
జంట హత్యల కేసులో 12 మంది అరెస్టు
ఆదోని నేరవార్తలు, న్యూస్టుడే : కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో గురువారం జరిగిన జంట హత్యల కేసులో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఆదోనిలో డీఎస్పీ వినోద్కుమార్తో కలిసి ఎస్పీ సుధీర్ కుమార్రెడ్డి ఆ వివరాలు వెల్లడించారు. కామవరంలో ఓ భూ వివాద విషయమై మాట్లాడేందుకు గురువారం అదే గ్రామానికి చెందిన శివప్ప, ఈరన్న అలియాస్ భాస్కర్లతోపాటు కొంతమంది వడ్డే మల్లికార్జున ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో మారణాయుధాలతో జరిగిన దాడిలో శివప్ప, ఈరన్న మృతిచెందారు. మరి కొంతమంది గాయపడ్డారు. సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తునకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులైన వడ్డే మల్లికార్జున, వడ్డే గోపాల్, వడ్డే రాజు, వడ్డే ఈశ్వర్, వడ్డే చంద్ర, వడ్డే హనుమంతు, వీరికి సహకరించిన కౌతాళంకు చెందిన బాపురం రామకృష్ణ పరమహంస అలియాస్ చాకలి రామకృష్ణలను హైదరాబాద్లో, వడ్డే ఉలిగమ్మ, వడ్డే లక్ష్మి, వడ్డే జయమ్మ, వడ్డే ఈరమ్మ, వడ్డే లక్ష్మిలను ఎమ్మిగనూరు మండలం మాసుమానుదొడ్డి గ్రామంలో అరెస్టు చేశారు. హత్యలకు ప్రధాన కారణం భూ తగాదాలేనని, నిందితులపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులను 24 గంటల్లో అరెస్టు చేసిన సీఐలు, ఎస్సైలను అభినందించారు.