Chalo Narsipatnam: తెదేపా ‘చలో నర్సీపట్నం’.. పలుచోట్ల నేతల గృహనిర్బంధం

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేత, బీసీలపై దాడులు, హత్యలను నిరసిస్తూ తెదేపా ‘చలో నర్సీపట్నం’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు

Updated : 20 Jun 2022 12:22 IST

నర్సీపట్నం: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేత, బీసీలపై దాడులు, హత్యలను నిరసిస్తూ తెదేపా ‘చలో నర్సీపట్నం’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆ పార్టీ నేతల్ని గృహనిర్బంధం చేశారు. అనకాపల్లి జిల్లా తెదేపా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు సహా స్థానిక నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. నర్సీపట్నం పట్టణంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద గోడ కూల్చిన ప్రదేశాన్ని పలువురు తెదేపా, సీపీఐ నేతలు పరిశీలించారు.

అయ్యన్న ఇంటి వద్ద చింతకాయల విజయ్‌ దీక్ష

ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ అయ్యన్న కుమారుడు చింతకాయల విజయ్‌ నర్సీపట్నంలో దీక్షకు దిగారు. అయ్యన్న ఇంటివద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయన దీక్షకు కూర్చొన్నారు. నల్లకండువా వేసుకుని విజయ్‌ నిరసన తెలిపారు. మరోవైపు చుట్టుపక్కల జిల్లాల నుంచి నర్సీపట్నం బయల్దేరిన తెదేపా నేతలను పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. చలో నర్సీపట్నం కార్యక్రమానికి వెళ్లకుండా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను, వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని గృహనిర్బంధం చేశారు. విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడును అరెస్ట్‌ చేశారు. పాడేరులో మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిలను పోలీసులు నిర్బంధించారు.

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ మంత్రి మృణాళిని ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి వచ్చిన తెలుగు మహిళలు అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లి ఆయన సతీమణి పద్మావతితో మాట్లాడారు. కొందరు తెదేపా నాయకులు పోలీసుల కళ్లుగప్పి ఆదివారం రాత్రే నర్సీపట్నం చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద్‌ వెంకట సత్యనారాయణ, కేఎస్‌న్‌రాజు తదితరులు వచ్చారు. ‘చలో నర్సీపట్నం’ నేపథ్యంలో పట్టణంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు