చాణక్యనీ(రీ)తి

కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు జగద్గురువై అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత నాటి నుంచి నేటి వరకు ఎందరికో మార్గదర్శి అయింది. ఆ కోవకు చెందినదే చాణక్యనీతి. పాటలీపుత్రంలో తనపట్ల నందరాజుల దుశ్చర్యకు పంతం పట్టి, వాళ్లను సింహాసనం నుంచి దించేదాకా జుట్టు(సిగ) ముడి వేయనని శపథం చేస్తాడు చాణక్యుడు.

Published : 19 May 2023 00:42 IST

కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు జగద్గురువై అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత నాటి నుంచి నేటి వరకు ఎందరికో మార్గదర్శి అయింది. ఆ కోవకు చెందినదే చాణక్యనీతి.

పాటలీపుత్రంలో తనపట్ల నందరాజుల దుశ్చర్యకు పంతం పట్టి, వాళ్లను సింహాసనం నుంచి దించేదాకా జుట్టు(సిగ) ముడి వేయనని శపథం చేస్తాడు చాణక్యుడు. నందరాజుల సంహారం జరిగాక, మౌర్యుడైన చంద్రగుప్తుణ్ని సింహాసనంపై అధిష్ఠింపజేసి, జడముడి వేసుకుని ప్రతిజ్ఞ నెగ్గించుకున్న ధీశాలి. రాజ్యాధికారం కోసం పాటలీపుత్రంలో జరిగిన కుట్రలు, కుతంత్రాలు విస్తుగొలుపుతాయి. పాటలీపుత్రాన్ని మగధ సామ్రాజ్యంగా విస్తరింపజేయడంలో చాణక్యుడి పాత్ర ప్రశంసనీయమైనది. చణకుడి పుత్రుడు కావడం వల్ల చాణక్యుడైనాడు. అసలు పేరు విష్ణుగుప్తుడు. కుశాగ్రబుద్ధి గలిగిన మేధావి. కుటిల రాజనీతిని ఒంట పట్టించుకోవడంవల్ల కౌటిల్యుడిగా ప్రసిద్ధుడయ్యాడు. కొంతమంది అది చాణక్యుడి గోత్రమని అంటారు. చాణక్యుడికి ఆత్మాభిమానం ఎక్కువ. తీక్షణ స్వభావం కలిగి, దృఢమైన సంకల్పంతో, అత్యంత ప్రతిభావంతుడైన యుగద్రష్టగా పేరు పొందాడు. బుద్ధిబలాన్ని అమితంగా విశ్వసించే చాణక్యుడు జగత్తంతా దైవాధీనం ప్రకారం నడుస్తుందనేది భ్రమగా భావించేవాడు.

చంద్రగుప్తుడి రాజ గురువు, ప్రధాన మంత్రి, హితైషి, ఉత్తమ రాజనీతిజ్ఞుడైన చాణక్యుడు పట్టణానికి వెలుపల ఒక కుటీరంలో సాధారణ జీవితం గడిపేవాడు. చైనా దేశపు యాత్రికుడు ఫాహియాన్‌ బౌద్ధ గ్రంథాలు సేకరిస్తూ మగధకు చేరి ’విశాల దేశపు ప్రధానమంత్రి ఒక చిన్న కుటీరంలో బతుకుతున్నాడు. ప్రజలు సుఖ శాంతులతో ఆకాశ హర్మ్యాలలో నివసిస్తున్నారు’ అని తన పుస్తకంలో రాసుకున్నాడు. నాయకులు ప్రజాసేవాతత్పరులై, నిరాడంబర జీవితం గడపాలన్నది చాణక్యసందేశం.

భారతదేశాన్ని పరిపాలించే నాయకులకు రాజనీతిలో తగిన శిక్షణ అందించడానికి అర్థశాస్త్రం, లఘు చాణక్య, వృద్ధ చాణక్య, చాణక్య నీతి శాస్త్రాలను అందించాడు చాణక్యుడు. సిద్ధాంతపరమైన గ్రంథాల్లో చాణక్యనీతికి ఒక ఉత్కృష్ట స్థానం ఉంది. జీవితాన్ని సుఖమయం, సఫలం చేసుకోవడానికి అవసరమైన అంశాలెన్నో వాటిలో పొందుపరచి ఉన్నాయి. ఆదర్శవంతమైన పాలనావ్యవస్థ కోసం వేసే ప్రణాళికలు- ప్రజలు, భూమి ధనధాన్యాదులను సమకూర్చుకోడానికి మూలాధికారం కలిగించేలా ఉండాలంటాడు చాణక్యుడు. బృహత్తర పథకాల పేరుతో పన్నుల భారం మోపి ప్రజల నడ్డి విరగ్గొట్టరాదని ఆనాడే బోధించాడు.

అనుభవంతో ఏర్పరచుకొన్న నమ్మకాలను ప్రాణప్రదంగా చూసుకోవాలి. శరీరానికి రోగం వస్తే అది శత్రువుకంటే అధికంగా బాధిస్తుంది. ధనవంతుణ్ని ప్రపంచం గౌరవిస్తుంది. ప్రతిభ ఉన్నవాడికి అన్నానికి లోటుండదు. పూవులు పూయని చెట్టును తుమ్మెదలు చేరవు. బీదవాడికి విద్యే ధనం. వయసును బట్టి వేషధారణ. బుద్ధి ఎలా ఉంటే వైభవం అలా ఉంటుంది. ఇవి చాణక్యుడు మనకందించిన మంచి ముత్యాలసరాలు. ఉత్తమ నడవడిక, వ్యవహార దక్షత, ధర్మం, కర్తవ్యనిష్ఠ, కర్మశీలత్వం- మానవ పురోగతికి దోహదపడతాయన్నది చాణక్యుడి నీతి వచనాలు.

ప్రతాప వెంకట సుబ్బారాయుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని