
Cm jagan: కల్తీ రాయుళ్లకు రెండేళ్ల జైలు శిక్ష.. అవసరమైతే చట్టంలో మార్పులు: సీఎం జగన్
అమరావతి: బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ఏపీ సీఎం జగన్ సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖపై ఆ శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మిల్లెట్స్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. కల్తీ విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కల్తీ రాయుళ్లకు కనీసం రెండేళ్లు జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. జైలు శిక్షపై చట్టంలో మార్పులు అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని సీఎం స్పష్టం చేశారు. అలాగే ఆర్బీకేలను నిర్వీర్యం చేసేలా వ్యవహరించే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధ్యులైన వారిని ఉద్యోగాల నుంచి తొలగించి, కేసులు పెడతామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే వ్యాపారులపైనా కఠిన చర్యలు తప్పవన్నారు. రైతులకు ఎక్కడా విత్తనాలు రాలేదనే మాట రాకూడదని సీఎం తెలిపారు. డిమాండ్ మేరకు అన్నదాతలకు విత్తనాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.