రోడ్డెక్కిన వాలంటీర్లు

గౌరవ వేతనాన్ని రూ.12 వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండు చేస్తూ గ్రామ, వార్డు వాలంటీర్లు సోమవారం రాష్ట్రంలోని పలు చోట్ల ధర్నాకు దిగారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద వేల మంది చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు రంగంలోకి దిగి కొంతమందిని అదుపులోకి తీసుకోవడంతో వాలంటీర్లు ఆగ్రహించి రహదారులపై బైఠాయించారు....

Updated : 09 Feb 2021 15:54 IST

గౌరవ వేతనం రూ.12వేలు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
భారీగా తరలిరావడంతో విజయవాడలో ఉద్రిక్తత

గౌరవ వేతనాన్ని రూ.12 వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండు చేస్తూ గ్రామ, వార్డు వాలంటీర్లు సోమవారం రాష్ట్రంలోని పలు చోట్ల ధర్నాకు దిగారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద వేల మంది చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు రంగంలోకి దిగి కొంతమందిని అదుపులోకి తీసుకోవడంతో వాలంటీర్లు ఆగ్రహించి రహదారులపై బైఠాయించారు. రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాలు, పురపాలక సంఘాల్లోనూ అధిక సంఖ్యలో వాలంటీర్లు నిరసనల్లో పాల్గొని అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. జాబ్‌ఛార్టు ఏర్పాటు చేయాలని, ఉద్యోగ వేళలు నిర్ణయించాలని, అధికారుల వేధింపుల నుంచి కాపాడాలని డిమాండు చేశారు.

ఈనాడు - అమరావతి, విజయవాడ నగరపాలక సంస్థ - న్యూస్‌టుడే: గౌరవ వేతనం రూ.12 వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ గ్రామ, వార్డు వాలంటీర్లు సోమవారం రాష్ట్రంలోని పలు చోట్ల ధర్నాకు దిగారు. ‘కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశాం. అయినా శ్రమకు తగిన గుర్తింపు లేదు. సేవాభావంతో పనిచేస్తే నెలకు ఇచ్చే గౌరవ వేతనం రూ.5 వేలేనా’ అని నినాదాలు చేశారు. ‘పనిభారం పెరిగింది.. అధికారుల నుంచి అవమానాలూ ఎదుర్కొంటున్నాం. ఫిబ్రవరిలో మొదలైన రేషన్‌ డెలివరీకి నెలకు రూ.21 వేలిస్తూ.. 18 నెలలుగా కష్టపడుతున్న వాలంటీర్లకు నెలకు రూ.5 వేలా? మమ్మల్ని ఇంత చిన్నచూపు ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదు’ అని వాపోయారు.

అదుపులోకి తీసుకున్న పోలీసులు
విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సోమవారం సుమారు 3 వేల మంది వాలంటీర్లు నిరసనలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేసేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన సిబ్బంది ప్రధాన గేట్లను మూసేశారు. దీంతో వాలంటీర్లు రహదారిపై నిరసనకు దిగారు. అనంతరం కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈలోపు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వాలంటీర్లు తరలిరావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బారికేడ్లు, తాళ్లతో వారిని ప్రధాన రహదార్ల వైపు రానీయకుండా అడ్డుకున్నారు. ముందుకొస్తున్న వారిని వెనక్కు నెట్టేశారు. దీంతో ఆగ్రహించిన వాలంటీర్లు మూడువైపులా రహదారులపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని బలవంతంగా వాహనాల్లో ఎక్కించారు. దీంతో ఇరువర్గాల మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. వాహనాలు ముందుకు కదలకుండా వాలంటీర్లు అడ్డు నిలవడంతో పోలీసులు వారిని పక్కకు నెట్టేసి, బలవంతంగా కొంతదూరం తీసుకెళ్లారు. అయినా విడవకుండా వాహనాల వెంట పరుగులు తీయడంతో పోలీసులు వారితో మాట్లాడారు. నిరసన విరమించి, వెళ్లిపోతే అందరినీ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత నగరపాలక సంస్థ అధికారులు అక్కడికి చేరుకుని.. వాలంటీర్ల డిమాండ్లను ఉన్నతాధికారులతో పాటు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు కొంతదూరం తీసుకెళ్లి వదిలిపెట్టారు. తర్వాత జిల్లా కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌ను కలిసిన వాలంటీర్లు తమ డిమాండ్లపై వినతిపత్రం ఇచ్చారు.
కాకినాడలో మూడుచోట్ల..
కాకినాడలో నగరపాలక కార్యాలయం సమీపంలో బైఠాయించిన వాలంటీర్లు.. తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. డెయిరీ ఫాం సమీపంలోని నూకాలమ్మ మాన్యం వద్ద మరికొందరు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నివాసం వద్ద కూడా మరికొందరు వాలంటీర్లు నిరసనలు చేపట్టారు. రాజమహేంద్రవరంలోని నగరపాలక కార్యాలయం వద్దకు వందలాదిగా వాలంటీర్లు తరలివచ్చారు. అధికారులకు వినతిపత్రం అందించారు. అనంతరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్దకు చేరుకుని బైఠాయించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందంటూ అధికారులు వారిని వెనక్కి పంపారు.
* అనంతపురం జిల్లా ధర్మవరంలో పురపాలక కార్యాలయం ధర్నా చేసిన వాలంటీర్లు.. గౌరవ వేతనం పెంచాలని కోరుతూ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
* గౌరవవేతనం పెంచాలంటూ తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆందోళన చేశారు.
* గుంటూరులో పలువురు వాలంటీర్లు కలెక్టరేట్‌ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు.
* కడప కలెక్టరేట్‌ వద్ద సీపీఐ, సీపీఎం నేతృత్వంలో వాలంటీర్లు ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం సంయుక్త కలెక్టరుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం ఇచ్చారు.
* విశాఖలో వాలంటీర్లు కలెక్టరేట్‌ వద్దకు వచ్చి జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం ఇచ్చారు.
* ఒంగోలు నగరపాలక సంస్థ, మార్కాపురం పురపాలక కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న వాలంటీర్లు తమ డిమాండ్లను పరిష్కరించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని