దేవుడు మెచ్చిన పూలు

మనం భగవంతుడి పట్ల భక్తి ప్రపత్తులతో, ప్రేమతో ఎన్నోరకాల పుష్పాలు తెచ్చి పూజిస్తాం. మల్లెలు, మొల్లలు, మందారాలు, సంపెంగలు, గులాబీలు, పారిజాతాలు- ఇలా ఎన్నెన్నో పూలతో పూజిస్తూ భగవదర్చనలో భాగంగా భావించి, తృప్తిచెందుతాం. ఉపాసన రెండువిధాలుగా ఉంటుంది- సగుణోపాసన, నిర్గుణోపాసన అని.

Published : 20 Nov 2023 00:38 IST

మనం భగవంతుడి పట్ల భక్తి ప్రపత్తులతో, ప్రేమతో ఎన్నోరకాల పుష్పాలు తెచ్చి పూజిస్తాం. మల్లెలు, మొల్లలు, మందారాలు, సంపెంగలు, గులాబీలు, పారిజాతాలు- ఇలా ఎన్నెన్నో పూలతో పూజిస్తూ భగవదర్చనలో భాగంగా భావించి, తృప్తిచెందుతాం. ఉపాసన రెండువిధాలుగా ఉంటుంది- సగుణోపాసన, నిర్గుణోపాసన అని. దైవాన్ని ఓ విగ్రహంలోనో, పటంలోనో, శిలలోనో చూసుకుంటూ, అదే నమ్మకంతో పూలు, ధూపదీప నైవేద్య, తాంబూలాదులతో అర్చించడం సగుణోపాసన. పేరు, రూపం మొదలైనవి ఏవీ లేవని, స్వామి నిర్గుణ పరబ్రహ్మస్వరూపుడని ఆత్మజ్ఞానంతో, ధ్యానంతో ఉపాసించడమనేది నిర్గుణోపాసన.
కొద్దికాలమే ఉండి, తరవాత వాడి, వాసన కోల్పోయి, నిర్మాల్యంగా మిగిలిపోయే ఈ పూలకంటే నిజంగా దైవం మెచ్చిన పూలు వేరే ఉన్నాయి. అవి అంతర్యామికి అర్పించుకోవడమే అసలైన పూజ అని విజ్ఞులు చెబుతున్నారు.

పరమాత్మకు అందించవలసిన ప్రథమపుష్పం అహింస. మనం అహింసా ధర్మం పాటిస్తే ఆ పుష్పంతో పరంధాముణ్ని పూజించినట్లే. లోకంలో దీన్ని మించిన ధర్మం లేదు కనుక దీన్ని పరమధర్మం అన్నారు. శారీరకంగా సాటివారిని హింసించడం శారీరక హింస. మానసికంగా హింసించడం మానసిక హింస. ఈ రెండూ మనిషికి కూడనివి.

రెండో కుసుమం- ఇంద్రియ సంయమనం. మనిషి ఇంద్రియ నిగ్రహం అలవరచుకుంటే పాపాలు చేయడు. నేడు ముఖ్యంగా సంయమనలోపం వల్లనే సమాజంలో ఎన్నో దుష్కృతాలు జరుగుతున్నాయి. దోపిళ్లు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు, పగలు, ప్రతీకారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మనోనియంత్రణ ఉంటే ఇటువంటి అల్లకల్లోలాలు చాలావరకు తగ్గుతాయి.

మూడోది దయాపుష్పం. సృష్టిలోని ప్రతి ప్రాణికీ జీవించే హక్కుంది. ‘బతుకు, బతకనివ్వు’ అన్నారు అందుకే! సమాజం ఎంతోమంది అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, పీడితులు, క్షుద్బాధతో అలమటిస్తున్నవారున్నారు. వారిపట్ల దయ చూపించడమే కాక, ఆదుకుని చేయి అందించడం మన ధర్మం. ఈ దయా ప్రసూనాన్నే దేవుడు స్వీకరిస్తాడు.

మరో పుష్పం - క్షమా పుష్పం. క్షమ అంటే ఓర్పు, సహనం. క్షమ అనేది మనిషికి పెట్టని ఆభరణం. క్షమ వల్ల ఖ్యాతి లభిస్తుంది. గౌరవం, అధికారం, అభిమానం సహనం వల్లనే లభిస్తాయి.

ఆశ్రితవత్సలుడు మెచ్చే మరో అపురూప ప్రసూనం- శాంతి. ఎన్ని కష్టాలు పడ్డా తుకారాం, మీరాబాయి శాంతిని విడనాడలేదు.

తపఃపుష్పం దేవుడు మెచ్చే మరో పుష్పం. అడవుల్లో చేసేదే తపస్సు కాదు. నిరంతరం త్రికరణ శుద్ధిగా దైవాన్ని స్మరిస్తూ తన కర్తవ్య నిర్వహణలో నిమగ్నం కావడమూ తపస్సే. అరిషడ్వర్గాలను దూరంగా ఉంచి, తమ విధులనే నిధులుగా భావించేవారిని భగవంతుడు ఇష్టపడతాడు.

మరో పుష్పం ధ్యాన పుష్పం. శ్వాసపైన ధ్యాస ఉంచి, అహం బ్రహ్మాస్మి అనుకోగల పరిణతి పొందడమే ధ్యాన పుష్పం.

చివరి పుష్పం సత్యం. విశ్వమంతా సత్యం మీదనే ఆధారపడి ఉంది. సత్యం నిత్యమైనది. శాశ్వతమైనది. సత్యమే దైవమన్నారు.

ఈ అష్టగుణ సుమాలతో చేసే ఆరాధనే తనకిష్టమన్నాడు ఆపద్బాంధవుడు.

చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని