Andhra News: ముగ్గురు విద్యార్థుల అదృశ్యం ఘటన విషాదాంతం

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం.నిడమానూరులో విషాదం నెలకొంది. నిన్న అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు.

Updated : 28 Feb 2022 09:27 IST

వాసు, చెంచు మహేష్, జగన్‌

టంగుటూరు: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎం.నిడమానూరులో విషాదం నెలకొంది. ఆదివారం ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. కనిపించకుండా పోయిన ముగ్గురు విద్యార్థులూ విగతజీవులుగా మారారు. పొందూరు సమీపంలో పొదవారిపాలెం వద్ద మూసీ వాగులో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులను వాసు(15), జగన్‌(12), మహేశ్‌(13)గా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే.. ఈ ముగ్గురు విద్యార్థులు నిడమానూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ఇళ్ల వద్దే ఉన్న వీరు 3గంటల సమయంలో క్రికెట్‌ ఆడేందుకు పొందూరు పంచాయతీ పొదవారిపాలెం సమీపంలోని మూసీ వాగు వద్దకు వెళ్లారు. అనంతరం ముగ్గురు విద్యార్థులు ఈతకు ఉపక్రమించగా.. సమీపంలో వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు వారించి పంపారు. సాయంత్రమైనా పిల్లలు ఇళ్లకు చేరకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. కాలనీ వాసులతో కలిసి విస్తృతంగా గాలించారు. ప్రయోజనం లేకపోవడంతో మూసీ వాగు వద్దకు వచ్చినట్టు తెలుసుకుని అక్కడా వెతికారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక దళాలతో గాలించారు. నిన్న రాత్రి పొద్దుపోయేటప్పటికీ విద్యార్థుల ఆచూకీ లభించలేదు. ఈ ఉదయం మరోసారి గాలించగా మృతదేహాలు బయటపడ్డాయి. విగతజీవులుగా మారిన పిల్లలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని