ధ్యాన పుష్పం

ప్రకృతిలో భాగమైన పూల మొక్కలు ఎల్లప్పుడూ ధ్యానంలో ఉంటాయి. అలా ఉండటం వాటి సహజ స్వభావం. పుష్పించడం వాటి అంతిమ లక్ష్యం. అదే రీతిన మనిషిగా జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం- ప్రాకృతికంగా ధ్యాన పుష్పానికి అంతర్లీనంగా పరితపించడం.

Published : 29 Mar 2023 00:31 IST

ప్రకృతిలో భాగమైన పూల మొక్కలు ఎల్లప్పుడూ ధ్యానంలో ఉంటాయి. అలా ఉండటం వాటి సహజ స్వభావం. పుష్పించడం వాటి అంతిమ లక్ష్యం. అదే రీతిన మనిషిగా జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం- ప్రాకృతికంగా ధ్యాన పుష్పానికి అంతర్లీనంగా పరితపించడం. కాని, ప్రకృతి మొత్తం ధ్యానోత్సవం జరుపుకొంటూంటే, ఒక్క మనిషి మాత్రం అందుకు భిన్నంగా బతుకీడ్వటం విచారకరం.

తల్లిగర్భంలో ధ్యానక్రియతో సంపూర్ణ ఆకృతి దాల్చిన మనిషి బాహ్య ప్రపంచంలోకి అడిగిడగానే(పుట్టగానే) ధ్యానం తాలూకు ఎరుకను క్రమంగా మరచిపోవడం మొదలుపెడతాడు. అందువల్లే మనిషి బాల్యమంతా నిండు ఆరోగ్యంతో, ఆనందంగా గడిపి- వయసు పెరిగి వృద్ధాప్యాన్ని సమీపిస్తుంటే అనారోగ్యానికో, అశాంతికో చేరువవుతుంటాడు.  కోల్పోయిన ఆనందం తిరిగి పొందడానికి, జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ధ్యానం ఉపకరిస్తుంది. సుదీర్ఘానుభవంతో పొందిన బుద్ధిబలాన్ని మనిషి కేవలం ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడంకోసం ప్రాపంచిక సౌఖ్యాలనిచ్చే వ్యామోహాల ఆకలి తీర్చడం కోసం వినియోగిస్తున్నాడే తప్ప- అసలైన అంతర్‌ జ్ఞాన విధివైపు దృష్టి సారించడానికి ఇష్టపడటంలేదు. ఎంతో సాఫీగా సాగే సహజాతిసహజ జీవన గమ నాన్ని ఉరుకులు, పరుగులతో అత లాకుతలం చేసుకుంటున్నాడు. ప్రధా నంగా ఆయుఃప్రమాణం గరిష్ఠంగా నిలవడానికి ఉపకరించే నిద్రా దేవతనూ విస్మరిస్తున్నాడు. నిద్ర- మనిషికి ప్రకృతి ప్రసాదించిన అత్యంత విలువైన వరం. అది మనిషి జీవితకాలంలో సగ భాగం. కాలం నిండుకున్నాక నీకు జన్మ ఇచ్చినవాళ్లు మృత్యువు ఒడిలోకి చేరిపోతారు. నువ్వు జన్మ ఇచ్చినవాళ్లు బతుకుతెరువుకోసం దూరతీరాలకు వలసపోతారు. నీ తోబుట్టువులూ ఎవరిదారి వారు చూసుకుంటారు. ముందో వెనకాలో ఆయుష్షు తీరగానే జీవిత భాగస్వామీ కాలం చేయక తప్పదు. కానీ, నిద్రమాత్రం జీవితాంతం నీ వెన్నంటే ఉంటుంది.

ఉషోదయం, సాయం సంధ్యావేళల్లో ధ్యానం మంచిదని జీవితాన్ని పండించుకున్నవాళ్లు చెబుతారు. మానసికంగా, శారీరకంగా శ్రమించి అలసిసొలసిన మనిషిని ప్రకృతే నిద్రలోకి జారుస్తుంది. ఎందుకంటే, నిద్ర కూడా ధ్యానం లాంటిది. దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం, ఆకలి అనిపించినప్పుడు ఆహారం సేవించడం, నిద్ర వచ్చినప్పుడు ఉపక్రమించడం... ఇవన్నీ ప్రాకృతిక ప్రామాణిక ధార్మిక జీవనం కిందకే వస్తాయి.

ధ్యానం- ఎరుకతో కూడిన నిద్ర. నిద్ర- ఎరుకలేని ధ్యానం. ఈ రెండూ మనిషికి ప్రాథమికంగా ఆరోగ్యం సమకూర్చేవి. బురదమయమైన ఒక నీటి కొలను నిలకడ స్థితికి వచ్చినప్పుడు మళ్ళీ స్వచ్ఛమైన తేట నీళ్లతో కళకళలాడుతుంది. అదేరీతిన అనేకానేక ఆలోచనలతో సతమతమయ్యే మనసూ ఏ ఆలోచనా లేకుండా నిశ్చల స్థితికి చేరుకున్నప్పుడు- అది నిర్మలం అవుతుంది. ఫలితంగా దాని ప్రభావం శరీరంపైనా పడుతుంది. కలతలే లేని కమ్మని నిద్రలో మనశ్శరీరాలు పూర్తి విశ్రాంతిలో ఉంటాయి. అప్పుడు ప్రకృతి అంతటా నిండిన విశ్వశక్తిని అవి తిరిగి పొందుతాయి. అందువల్లే, ఉదయం నిద్ర లేవగానే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. చుట్టూ పరచుకున్న జీవితం కొత్త అనుభూతి కలిగిస్తుంది!

మునిమడుగుల రాజారావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని