APSRTC: ఆర్టీసీ ఏసీ బస్సుల్లో రద్దీని బట్టి ఛార్జీలు

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులతో పాటు, పొరుగు రాష్ట్రాల ఆర్టీసీలతో పోటీపడేందుకు వీలుగా ఏపీఎస్‌ఆర్టీసీ ఎంపిక చేసిన ఏసీ బస్సుల్లో అవసరాన్ని బట్టి ఛార్జీలు తగ్గించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొన్ని జిల్లాల్లో మంగళవారం

Updated : 26 Jan 2022 07:36 IST

 10-20 శాతం తగ్గించేలా నిర్ణయం

ఈనాడు-అమరావతి: ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులతో పాటు, పొరుగు రాష్ట్రాల ఆర్టీసీలతో పోటీపడేందుకు వీలుగా ఏపీఎస్‌ఆర్టీసీ ఎంపిక చేసిన ఏసీ బస్సుల్లో అవసరాన్ని బట్టి ఛార్జీలు తగ్గించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొన్ని జిల్లాల్లో మంగళవారం నుంచే వీటిని అమలుచేయడం ఆరంభించారు. కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌కు నడిచే కొన్ని సర్వీసుల్లో ఛార్జీలు తగ్గించారు. ఏసీ బస్సులతోపాటు, దూర ప్రాంత ఇతర సర్వీసుల్లో సైతం పరిస్థితిని బట్టి 10-20 శాతం ఛార్జీలు తగ్గించుకునేందుకు వీలుగా 2016లో యాజమాన్యం ఉత్తర్వులిచ్చింది. అయితే అప్పటి నుంచి దీనిని అమలు చేయడం లేదు. తాజాగా ఆర్టీసీ ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు మంగళవారం అన్ని జోన్ల ఈడీలు, అన్ని జిల్లాల ఆర్‌ఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 20 శాతం వరకు ఛార్జీలు తగ్గించేందుకు వీలుగా గతంలో ఉన్న ఉత్తర్వులను అమలు చేసేందుకు జిల్లాల్లో రీజనల్‌ మేనేజర్లు నిర్ణయం తీసుకోవచ్చని ఆదేశించారు. దీంతో ఓఆర్‌ తక్కువగా ఉండే పలు రూట్లలో ఎంపిక చేసిన ఏసీ సర్వీసుల్లో ఛార్జీలు తగ్గిస్తున్నారు. వారాంతం, పీక్‌ అవర్స్‌లో వెళ్లే సర్వీసుల్లో ప్రస్తుత ఛార్జీయే ఉంటుందని, మిగిలిన రోజులు, పీక్‌ అవర్స్‌ కాని సమయంలో బయలుదేరే సర్వీసుల్లో ఛార్జీలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.

అతి తక్కువ ఓఆర్‌ కారణం..

కొవిడ్‌ ప్రభావం, చలి ఎక్కువగా ఉండటంతో సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) పడిపోయింది. అన్ని బస్సుల్లో కలిపి సగటు ఓఆర్‌ 63-64 శాతం ఉండగా.. ఏసీ బస్సుల్లో మాత్రం ఘోరంగా ఉంటోంది. ఆయా రూట్లను బట్టి 30-50 శాతం మధ్య ఓఆర్‌ ఉంటున్నట్లు గుర్తించారు. అలాగే కర్ణాటక ఆర్టీసీ.. ఏసీ సర్వీసుల్లో ఛార్జీలు తగ్గించే విధానం అమలు చేస్తోంది. దీనివల్ల ఏపీఎస్‌ఆర్టీసీ బెంగళూరుకు నడిపే ఏసీ సర్వీసుల్లో ప్రయాణికులు తక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఛార్జీల తగ్గింపునకు వీలు కల్పించారు. ఇవి గతంలో ఉన్న ఆదేశాలేనని, ఇపుడు అమలు చేస్తున్నామని, ఈ విషయంలో ఆర్‌ఎంలకు విచక్షణ అధికారం ఉంటుందని ఈడీ (ఆపరేషన్స్‌) బ్రహ్మానందరెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని