AndhraPradesh News: రాయలసీమ ప్రజలకు క్షమాపణలు: సోము వీర్రాజు

ప్రభుత్వ తీరును విమర్శించే క్రమంలో వాడిన పదాలు రాయలసీమ ప్రజల మనసులను గాయపరిచాయని.

Updated : 29 Jan 2022 09:31 IST

విజయవాడ: ప్రభుత్వ తీరును విమర్శించే క్రమంలో వాడిన పదాలు రాయలసీమ ప్రజల మనసులను గాయపరిచాయని.. అందుకే వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఆ వ్యాఖ్యలపై రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన ప్రకటించారు. ‘రాయలసీమ రతనాల సీమ’ అనే పదం తన హృదయంలో పదిలమన్న సోము.. రాయలసీమ అభివృద్ధి కోసం అనేక వేదికలపై ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ఈ విషయం రాయలసీమ ప్రాంత వాసులకు తెలుసన్నారు. రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టులపై చాలా సార్లు ప్రస్తావించినట్లు తెలిపారు. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలని భాజపా ఆలోచన అని సోము వీర్రాజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

‘రాయలసీమలో ఎయిర్‌పోర్ట్‌.. కడపలో ఎయిర్‌పోర్ట్‌.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్‌పోర్ట్‌.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు..’ అని సోము వీర్రాజు గురువారం వ్యాఖ్యానించారు. దీనిపై అధికార వైకాపాకు చెందిన రాయలసీమ ప్రాంత నేతలతో పాటు వామపక్ష రాష్ట్ర నేతలూ తీవ్రంగా మండిపడ్డారు. రాయలసీమ ప్రజల సంస్కృతిని కించపరిచేలా సోము వ్యాఖ్యలు ఉన్నాయని ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి విమర్శించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని