Andhra News: కర్నూలు మున్సిపల్‌ సిబ్బంది నిర్వాకం.. విస్తుపోయిన దుకాణదారులు

కర్నూలు నగరపాలక సంస్థ సిబ్బంది చేసిన నిర్వాకం అందరినీ విస్తుపోయేలా చేసింది. చెత్త పన్ను కట్టలేదని ఏకంగా దుకాణాల వద్దకు వెళ్లిన నగరపాలక సంస్థ సిబ్బంది.కర్నూలు నగరపాలక సంస్థ సిబ్బంది చేసిన నిర్వాకం అందరినీ విస్తుపోయేలా చేసింది. చెత్త పన్ను కట్టలేదని ఏకంగా దుకాణాల వద్దకు వెళ్లిన నగరపాలక సంస్థ సిబ్బంది.. దుకాణాల

Updated : 16 Mar 2022 16:13 IST

కర్నూలు (నగరపాలక సంస్థ): కర్నూలు నగరపాలక సంస్థ సిబ్బంది చేసిన నిర్వాకం అందరినీ విస్తుపోయేలా చేసింది. చెత్త పన్ను కట్టలేదని ఏకంగా దుకాణాల వద్దకు వెళ్లిన నగరపాలక సంస్థ సిబ్బంది.. దుకాణాల ముందు చెత్త వేసి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు సమీపంలోని శ్రీనివాస క్లాత్ మార్కెట్ నుంచి అనంత కాంప్లెక్స్ వరకు చెత్త పన్ను వసూలు చేసేందుకు వార్డు సచివాలయ పారిశుద్ధ్య సిబ్బంది బుధవారం వెళ్లారు. ఆస్తి, నీటి పన్నుతోపాటు దుకాణాలకు ట్రేడ్ లైసెన్సుల రుసుం చెల్లిస్తున్నామని.. మళ్లీ ఈ చెత్త పన్ను ఎందుకు చెల్లించాలని దుకాణదారులు సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో సహనం కోల్పోయిన నగరపాలక సంస్థ సిబ్బంది నగర వ్యాప్తంగా సేకరించిన చెత్తను దుకాణాల ముందు పడేసి వెళ్లారు.

నగరపాలక సంస్థ సిబ్బంది వ్యవహారంపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెలకు రూ.200 చెత్తపన్ను కట్టలేమని దుకాణదారులు అంటున్నారు. ఏ రాష్ట్రంలోనూ ఇలా చెత్త పన్ను వసూలు చేయడం లేదని వాపోయారు. సిబ్బంది చేసిన తీరుతో చాలా అవమానంగా ఉందని.. సాయంత్రం మున్సిపల్‌ కమిషనర్‌తో మాట్లాడతామని చెప్పినా వినకుండా చెత్త వేసి వెళ్లారని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలల పన్ను ఒకేసారి కట్టాలని సిబ్బంది ఒత్తిడి చేసినట్లు దుకాణదారులు వాపోయారు. ఇలా దుకాణాల ఎదుట చెత్త వేయడం వల్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వెల్లడించారు. అయితే చెత్త పన్ను కట్టకపోతే ఈ విధంగానే ఉంటుందని సిబ్బంది దుకాణ యజమానులతో చెప్పినట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని