మరోసారి సచివాలయానికి ఏబీవీ.. వెయిటింగ్ రూమ్‌లో కూర్చొబెట్టి వెళ్లిపోయిన సీఎస్‌

తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి సచివాలయానికి వెళ్లారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ

Updated : 12 May 2022 06:34 IST

అమరావతి: తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి సచివాలయానికి వెళ్లారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ ఏబీవీ గతంలో సచివాలయానికి వెళ్లి సీఎస్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ఇవాళ మరోసారి సీఎస్‌ను కలిసేందుకు వెళ్లారు. అయితే ఆయన్ను కలిసేందుకు సీఎస్ సుముఖత చూపలేదు. ఏబీవీని వెయిటింగ్ రూమ్‌లో కూర్చొబెట్టి సచివాలయం నుంచి సీఎస్ వెళ్లిపోయారు.

ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్‌ పిటిషన్‌(ఎస్‌ఎల్‌పీ)ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ కొనసాగించడం కుదరదని పేర్కొంది. ఏబీవీని మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు జస్టిస్‌ ఏ.ఎం.ఖన్విల్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్టు చేసేందుకు ఏబీవీ ఏప్రిల్‌ 29న సచివాలయానికి వెళ్లారు. తన సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎస్ సమీర్ శర్మను కలిసి సుప్రీంకోర్టు ఆదేశాలను అందజేశారు. పోలీసు డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు యూనిఫాం ధరించి సచివాలయంలో సీఎస్‌ను కలిశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల రీత్యా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్టు చేసేందుకు సచివాలయానికి వచ్చినట్లు ఏబీవీ స్పష్టం చేశారు. పోస్టింగ్‌తో పాటు పెండింగ్ జీత భత్యాల విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. పోస్టింగ్ అంశాన్ని ప్రాసెస్‌లో పెడతామని సీఎస్ హామీ ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. ప్రాసెస్‌లో పెడతామని చెప్పిన సీఎస్‌.. ఏబీవీ అక్కడ ఉండగానే సచివాలయం నుంచి వెళ్లిపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని