స్పందించే హృదయాలు

మనిషి జీవితం సుఖదుఃఖాల సమ్మేళనం. ఎవరి కష్టాలకు బాధలకు వారు దుఃఖపడటం, చింతించడం సహజం. ఇతరుల బాధలకు కన్నీరు పెట్టే మనుషులు సైతం అక్కడక్కడా కనపడతారు. దానికి కారణం వారి మనసు పొరల్లో కలిగిన స్పందనే.

Published : 15 Mar 2023 00:32 IST

నిషి జీవితం సుఖదుఃఖాల సమ్మేళనం. ఎవరి కష్టాలకు బాధలకు వారు దుఃఖపడటం, చింతించడం సహజం. ఇతరుల బాధలకు కన్నీరు పెట్టే మనుషులు సైతం అక్కడక్కడా కనపడతారు. దానికి కారణం వారి మనసు పొరల్లో కలిగిన స్పందనే. స్పందన మనుషుల పట్లే కాకుండా సృష్టిలో ప్రతి ప్రాణి, వస్తువుల పట్ల కలగవచ్చు. ప్రమాదం బారిన పడిన ఓ కుక్కపిల్లను చూసి మనసు ద్రవిస్తుంది ఒకరికి. దాన్ని చేరదీసి గాయాన్ని శుభ్రపరచి దాని కాలికి కట్టుకడతాడు. ప్రకృతిలోని ఏ ప్రాణికి బాధ కలిగినా అతడు అలాగే స్పందిస్తాడు.

భిక్ష కోరి వచ్చిన వటువుకు ఇవ్వడానికి ఏమీ లేక ఉసిరికాయను భిక్షాపాత్రలో వేసింది ఓ ఇల్లాలు. ఆ చర్యతో ఆమె దారిద్య్ర పరిస్థితి అర్థం అయింది శంకరులకు. ఆమె దారిద్య్రాన్ని తీర్చాలని నిశ్చయించుకుని ఆర్తితో ఆశువుగా లక్ష్మీదేవిని ప్రస్తుతించాడు. ఆ స్తుతికి సంతసించి స్పందించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయల జడివాన కురిపించింది. ఆ ప్రస్తుతి శ్లోకాలే నేటికీ లక్ష్మీ అనుగ్రహం కోసం పఠించే కనకధారా స్తోత్రంగా లోకంలో ప్రసిద్ధి చెందాయి.

మూకాంబికా క్షేత్రంలో దంపతులు తమ ఏకైక కుమారుడి మరణానికి రోదిస్తుంటే అక్కడే ఉన్న శంకరాచార్యులు వారి దుఃఖానికి ఎంతో చింతించారు. ఇంతలో అశరీరవాణి ‘రక్షించలేనివారి దయ దుఃఖాన్ని పెంచుతుందే గాని ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చదు’ అని పలికిందట. ఆ మాటనే ప్రేరణగా తీసుకున్న శంకర భగవత్పాదులు శంకరుని ప్రార్థించిన ఫలితంగా బాలుడు నిద్ర నుంచి మేల్కొన్నట్టుగా లేచి కూర్చున్నాడట. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఓ తల్లి తన ఒక్కగానొక్క కొడుకును ఆహా రంగా బకాసురుడికి పంపవలసి వచ్చింది. అప్పుడు ఆమె పడ్డ వేదనకు కుంతీదేవి హృదయం ద్రవించింది. ఆ బిడ్డకు బదులుగా తన బిడ్డల్లో ఒకడైన భీముణ్ని రాక్షసుడి వద్దకు ఆహారంగా పంపింది.

నిండుసభలో దుశ్శాసనుడు తన ఒంటిమీది వలువలు వొలిచేస్తున్నప్పుడు ద్రౌపది కృష్ణుణ్ని ఆర్తితో పిలవగానే చీరలిచ్చి రక్షించాడు. ‘మూర్ఛ వచ్చే పరిస్థితి కలుగుతోంది, ప్రాణాలు పోతాయేమోననిపిస్తోంది, ఇక పోరాడటం నావల్ల కాదు... నన్ను రక్షించు శ్రీహరీ!’ అని ప్రార్థించిన గజరాజు బాధను తన బాధగా భావించి సుదర్శన చక్రంతో భక్తుడికి ప్రత్యక్షమై ఆపద నుంచి కాపాడాడు ఆ శ్రీహరి.

దధీచి బ్రహ్మజ్ఞాని, మహాతపస్వి. వృత్రాసుర సంహార సమయంలో దేవతల ప్రార్థనతో స్పందించిన అతడు తన వెన్నెముకను, ఇతర ఎముకలను బ్రహ్మచక్రం, వజ్రాయుధం కోసం దానం చేశాడు. ఇటువంటి దయార్ద్ర హృదయులు, స్పందించే హృదయం ఉన్నవారూ నేటికీ ఉన్నారు. రక్తదానం, నేత్రదానం, అవయవ దానం లాంటివి చేస్తూ చేయూత అందించే సహృదయులు ఎందరో ఉన్నారు. ఆరోగ్య, ఆర్థిక, సామాజిక, ప్రాకృతిక సమస్యలు, మనుషుల్ని చుట్టుముట్టి భవసాగరాలలో కూరుకుపోతున్నప్పుడు చిన్న తెడ్డులా చేయూత అందించే సహృదయుడు ఎదురైతే అది వారి అదృష్టమే. మంచి మనసుతో ఇతరుల కోసం ఆలోచించే వారికి భగవంతుడు ఆత్మీయ మిత్రుడవుతాడని పౌరాణిక కథలు తెలియజెబుతున్నాయి.

గంటి ఉషాబాల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని