Andhra News: సత్వరమే స్పందించి ఉంటే ఆమెపై ఘోర అఘాయిత్యం జరిగేదా?: పవన్‌ కల్యాణ్‌

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్రంగా కలచివేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది ఆస్పత్రిలో పని చేస్తున్నవారే కావడం చూస్తుంటే అక్కడి నిఘా...

Published : 23 Apr 2022 01:35 IST

అమరావతి: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్రంగా కలచివేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది ఆస్పత్రిలో పని చేస్తున్నవారే కావడం చూస్తుంటే అక్కడి నిఘా వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం అవుతోందన్నారు. తమ బిడ్డ కనిపించడం లేదని కన్నవారు పోలీసులను ఆశ్రయించి ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేసినా బాధ్యత కలిగిన అధికారుల నుంచి కనీస స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు. సత్వరమే స్పందించి ఉంటే ఆమెపై ఘోర అఘాయిత్యం జరిగేదా? అని ప్రశ్నించారు. నిందితులను శిక్షించాలని గొంతెత్తిన జనసేన నాయకులు, ఇతర పార్టీలవారిపై కేసులు నమోదు చేయడంలో చూపించే చురుకుదనం ఒక ఆడబిడ్డ ఆచూకీ తెలుసుకోవడంలో చూపించాల్సిందని అభిప్రాయపడ్డారు.

‘‘మహిళల రక్షణ కోసం దిశ చట్టం తీసుకొచ్చినా ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ఆ చట్టం ద్వారా నిందితులను శిక్షించే పరిస్థితి లేదు కాబట్టి పోలీసులే ఆడ బిడ్డల రక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఎంతో ఆందోళన, ఆవేదనతో పోలీసులను ఆశ్రయించే తల్లితండ్రులకు భరోసా ఇచ్చేలా సత్వర స్పందన అవసరం. రాష్ట్రంలో మహిళలపై ఆఘాయిత్యాలు ఏటా పెరుగుతున్నాయనే వాస్తవం విస్మరించలేనిది. 2020తో పోలిస్తే 2021లో ఈ కేసులు 25 శాతం పెరిగాయని గతంలో పని చేసిన డీజీపీ స్వయంగా ప్రకటించారు. ఇకనైనా పాలక పక్షం పోలీసు వ్యవస్థను తమ రాజకీయ అవసరాలు, ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపుల కోసం కాకుండా ప్రజలకు రక్షణ నిమిత్తం వినియోగించాలి. అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించటంతో పాటు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. అలాగే దిశ చట్టం ఎప్పటి నుంచి అమలవుతుందో కూడా ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి’’ అని పవన్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని