సత్వరం నిధులిచ్చి ఆదుకోండి

రాష్ట్రంలో చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రజలను ఆదుకోవడానికి సత్వరం నిధులివ్వాలని కేంద్ర బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. శనివారం తిరుపతిలో కేంద్రం బృందంతో రాష్ట్ర ప్రభుత్వం

Updated : 28 Nov 2021 03:17 IST

నాలుగు జిల్లాల్లో 44మంది మృతి
2.86లక్షల హెక్టార్లలో పంట నష్టం
కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: రాష్ట్రంలో చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రజలను ఆదుకోవడానికి సత్వరం నిధులివ్వాలని కేంద్ర బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. శనివారం తిరుపతిలో కేంద్రం బృందంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి సమావేశమై జరిగిన నష్టాన్ని వివరించారు. ‘ చిత్తూరు జిల్లాలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో తవ్విన చెరువులు చాలావరకు తెగిపోయాయి. కడప జిల్లాలో అన్నమయ్య రిజర్వాయర్‌కు గండితో 20మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు రాయలసీమలో ఎన్నడూ జరగలేదు. నాలుగు జిల్లాల్లో 199మండలాలు, 1,990గ్రామాలకు నష్టం జరిగింది. 211గ్రామాలు, 23పట్టణాలు ముంపునకు గురయ్యాయి. 2.31లక్షల మంది వరద బాధితులయ్యారు. మొత్తం 44మంది మృతి చెందగా... 15మంది గల్లంతయ్యారు. 5,740గృహాలు దెబ్బతిన్నాయి. 98,514గృహాలు ముంపునకు గురయ్యాయి. 2.86లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఇందులో 75శాతం వరి ఉంది. 25బృందాలుగా 260మంది ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 300మంది ఎస్టీఆర్‌ఎఫ్‌, 54అగ్నిమాపక దళాలు, 22బోట్లు, రెండు హెలికాప్టర్లు ప్రజలకు సేవలు అందించాయి. బాధితులకు రూ.2వేలు, నిత్యావసరాలు, ప్రాణనష్టం జరిగిన కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సహాయం చేశాం. పునరావాస కేంద్రాల ద్వారా 79,590మందికి సౌకర్యాలు కల్పించి రూ.3.20కోట్లు వెచ్చించాం...’ అని ఆమె వివరించారు.

రాయలచెరువు పరిశీలన
ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం రెండుగా విడిపోయింది. హోంశాఖ వ్యవహారాల మంత్రిత్వశాఖ సలహాదారు కునాల్‌ సత్యార్థి నేతృత్వంలోని బృందం తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తిలో... ఆర్థికశాఖ సంచాలకులు అభే కుమార్‌ నేతృత్వంలోని బృందం పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో శనివారం పర్యటించింది. నీరు లీకవుతున్న రాయలచెరువును పరిశీలించింది. తిరుపతి సుభాష్‌నగర్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించింది. జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి వివరించారు. జిల్లా కలెక్టరు హరినారాయణన్‌, సబ్‌ కలెక్టరు జాహ్నవి బృంద సభ్యులకు అవసరమైన సమాచారాన్ని అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని