Chandrababu: ‘క్యాసినో’పై ఈడీ దర్యాప్తు కోరదాం

సంక్రాంతి సందర్భంగా గుడివాడలో మూడు రోజులపాటు నిర్వహించిన క్యాసినోలో దాదాపు రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు చేతులు మారినట్లు ప్రచారంలో ఉందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పెనువిఘాతమని తెదేపా నిజనిర్ధారణ కమిటీ పేర్కొంది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు లేఖరాసి, దర్యాప్తు చేయాల్సిందిగా కోరాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు సూచించింది. కమిటీ సభ్యులు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, తంగిరాల

Updated : 26 Jan 2022 04:32 IST

తెదేపా నిజనిర్ధారణ కమిటీ సూచన
పార్టీ అధినేత చంద్రబాబుకు నివేదిక

ఈనాడు, అమరావతి: సంక్రాంతి సందర్భంగా గుడివాడలో మూడు రోజులపాటు నిర్వహించిన క్యాసినోలో దాదాపు రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు చేతులు మారినట్లు ప్రచారంలో ఉందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పెనువిఘాతమని తెదేపా నిజనిర్ధారణ కమిటీ పేర్కొంది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు లేఖరాసి, దర్యాప్తు చేయాల్సిందిగా కోరాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు సూచించింది. కమిటీ సభ్యులు వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, తంగిరాల సౌమ్యతో పాటు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మంగళవారం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసి నివేదిక అందజేశారు. ‘మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్‌ సెంటర్‌లో క్యాసినో నిర్వహించినట్టు, ఇతర రాష్ట్రాల యువతులతో అశ్లీల నృత్యాలు చేయించినట్టు, తీన్‌పత్తీ, రోలెట్‌ తదితర జూదాలు జరిగినట్టు పట్టణమంతా కోడై కూస్తోంది. మంత్రికి సన్నిహితుడైన వైకాపా నాయకుడు మండలి హనుమంతరావు.. మేం గుడివాడ వెళ్లడాన్ని నిరసిస్తూ క్యాసినో నడుస్తున్నప్పుడు రాకుండా ఇప్పుడొచ్చి ఏం చేస్తున్నారని బూతులు తిట్టారు. క్యాసినో జరిగిందనడానికి ఇదే నిదర్శనం’ అని నివేదిక పేర్కొంది. ‘క్యాసినోలో పాల్గొన్న వ్యక్తులు ఈ నెల 17న విజయవాడ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలో బెంగళూరుకు, అక్కడి నుంచి గోవాకు వెళ్లినట్టు ప్యాసింజర్‌ లిస్టు, వారికి టికెట్లు బుక్‌ చేసిన వ్యక్తి ఫోన్‌ నంబరు ద్వారా తెలిసింది’ అంటూ ఆ పేర్లు నివేదికలో ప్రస్తావించారు. ‘కోట్ల డబ్బు చేతులు మారడంపై డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ)కి లేఖ రాయాలి. కేంద్ర ఆర్థిక మంత్రి లేదా ఆర్థికశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేయాలి. మద్యం సరఫరాపై ఎస్‌ఈబీకి లేఖ రాయాలి. దర్యాప్తునకు రాష్ట్ర పోలీసులు సుముఖంగా లేనందున కేంద్ర సంస్థతో దర్యాప్తు జరిపిస్తేనే నిజాలు బయటపడతాయి. న్యాయస్థానాలనూ ఆశ్రయించాలి’ అని నివేదికలో పేర్కొన్నారు. చంద్రబాబుతో భేటీ తర్వాత తెదేపా నేతలు మీడియాతో మాట్లాడుతూ క్యాసినో ఘటనపై బుధవారం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని