రహస్య లిపి
‘పాండవులా కౌరవులా... ఎవరు దుర్మార్గులు, ఎవరు ధర్మాత్ములు... అనేది పెద్ద చర్చనీయ అంశమేమీ కాదు. అవి రెండు స్వభావాలు, విభిన్న చైతన్యాలు, విరుద్ధ శక్తులు. వాటి మధ్య సంఘర్షణ
‘పాండవులా కౌరవులా... ఎవరు దుర్మార్గులు, ఎవరు ధర్మాత్ములు... అనేది పెద్ద చర్చనీయ అంశమేమీ కాదు. అవి రెండు స్వభావాలు, విభిన్న చైతన్యాలు, విరుద్ధ శక్తులు. వాటి మధ్య సంఘర్షణ సహజసిద్ధమైనది. విభిన్నమైన రెండు శక్తుల మధ్య సంఘర్షణే- జగత్తు. ఆ జగత్తు గురించి వివరించడమే ఇతిహాసకర్త ఆశయం. అదే మహాభారత కథనం’ అన్నారు అరవింద యోగి- వ్యాసమహర్షి గురించి చెబుతూ.అరవిందుల అభిప్రాయం అర్థమైతే- మన చూపు మారిపోతుంది. మహాభారతం ఇతిహాసమా పురాణమా... అది జరిగిందా లేదా అనే సందేహాలు తీరిపోతాయి. ఆలోచన తేటపడుతుంది. అనంతమైన కాల సముద్రం ఒడ్డున ఎత్తుగా నిలిచి దారి చూపిస్తున్న దీపస్తంభంలా అది గోచరిస్తుంది. ‘మహాభారతం నిజంగా జరిగి ఉంటే అద్భుతం... అది వ్యాసుడి రచనే అయితే పరమాద్భుతం’ అన్న పాశ్చాత్య తత్త్వవేత్తల వ్యాఖ్యానం బోధపడాలంటే- అరవిందుల సూచనే చక్కని కరదీపిక. సృష్టి విశ్వభ్రమణ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సూచన సహాయపడుతుంది. ‘శ్వేతచ్ఛత్రం’ పేరుతో అరవిందులు ఈ రహస్యాన్ని లోకానికి వెల్లడించారు. భారతీయ రాజనీతి శాస్త్రానికి ‘శ్వేతచ్ఛత్రం’ అని పేరు. శ్వేతచ్ఛత్రమంటే తెల్ల గొడుగు. దాన్నే వెల్లగొడుగుగానూ సంబోధిస్తారు.
‘కర్ణుడు సూర్యుడి వరంతో జన్మించాడు. అతడు సూర్యాంశ సంభూతుడు. అది ఉష్ణశక్తి. అర్జునుడు చంద్రవంశీయుడు. అంటే శీతశక్తి. ఈ రెండు శక్తులూ పరస్పర విభిన్న చైతన్యాలు. వాటి స్వభావాలు సంఘర్షణాత్మకాలు. కర్ణుడు, అర్జునుడు ఒకరితో ఒకరు తీవ్రంగా సంఘర్షించిన వైనాన్ని భారతం చిత్రించింది. ఈ రెండూ నిజానికి పాత్రలు కావు... ప్రతీకలు. వారిద్దరూ ఎవరి కర్తవ్యాన్ని వారు సక్రమంగా నిర్వహించడమే- విశ్వభ్రమణ రహస్యం’ అన్నారు అరవిందులు. ఉదాహరణకు నీరు, నిప్పు అనేవి రెండు పరస్పర విరుద్ధ శక్తులు. అవి ఒకదానితో ఒకటి సంఘర్షించే సందర్భాల్లో... నీటిది పైచేయి అయితే నిప్పు ఆరిపోతుంది. నిప్పు తీవ్రమైనదైతే నీరు ఆవిరైపోతుంది. విడిగా ఉన్నప్పుడు దేని పని అది చేసుకుపోతూ ఉంటాయవి.
సృష్టి నడవడానికి ఆ రెండు శక్తులూ అవసరమే. నీరు లేనిదే పంట పండదు. నిప్పు లేనిదే గింజ ఉడకదు. సృష్టి క్రమంలో దేని ప్రయోజనం దానిదే. ఈ అంతస్సూత్రాన్ని మనిషి అర్థం చేసుకోవాలి. తన ప్రజ్ఞను దానితో అనుసంధానించుకోవాలి. సృష్టి రహస్యాన్ని గ్రహించాలి.
విష్ణువు ఇంద్రుడికి ‘యజ్ఞసఖుడు’ అంది రుగ్వేదం. మహాభారతం దగ్గరకు వచ్చేసరికి అది ‘నరనారాయణీయం’గా మారింది. ఇంద్రుడు నరుడై, విష్ణువు నారాయణుడయ్యాడు. నన్నయ పదేపదే అర్జునుణ్ని ‘నరుడు’ అని సంబోధించడంలోని ఆంతర్యమిదే. ఆయన ఇంద్రుడి కొడుకు అనడమూ ఒక సంకేతమే. నరుడు స్వయంగా సమర్థుడై రణరంగంలో నిలబడినప్పుడు నారాయణుడు ఆయనకు ‘యుద్ధసఖుడు’ అయ్యాడు. ‘నాకు ఏమీ రాదు. నీవే దారి... నీవే తప్ప ఇతఃపరంబు ఎరుగను’ అని శరణాగతి చేసిననాడు ‘ఇష్టసఖుడు’ అయ్యాడు. వాస్తవానికి భారత కృష్ణుడు యుద్ధసఖుడు... భాగవత కృష్ణుడు ఇష్టసఖుడు. నరుడు నారాయణుడయ్యే ప్రక్రియ పేరే- యజ్ఞం. యుద్ధాన్ని యజ్ఞమని భారతంలో పేర్కొనడంలోని రహస్యం అదే. ఈ సంకేత లిపిని గ్రహించినప్పుడు యుద్ధమే కాదు... జీవితమూ ఒక యజ్ఞమేనని అర్థమవుతుంది. అరవిందుల వంటి యోగుల హిత వచనాలతో జీవన సమరంలో దైవాన్ని యుద్ధసఖుడిగా స్వీకరించడం, జీవితాన్ని యజ్ఞంగా నిర్వహించడం సాధ్యం అవుతుంది. అదే వ్యాసమహర్షి రచనకు పరమ లక్ష్యం. భౌతిక అమరత్వసిద్ధికి మొదటి మెట్టు!
- ఎర్రాప్రగడ రామకృష్ణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు. -
చుట్టుపక్కల చూడు...
చీకటితో చెలిమి చేయాలని ఏ మనిషీ కోరుకోడు. అయిష్టమైన అంధకారం నుంచి అతి త్వరగా బయటపడాలని, వెలుగు ముఖం చూడాలని తపించిపోతాడు. ఉదయించే సూర్యకిరణాల ప్రసరణ కోసం అనుక్షణం నిరీక్షిస్తాడు. అవి రాగానే సంబరపడతాడు. కానీ చిత్రాతిచిత్రంగా తనకు తెలియకుండా పెను చీకటిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. -
ఇఫ్తార్ విందు
ఇష్టపూర్వకంగా ఒకరిని విందుకు ఆహ్వానించి వారికి ప్రీతికరంగా కొసరి కొసరి వడ్డించి ఆనందించేవారు విశాల హృదయులు. ఇటువంటి విందు భోజనాల వల్ల స్నేహాలు వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడతాయి. అది దైవకార్యంగా భావించి చేస్తే మానవత్వానికి దైవత్వం తోడవుతుంది. -
శుభోదయం - శుభరాత్రి
మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు. తన దైనందిన జీవితంలో ప్రతిపనిలోనూ శుభం జరగాలని, లాభం కలగాలని ఆశిస్తాడు. ఇది మానవనైజం. ఉదయం నిద్ర లేవగానే శుభోదయం అంటాడు. రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు. నిజానికి కాలంలో శుభం, అశుభం అంటూ ఏదీ ఉండదు. -
విధి విన్యాసం
విధి అనే పదానికి విధాత (బ్రహ్మ) నిర్ణయించినదని వ్యుత్పత్తి. ‘తప్పనిసరి’ అనేది సరైన అర్థం. సృష్టి చేయడం బ్రహ్మ పని అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సృష్టి అనే బ్రహ్మ రచనలో మనమంతా పాత్రలం. -
అసలు మర్మం
మన పురాణాల్లో శివుడి గురించి ఓ ప్రసిద్ధమైన కథ ఉంది. బ్రహ్మ, విష్ణువు ఓ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే విషయమై వాదులాడుకున్నారట. అది క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దేవతలకు కంగారు పుట్టి, శివుణ్ని ఆశ్రయించారు. -
బాల్యం నుంచే బుద్ధియోగం
భగవద్గీతలో శ్రీకృష్ణుడు- బుద్ధియోగం ద్వారా మనిషిలో జరిగే వికాసం సర్వతోముఖంగా ఉంటుందన్నాడు. తద్వారా మనోనియంత్రణ, మానసిక పరిపక్వత, నిస్వార్థ గుణం, స్పందించే హృదయం, మనోస్థైర్యం, క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు అలవడతాయి. ఈ సద్గుణాలను బాల్యం నుంచే పిల్లల మనసులలో నింపాలి. వ్యక్తిత్వ వికాసానికి బీజాలు పడాల్సింది బాల్యంలోనే... -
ఏకాంత ఉపాసన
మనిషి సంఘజీవి. ఒంటరిగా జీవించలేడు. జంటగా, సమాజంలో ఒక సభ్యుడిగా ఉండాలని కోరుకుంటాడు. దశలవారీగా జీవిత పాఠాలు నేర్చుకున్న మనిషి ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మలచుకుంటాడు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు