ఒమిక్రాన్‌పై సన్నద్ధంగా ఉండాలి: సీఎం

కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ ప్రభావం నేపథ్యంలో అపమ్రత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరుల్లోని

Updated : 30 Nov 2021 13:03 IST

వ్యాక్సిన్‌ పంపిణీలో దూకుడు పెంచాలి

అధికారులకు సీఎం ఆదేశాలు

ఈనాడు, అమరావతి: కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ ప్రభావం నేపథ్యంలో అపమ్రత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరుల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీ చిరునామాతో వచ్చే వారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు మాత్రమే చేయాలని స్పష్టం చేశారు. కొవిడ్‌ పరిణామాలు, ఇతర అంశాలపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం సమీక్షించారు. గతంలో కొవిడ్‌ చికిత్స కోసం ఉపయోగించిన ఆసుపత్రుల్లో సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా? లేవా? పరిశీలించాలన్నారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయో మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని సూచించారు. కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలను తగిన సౌకర్యాలతో సిద్ధంగా ఉంచాలని, 104 కాల్‌ సెంటర్ల పనితీరును పరిశీలించాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని చెప్పారు. ఇంటింటి సర్వే ద్వారా జ్వరాల వివరాల సేకరణ జరుగుతూనే ఉండాలన్నారు. వ్యాక్సినేషన్‌లో దూకుడు పెంచాలన్నారు. డిసెంబరు నెలాఖరు నాటికి 2 కోట్ల డోసుల టీకాల పంపిణీ పూర్తిచేయాలని సూచించారు. టెండర్లు పూర్తయిన వైద్య కళాశాలలకు సంబంధించిన ఒప్పందాలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ మూడో విడత సంకేతాల నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాల మేరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ‘త్వరలో విజయవాడలోనే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటవుతుంది. రాష్ట్రంలో ఒక డోసు టీకా తీసుకున్నవారు 87.43%, రెండు డోసులు పొందినవారు 62.19% మంది ఉన్నారు. జనవరి నాటికి రాష్ట్రంలో రెండు డోసుల పంపిణీని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు.

7 రోజుల తర్వాత మళ్లీ పరీక్ష: ఒమిక్రాన్‌ ప్రభావం నేపథ్యంలో గుర్తించిన దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినా మళ్లీ వారం తర్వాత పరీక్ష చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అప్పటివరకు వారి ఆరోగ్య పరిస్థితిని నిశితంగా గమనించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని