
Mekapati Goutham Reddy: వారు సీఎం జగన్ను కలిసిన విషయం నాకు తెలియదు: గౌతమ్ రెడ్డి
అమరావతి: అదానీ సోదరులు వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కలిసిన విషయం తనకు తెలియదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. అదానీ గ్రూప్స్ నుంచి పెండింగ్ ప్రపోజల్స్ ఏమీ లేవన్నారు. అదానీతో గతంలో ఉన్న ఒప్పందాలే తప్ప.. కొత్తవి ఏమీ లేవని స్పష్టం చేశారు. 21 నైపుణ్యాభివృద్ధి కాలేజీలను తొందరగా ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు. దీని కోసం త్వరలో టెండర్లు పిలుస్తామని, టెండర్ నోటీసులు కూడా ఇచ్చామన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు పెడతామని, నైపుణ్యాలతో పాటు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను కూడా అప్గ్రేడ్ చేయమని సీఎం ఆదేశించారన్నారు. ప్రతి జిల్లాలో నైపుణ్యం, ఉపాధిని అనుసంధానించే విధంగా ఒక అధికారిని నియమించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.