bill payments: బిల్లుల గోస!

బిల్లులు... బకాయిలు... పెండింగు... నిధుల కొరత... రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో వివిధ పనులు చేస్తున్న వారిని కొన్ని నెలలుగా వెంటాడుతున్న మాటలివి. సకాలంలో డబ్బులు చేతికందక బాధితులు అప్పుల పాలవుతున్నారు. వాటిలో మచ్చుకు మూడింటిని పరిశీలిస్తే.... కరోనా సమయంలోనూ అధికారుల ఒత్తిడితో ‘నవరత్నాలు... పేదలందరికీ ఇళ్ల’ను నిర్మించుకుంటున్న

Updated : 30 Sep 2021 05:42 IST

ఇల్లు కట్టుకుంటున్నా బిల్లు ఇవ్వరేం!

గృహ నిర్మాణ బకాయిలు  రూ.500 కోట్లు

5.90 లక్షల నరేగా పనిదినాల బిల్లూ పెండింగే


అప్పులతో వడ్డింపు

మధ్యాహ్న భోజన వంట నిర్వాహకులకు వెతలు

రాష్ట్రవ్యాప్తంగా రూ.55 కోట్ల బకాయిలు


పాత బకాయిల ఊసేలేదు

ఎల్‌ఈడీ వీధి దీపాల ప్రాజెక్టు చుట్టూ చీకట్లు
పంచాయతీలకు పూర్తిగా బాధ్యత అప్పగించే యత్నం


బిల్లులు... బకాయిలు... పెండింగు... నిధుల కొరత... రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో వివిధ పనులు చేస్తున్న వారిని కొన్ని నెలలుగా వెంటాడుతున్న మాటలివి. సకాలంలో డబ్బులు చేతికందక బాధితులు అప్పుల పాలవుతున్నారు. వాటిలో మచ్చుకు మూడింటిని పరిశీలిస్తే.... కరోనా సమయంలోనూ అధికారుల ఒత్తిడితో ‘నవరత్నాలు... పేదలందరికీ ఇళ్ల’ను నిర్మించుకుంటున్న వారికి రూ.500 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. చేతిలో డబ్బు లేకపోవడంతో ఆపై పనులు చేపట్టేందుకు లబ్ధిదారులు ససేమిరా అంటున్నారు. ఈ పథకంలో భాగంగా ఉపాధి హామీ పథకం(నరేగా) కింద చెల్లించాల్సిన రూ.14 కోట్లూ విడుదలవడంలేదు. తక్కువ విద్యుత్తు వినియోగంతో గ్రామాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొచ్చిన ఎల్‌ఈడీ వీధి దీపాల పథకానిదీ అదే దారి. పథకాన్ని నిర్వహిస్తున్న ఇంధన సంస్థలకు ప్రభుత్వం రూ.28 కోట్లకుపైగా బకాయి పడింది. చెల్లింపుల్లో తీవ్ర జాప్యంపై మొరపెట్టుకుంటున్నా సరైన స్పందన లేదని బాధితులు వాపోతున్నారు. ఇక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట చేస్తున్న
మహిళలకూ బకాయిల బెడద తప్పడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా 41.60 లక్షల మంది విద్యార్థులకు వండిపెడుతున్న ఏజెన్సీల బాధ్యులకు రూ.55 కోట్ల వరకు రావాల్సి ఉంది. పిల్లలకు భోజనం ఆపకూడదనే ఉద్దేశంతో మహిళలు ప్రైవేటుగా వడ్డీలకు అప్పులు తెస్తూ పథకాన్ని కొనసాగిస్తుండటం గమనార్హం.


ఇల్లు కట్టుకుంటున్నా బిల్లు ఇవ్వరేం!

ఈనాడు డిజిటల్‌, అమరావతి: లబ్ధిదారులు తక్షణమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా ఒత్తిడి చేస్తున్న ప్రభుత్వం బిల్లుల చెల్లింపులో మాత్రం జాప్యం చేస్తోంది. కరోనా కష్టకాలంలోనూ అధికారుల సూచన మేరకు అప్పోసప్పో చేసి పనులు ప్రారంభిస్తున్న పేదలు... సకాలంలో డబ్బుల రాక ఇబ్బందులు పడుతున్నారు. మొదటి విడతగా చేపట్టిన ఇళ్లన్నీ సెప్టెంబరు నెలాఖరుకు బేస్‌మెంట్‌ స్థాయికి చేరే గడువు నిర్దేశించిన ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని చేరిన వాటికి బకాయిలు చెల్లించడంలో ఆలస్యం చేస్తోంది.

బేస్‌మెంట్‌ స్థాయి దాటినవి 1.70 లక్షలు

పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో మొదటి విడతగా చేపట్టిన 15.60 లక్షల ఇళ్ల నిర్మాణంలో 1.70 లక్షల గృహాల నిర్మాణాలు బేస్‌మెంట్‌, ఆపై స్థాయికి చేరాయి. వీటికిగాను ఇప్పటివరకు రూ.400 కోట్ల వరకు బిల్లులను చెల్లించగా.... ఇంకా దాదాపుగా రూ.500 కోట్ల మేర పెండింగ్‌ ఉన్నాయి. ప్రస్తుతం ఆగస్టు 15 వరకు ఉన్న బిల్లులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత అప్‌లోడ్‌ చేసిన వాటికి చెల్లింపులు లేవు. రాష్ట్రంలో రోజుకు రూ.15-20 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి.

పునాది దశలోనే 8 లక్షల గృహాలు

జులైలో చేపట్టిన సామూహిక శంకుస్థాపనలో దాదాపు 10 లక్షల గృహాలకు భూమిపూజ చేయగా... వాటిలో ఇప్పటికీ 8 లక్షల గృహాలు పునాది స్థాయిలోనే ఉన్నాయి. చేతిలో డబ్బు లేక ఆపై పనులు చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుందేమోనని ఎదురుచూస్తున్న వారూ ఉన్నారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించి, బిల్లులందని వారు మాత్రం... తాము ఖర్చు చేసిన మొత్తం చేతికందితే తప్ప ఇక ముందుకెళ్లే పరిస్థితి లేదని క్షేత్రస్థాయిలో అధికారులకు తెగేసి చెబుతున్నారు.

ఉపాధి హామీ పనిదినాల డబ్బులకూ ఎదురుచూపులే

పట్టణాభివృద్ధి సంస్థల్లో చేపట్టే ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ రూ.1.50 లక్షలతోపాటు ఉపాధి హామీ పథకం(నరేగా) కింద రూ.30 వేలు వినియోగించుకోవచ్చు. ఈ మొత్తాన్ని నిర్మాణం పూర్తయ్యేలోపు నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయాలి. బేస్‌మెంట్‌ స్థాయికి 28 పనిదినాలు, ప్లింత్‌స్థాయికి 24, లింటెల్‌స్థాయికి 10, రూఫ్‌స్థాయికి 28 పనిదినాలకు కూలి ఇవ్వాలి. వీటి చెల్లింపు గడువు 15 రోజులకు మించకూడదు. ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 9.21 లక్షల పనిదినాలు జరిగాయి. వీటిలో 3.30 లక్షల దినాలకు చెల్లింపులు జరిగాయి. ఇంకా 5.90 లక్షల పనిదినాల కూలి పెండింగ్‌లో ఉంది. ఒక పనిదినానికి రూ.245 చొప్పున మొత్తం రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉంది.

బిల్లుల చెల్లింపు కేంద్ర పరిశీలనలోనే..

కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టే పథకాలకు సంబంధించి చెల్లింపులను తప్పనిసరిగా పబ్లిక్‌ ఫైనాన్స్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(పీఎఫ్‌ఎమ్‌ఎస్‌)లో నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది. గృహనిర్మాణానికి ఇచ్చే రాయితీ దాదాపు కేంద్రమే భరిస్తున్న నేపథ్యంలో ప్రతి వ్యవహారాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. సిమెంటు, ఇనుము సరఫరాకు గుత్తేదారులకు, లబ్ధిదారులకు డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌(డీబీటీ) విధానంలో జరిగే చెల్లింపులను సవివరంగా పొందుపరుస్తున్నారు. ఈ వివరాలు నమోదు చేయని పక్షంలో కేంద్రం నుంచి రాయితీ విడుదల కాదు. అందుకే లబ్ధిదారుల బ్యాంకు ఖాతా నంబర్లు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, ఆధార్‌ కార్డు వివరాలను పీఎఫ్‌ఎమ్‌ఎస్‌లో అప్‌లోడ్‌ చేశారు.


అప్పులతో వడ్డింపు

*అనంతపురం జిల్లా కల్లూరు జిల్లాపరిషత్తు పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఏజెన్సీకి మార్చి, ఏప్రిల్‌లో వంట చేసిన బిల్లులు రూ.66,138 ఇంతవరకు విడుదల కాలేదు. ఇక్కడ పనిచేస్తున్న నలుగురు వర్కర్లకు రూ.48 వేల వరకు జీతం బకాయి ఉంది.
* నెల్లూరు గ్రామీణ మండలం కోడూరుపాడు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఏజెన్సీకి రూ.3లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. - విశాఖపట్నం జిలవరం ప్రాథమిక పాఠశాల మెయిన్‌, జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలల వంట ఏజెన్సీకి రూ.3లక్షల వరకు బిల్లు రావాల్సి ఉంది.
రాష్ట్రంలో పాఠశాలల మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. విద్యార్థుల ఆకలి తీర్చేందుకు చాలామంది వంట నిర్వాహకులు కిరాణ దుకాణాలలో అప్పులు పెట్టి సరకులు తెస్తుండగా... మరికొందరు వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు. కరోనా కారణంగా గతేడాది నవంబరు 2నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 30 వరకు పాఠశాలలు కొనసాగాయి. ఈ సమయంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు వంట చేసి, పిల్లలకు వడ్డించాయి. ఆ తర్వాత కొవిడ్‌ రెండోవేవ్‌ రావడంతో పాఠశాలలు మూతపడ్డాయి. తాజాగా ఆగస్టు 16 నుంచి పునఃప్రారంభమయ్యాయి. పాఠశాలలు కొనసాగిన సమయంలో వడ్డించిన భోజనాలకు చాలామందికి బిల్లులు విడుదల కాలేదు. రాష్ట్రంలో వంట ఏజెన్సీలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.80 కోట్ల వరకు ఉండగా... ఇటీవల రూ.25 కోట్లే విడుదల చేశారు. ఇంకా రూ.55 కోట్లు రావాల్సి ఉంది.

పెరిగిన ధరలతోనూ సమస్యలు

పప్పులు, వంటనూనెలు, గ్యాస్‌ ధరలు పెరిగాయి. విద్యార్థులు అధికంగా ఉన్నచోట ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రోజుకు రూ.4.97, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థికి రోజుకు రూ.7.45 చొప్పున చెల్లిస్తున్నారు. 1-8 తరగతుల వ్యయాన్ని కేంద్రం, 9, 10 తరగతుల వ్యయాన్ని రాష్ట్రం భరిస్తున్నాయి. వంట కార్మికులకు నెలకు రూ.3వేల చొప్పున చెల్లిస్తున్నారు. ఈ వేతనాలూ చాలా జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వరూపరాణి మాట్లాడుతూ... ‘బిల్లులు, వేతనాలను సకాలంలో చెల్లించకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వమే గ్యాస్‌ను ఉచితంగా అందించడంతోపాటు గౌరవవేతనాన్ని పెంచాలి. తమిళనాడులో మాదిరి సరకులన్నీ సరఫరా చేసి, వంట ఏజెన్సీలకు రూ.6-8వేలు వేతనాలు ఇవ్వాలి’ అని కోరారు.


ఎల్‌ఈడీ వీధి దీపాల ప్రాజెక్టు చుట్టూ చీకట్లు

గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల కథ మొదటికొచ్చేలా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుని పంచాయతీలకే మళ్లీ పూర్తిగా అప్పగించేందుకు అడుగులు పడుతున్నాయి. ఎల్‌ఈడీల నిర్వహణ సరిగా లేదంటూ ఇంధన సామర్ధ్య సేవల సంస్థ, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థలకు పంచాయతీరాజ్‌శాఖ తాజాగా తాఖీదులు జారీ చేసింది.

పాక్షికంగా మొదట బాధ్యతల తగ్గింపు

కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎల్‌ఈడీ ప్రాజెక్టుపై దృష్టి పెంచింది. ఒప్పందంపైనా ఒకటికి రెండు సార్లు సమీక్షించారు. ఎల్‌ఈడీల నిర్వహణ సరిగా లేదంటూ ఈ ఏడాది మార్చి 3న జీవో విడుదల చేసి, నిర్వహణ బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. విడి భాగాలను సరఫరా చేసేందుకే ఈఈఎస్‌ఎల్‌, ఎన్‌ఆర్‌ఈడీసీని పరిమితం చేశారు. ప్రాజెక్టు నిర్వహణతో వచ్చే ఆదాయంలో నుంచి పంచాయతీలకు ఒక్కో ఎల్‌ఈడీ నిర్వహణకు నెలకు రూ.9.65 చొప్పున ఇంధన సంస్థలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.

పాత బకాయిల ఊసేలేదు

ఎల్‌ఈడీ దీపాల ప్రాజెక్టు నిర్వహిస్తున్న ఇంధన సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.28 కోట్లకుపైగా బకాయిలు చెల్లించాలి. ఒప్పందం ప్రకారం ఈ మొత్తాలను గ్రామ పంచాయతీల నుంచి వసూలు చేసి ఇంధన సంస్థలకు ప్రతి మూడు నెలలకోసారి జమ చేసే బాధ్యత ప్రభుత్వానిది. ఈ చెల్లింపుల్లో జాప్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇంధన సంస్థలు పలుసార్లు పంచాయతీరాజ్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీటి ఊసెత్తకుండా ఎల్‌ఈడీలకు కంప్యూటరైజ్డ్‌ కంట్రోల్‌ మానిటరింగ్‌ సిస్టం (సీసీఎంఎస్‌) బాక్సులు ఏర్పాటు చేయని కారణంగా వీధి దీపాలు పగులు, రాత్రి వెలుగుతున్నాయని, చాలాచోట్ల రాత్రుల్లో వెలగడం లేదంటూ ఇంధన సంస్థలకు పంచాయతీరాజ్‌శాఖ తాఖీదులు జారీ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని