుగా ప్రముఖ క్రికెటర్‌ బ్రియన్‌లారా నుంచి కాల్‌ వస్తే... గాత్రాలే తప్ప పాత్రల్లేని మరో లఘుచిత్రం తీస్తే... నేరుగా హీరో నాని ఫోన్‌ చేసి అభినందనలు చెబితే. ఈసారి ఏదైనా చేయాలనుకుంటే ముందు నాతో చెప్పమని వరమిస్తే.. ఇంకేముంది... దర్శకుడి స్థానం దక్కుతుంది. అలా అవకాశం పొందిన కుర్రాడే ప్రశాంత్‌వర్మ. చేపకు నానితో... చెట్టుకు రవితేజతో డబ్బింగ్‌ చెప్పించి... ఫస్ట్‌లుక్‌తో ఆశ్చర్యంలో ముంచెత్తి... టీజర్‌తో ఉత్సుకత రేపిన ‘అ’ చిత్ర దర్శకుడు పాలకొల్లు ప్రశాంత్‌ గురించి చదివేయండి...

Published : 10 Feb 2018 01:39 IST

లారాను మెప్పించి...
నానీని ఒప్పించి

ఒక షార్ట్‌ ఫిల్మ్‌ చేస్తే... ఫ్రెండ్స్‌ నుంచి ఫోన్‌ వస్తుంది.. మహా అయితే ఆత్మీయుల నుంచి అభినందనలు వస్తాయి.
మరి ఒక కుర్రాడికి నేరుగా ప్రముఖ క్రికెటర్‌ బ్రియన్‌లారా నుంచి కాల్‌ వస్తే...
గాత్రాలే తప్ప పాత్రల్లేని మరో లఘుచిత్రం తీస్తే... నేరుగా హీరో నాని ఫోన్‌ చేసి అభినందనలు చెబితే.
ఈసారి ఏదైనా చేయాలనుకుంటే ముందు నాతో చెప్పమని వరమిస్తే..
ఇంకేముంది... దర్శకుడి స్థానం దక్కుతుంది. అలా అవకాశం పొందిన కుర్రాడే ప్రశాంత్‌వర్మ.
చేపకు నానితో... చెట్టుకు రవితేజతో డబ్బింగ్‌ చెప్పించి...
ఫస్ట్‌లుక్‌తో ఆశ్చర్యంలో ముంచెత్తి... టీజర్‌తో ఉత్సుకత రేపిన ‘అ’ చిత్ర దర్శకుడు పాలకొల్లు ప్రశాంత్‌ గురించి చదివేయండి.

సాధ్యుడు
‘‘అన్ని సినిమాలందు ‘అ’ సినిమా వేరయా విశ్వదాభిరామ ఫిబ్రవరి 16న రిలీజ్ రా మామ!’’ - అంటూ కొత్త రకంగా ప్రేక్షకులకు ముందొచ్చిన ‘అ’ టీజర్‌ ఎంతగా అలరిస్తోందో ఆన్‌లైన్‌లో ఎవరినడిగినా తెలుస్తుంది. అటువంటి విభిన్న చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన పెన్మెత్స ప్రశాంత్‌ వర్మది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు. తల్లి కనకదుర్గ పాలకొల్లు బి.ఆర్‌.ఎం.వి. ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు. తండ్రి నారాయణరాజు నిర్మాణరంగంలో ఉన్నారు. పాలకొల్లు సరస్వతి శిశుమందిర్‌లో తొమ్మిదో తరగతి వరకు చదివిన ప్రశాంత్‌వర్మ ఇంజినీరింగ్‌ హైదరాబాద్‌లో పూర్తిచేశారు.

బ్రియన్‌లారా పిలుపు...
సినిమాలు ఎక్కువగా చూసే ప్రశాంత్‌ సినిమా కథలు రాయాలని ప్రయత్నం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ‘సైలెంట్‌ మెలోడి’ కథ రాసి... షార్ట్‌ ఫిల్మ్‌గా తీశాడు. ఈ కథ నిచ్చి ఆర్థిక సహకారం సందీప్‌కిషన్‌ అందించారు. ఇందులో మాటలే ఉండవు. ఒక అందమైన కథను కవితాలా ఆవిష్కరించారు. తర్వాత ‘డైలాగ్‌ ఇన్‌ డార్క్‌’ అంటూ మరో లఘుచిత్రం చేశారు. ఇందులో మాటలు తప్ప పాత్రలే ఉండవు. ఇలా భిన్నమైన అతని ఆలోచనా విధానమే అందరినీ ఆకట్టుకుంది. యప్‌ టీవీ ప్రొడ్యూసర్లు ఇతని ప్రతిభ గుర్తించి బ్రియన్‌లారాకు సైలెంట్‌ మెలోడిని చూపించారు. ఆయన వెంటనే మెచ్చుకొని ప్రశాంత్‌కు ఫోన్‌ చేసి అభినందించారు. తనతో యప్‌ టీవీ చేస్తున్న యూట్యూబ్‌ సిరీస్‌లకు పనిచేయాల్సిందిగా అవకాశం ఇచ్చారు. ప్రశాంత్‌ వెస్టిండిస్‌ వెళ్లి 15 రోజుల పాటు లారాతో కలిసి పనిచేసి ప్రశంసలందుకున్నాడు. లారా ఇంట్లోనే ఆతిథ్యమిచ్చి మరీ గౌరవించాడంటే మనోడి ప్రతిభ ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్‌ క్రికెట్‌కు ప్రచారచిత్రాలను యువరాజ్‌సింగ్‌, జహీర్‌ఖాన్‌లపై చిత్రీకరించాడు. కాజల్‌, సమంత వంటి కథానాయికలతోనూ అనేక ప్రచారచిత్రాలను తీసి మెప్పించాడు.

నాని మెచ్చిన కథ
‘డైలాగ్‌ ఇన్‌ డార్క్‌’ లఘుచిత్రం చూసిన హీరో నాని ఒకసారి ప్రశాంత్‌ని పిలిచి అభినందించారు. ఇందులో ఒక పాత్రకు నా డబ్బింగ్‌ అయివుంటే ఇంకా బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఏదైనా వెరైటీగా ఆలోచించినప్పుడు తనకు ఒకసారి చెప్పమని తనవంతు సాయం చేస్తానని మాటిచ్చాడు. తర్వాత కొన్ని రోజులకు ‘అ’ కథని వినిపించి.. చేపకు మీ వాయిస్‌ ఓవర్‌ కావాలని అడగడానికి నాని వద్దకు వెళ్లాడు ప్రశాంత్‌. కథ విని నేను వాయిస్‌ ఓవరేకాదు... ఈసినిమాను నిర్మిస్తానని ముందుకొచ్చాడు. కాజల్‌, నిత్యమేనన్‌, రెజినా...ఇలా ఎందరో మంచి నటులు కథ నచ్చి పాత్రలు చేయడానికి ఒప్పుకొన్నారు. అదే త్వరలో రాబోతున్న ‘అ’ చిత్రం.

- చిలుకూరి సూర్యప్రసాద్‌, పాలకొల్లు సాంస్కృతిక, న్యూస్‌టుడే

సినిమా ప్రింట్‌తోనే ఊరికి వస్తా

మునుపెన్నడూ వినని కథ.. చూడని సన్నివేశాలు ఉంటేనే ప్రేక్షకులకు నచ్చుతుంది. ‘అ’ చిత్రం అలాగే ఉంటుంది. ఇందులో ఒక విభిన్నమైన ప్రేమ కథ ఉంటుంది. 2016 డిసెంబర్‌ 31న కథ రాయడం ప్రారంభించి 2017 డిసెంబర్‌ 31 నాటికి చిత్రీకరణ పూర్తిచేశా. అమ్మానాన్న ఎంతగానో ప్రోత్సహించారు. నా చెల్లి స్నేహ సమీర ఈ చిత్రం తీయడంలో ఎంతో సహకరించింది. తనకు ఉద్యోగం వచ్చినా వదులుకొని నాకోసం కష్టపడింది. నాలుగేళ్ల కిందట సొంతూరు వచ్చినప్పుడు ఈసారి సినిమా చేసి ప్రింట్‌తోనే పాలకొల్లు వస్తానని స్నేహితులతో, బంధువులతో చెప్పాను. త్వరలో అది జరగబోతోంది. చాలా సంతోషంగా ఉంది.

- ప్రశాంత్‌వర్మ, దర్శకుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని