మొగుడు కొట్టడం తప్పేం కాదు!

కొన్ని పరిస్థితుల్లో భార్యను భర్త కొట్టడం తప్పేమీ కాదని దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 శాతానికి పైగా మహిళలు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లోనైతే ఇలాంటి స్త్రీల శాతం ఏకంగా 84%గా ఉంది. జాతీయ

Updated : 29 Nov 2021 05:24 IST

14 రాష్ట్రాల్లో 30% మహిళల మాటిదే

తెలుగు రాష్ట్రాల్లో 84% ఇదే బాటలో..

దిల్లీ: కొన్ని పరిస్థితుల్లో భార్యను భర్త కొట్టడం తప్పేమీ కాదని దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 శాతానికి పైగా మహిళలు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లోనైతే ఇలాంటి స్త్రీల శాతం ఏకంగా 84%గా ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌)-5 ఈ మేరకు వివరాలను బయటపెట్టింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఈ అంశంపై సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగా.. ‘‘భార్యను భర్త కొట్టడం మీ అభిప్రాయంలో సబబేనా?’’ అనే ప్రశ్నను మహిళల ముందుంచారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించడం, అత్తింటివారిని ఆమె గౌరవించకపోవడం, మొగుడితో వాదనకు దిగడం, భర్తతో శృంగారానికి నిరాకరించడం, ఆయనకు చెప్పకుండా బయటకు వెళ్లడం, ఇంటిని/పిల్లలను నిర్లక్ష్యం చేయడం, మంచి ఆహారాన్ని వండకపోవడం వంటి పరిస్థితులు తలెత్తినట్లు ఊహించుకొని సమాధానాలు చెప్పాలని వారికి సూచించారు.

సర్వేలో తేలిన ముఖ్యాంశాలివీ..

* మూడు రాష్ట్రాల్లో 75% పైగా మహిళలు.. భార్యను భర్త కొట్టడం సబబేనని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో వారి శాతం 84%గా (సర్వేలో పాల్గొన్నవారిలో) ఉండగా.. కర్ణాటకలో 77%గా నమోదైంది.

* మణిపుర్‌ (66%), కేరళ (52%), జమ్మూ-కశ్మీర్‌ (49%), మహారాష్ట్ర (44%), పశ్చిమ బెంగాల్‌ (42%)ల్లోనూ మొగుడు చితకబాదడాన్ని సమర్థించే స్త్రీల సంఖ్య ఎక్కువగానే ఉంది.

* ఇంటిని/పిల్లల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు, అత్తింటివారిని గౌరవించనప్పుడు భార్యను భర్త కొట్టడం సమంజసమేనని అత్యధిక మంది మహిళలు అభిప్రాయపడ్డారు. అత్తింటివారిని గౌరవించకపోవడాన్ని ప్రధాన కారణంగా తెలంగాణ సహా 13 రాష్ట్రాల స్త్రీలు పేర్కొన్నారు.

* అత్యల్పంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో 14.8% మహిళలు మొగుడు కొట్టడాన్ని సమర్థించారు.

* భార్యను భర్త కొట్టడాన్ని.. మహిళలతో పోలిస్తే తక్కువ మంది పురుషులు సమర్థించడం కొసమెరుపు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని