Andhra News: దావోస్‌లో ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రయోజనం ఉండదు: నాదెండ్ల మనోహర్‌

‘‘ఆంధ్రప్రదేశ్‌లో వైద్యారోగ్య రంగం వెలిగిపోతుంది. కరోనా సమయంలో 44సార్లు ఇంటింటి సర్వేలు చేసి సేవలు చేశాం’’ అని దావోస్ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పిన విషయాలను ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

Published : 24 May 2022 15:57 IST

అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్‌లో వైద్యారోగ్య రంగం వెలిగిపోతుంది. కరోనా సమయంలో 44సార్లు ఇంటింటి సర్వేలు చేసి సేవలు చేశాం’’ అని దావోస్ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పిన విషయాలను ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. విదేశీయులకు ఏం చెప్పినా నిజాలు తెలియవనే ధీమాతో సీఎం మాట్లాడారని విమర్శించారు. కరోనా విపత్కర సమయంలో ఆక్సిజన్ కూడా అందించలేకపోయారని మండిపడ్డారు. ఆక్సిజన్‌ అందకే తిరుపతి రుయా ఆస్పత్రిలో 30 మంది చనిపోయారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ మేరకు నాదెండ్ల మనోహర్‌ ప్రకటన విడుదల చేశారు.

‘‘కరోనా మొదటి వేవ్ సమయంలో ఆస్పత్రులకు కనీసం మాస్కులు, గ్లౌజులు కూడా ఇవ్వలేకపోయారు. ఆ విషయంపై ప్రశ్నించినందుకే వైద్యుడు సుధాకర్‌ని వేధించి, కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. అంబులెన్సులు లేవు.. ఆస్పత్రిలో చనిపోతే కనీసం మృతదేహాన్ని తరలించేందుకు వాహనాలు లేవు. ఇవేనా వైకాపా ప్రభుత్వం అందిస్తోన్న వైద్యారోగ్య సేవలు? రుయా ఆస్పత్రిలో పసిబిడ్డ మృతదేహాన్ని ఓ పేద తండ్రి బైక్ మీద తీసుకెళ్లిన ఘటన, ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు కుట్లు వేసి, కట్లు కట్టిన ఉదంతాన్ని దావోస్ వేదికగా ఎందుకు చెప్పలేదు? కరోనా సమయంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు నిధులు మంజూరు చేసింది. కరోనా సమయంలో ఎంతో మంది స్పందించి విరాళాలు ఇచ్చారు. వాటిని ఏ విధంగా ఖర్చు చేశారో ప్రజలకు చెప్పాలి. 2020, 2021 సంవత్సరాల్లో ఆస్పత్రులకు భోజనం సరఫరా చేసినవారికి బిల్లులు కూడా చెల్లించలేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు మందులు, ఉపకరణాలు సరఫరాకు ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా ఎందుకు రావడం లేదో జగన్ దావోస్ వేదికగా వివరిస్తే బాగుండేది. కరోనా మృతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయం రూ.1100 కోట్లను దారి మళ్లించారు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ విఫలమైనట్లు కేంద్ర ప్రభుత్వ నివేదిక స్పష్టంగా చెబుతోంది. 2021-22లో దేశానికి వచ్చిన ఎఫ్‌డీఐల్లో కేవలం 0.38 శాతం మాత్రమే ఏపీ సాధించగలిగింది. ఏపీలో ఉన్న ఆర్థిక అరాచకం, పీపీఏల రద్దు, అధికార పార్టీ నేతలు పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టడం.. లాంటి ప్రభుత్వ విధానాల మూలంగానే ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. విశాఖ నుంచి వెళ్ళిపోయిన లులూ సంస్థ ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెడుతోంది. అనేక విదేశీ సంస్థలు ఏపీకి ఇరుగుపొరుగున ఉన్న రాష్ట్రాల వైపు మొగ్గు చూపుతున్నాయి. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిని విస్మరించి ఆర్థిక అరాచకానికి పాల్పడితే పెట్టుబడులు ఏ విధంగా వస్తాయి? వీటిని విస్మరించి దావోస్‌లో ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రయోజనం ఉండదు’’ అని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని