మోదీ బొమ్మతోనే ఉచిత రేషన్‌ పంపిణీ చేయండి

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) ద్వారా అందజేస్తున్న ఉచిత బియ్యం పంపిణీ సమయంలో మోదీ చిత్రపటంతో కూడిన బోర్డు తప్పనిసరిగా ఉండి తీరాల్సిందేనని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.

Updated : 09 Aug 2021 11:51 IST

విశాఖ జిల్లా పర్యటనలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం; న్యూస్‌టుడే కృష్ణదేవిపేట, కశింకోట: ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) ద్వారా అందజేస్తున్న ఉచిత బియ్యం పంపిణీ సమయంలో మోదీ చిత్రపటంతో కూడిన బోర్డు తప్పనిసరిగా ఉండి తీరాల్సిందేనని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. కేంద్రం ఉచితంగా బియ్యం ఇస్తోందనే విషయం ప్రజలకు తెలియజేయాలన్నారు. ఆదివారం విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం రేషన్‌ డిపోను ఆమె పరిశీలించారు. ‘జాతీయ ఆహార భద్రత మిషన్‌లో భాగంగా ప్రజా పంపిణీ దుకాణంలోనే లబ్ధిదారులకు రేషన్‌ అందజేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లకు తీసుకెళ్లి ఇస్తే మాకు అనవసరం. కేంద్రం వాటా రేషన్‌ దుకాణాల వద్దే ఇవ్వండి. ఇచ్చేటప్పుడు అన్ని దుకాణాల్లోనూ పీఎంజీకేఏవై బోర్డులు ప్రదర్శించండి’ అని అధికారులను ఆదేశించారు. ‘తాను వస్తున్నానని పీఎంజీకేఏవై బోర్డు పెట్టారా.. ఇంతకుముందు కూడా ఉందా’ అని డీలర్‌ను ప్రశ్నించారు. అనంతరం ఉచిత బియ్యం ఎవరు అందిస్తున్నారో తెలుసా అని లబ్ధిదారులను ఆరా తీశారు. వారి నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ను పిలిచి ఉచిత బియ్యం గురించి లబ్ధిదారులకు మా ముందే తెలియజేయాలన్నారు. దీంతో ఎమ్మెల్యే.. పీఎంజీకేఏవై ద్వారా బియ్యం ఇస్తున్నారని చెబుతూనే ‘మా అన్న పథకాలైతే చెప్పగలంగానీ ఇవేం చెప్పగలం’ అని నవ్వడంతో.. ప్రధాని మోదీ దేశంలో అందరికీ అన్నలాంటివారేనని గుర్తుంచుకోండి అంటూ మంత్రి సీతారామన్‌ పేర్కొన్నారు. గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి సీతారామరాజు, ఆయన సేనాని గంటం దొర సమాధులను నిర్మలా సీతారామన్‌ సందర్శించి నివాళులర్పించారు. 75 వారాల పాటు ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో దేశంలోని వీరుల స్మారక స్థలాలన్నీ సందర్శిస్తున్నట్లు చెప్పారు. అందులో మొదటగా మన్యం వీరుని స్మారక ప్రాంతాన్ని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎంపీలు సత్యవతి, గొడ్డేటి మాధవి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్‌ నరసింహారావు, ఎమ్మెల్యేలు ఉమాశంకర్‌ గణేష్‌, ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.


వ్యాక్సిన్‌ లక్ష్యాల్ని అధిగమించాం

ఈనాడు, విశాఖపట్నం: జులై 31 దాకా ఉన్న వ్యాక్సినేషన్‌ లక్ష్యాల్ని కేటగిరీల వారీగా అధిగమించామని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. చినవాల్తేరు ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. రాష్ట్రాల మీద భారం వేయకుండా ఉచితంగా వ్యాక్సినేషన్‌ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆగస్టు, సెప్టెంబరు నుంచి వ్యాక్సిన్‌ సరఫరా పెరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 50 కోట్ల మందికి పైగా టీకా తీసుకున్నారని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని