Telugu Medium: అయిననూ చేసి తీరవలె!

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆంగ్ల మాధ్యమం అమలుకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున టెలికాన్ఫరెన్సుల ద్వారా మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. రాయలసీమ

Updated : 07 Dec 2021 17:20 IST

సుప్రీంలో కేసున్నా తెలుగు మాధ్యమం రద్దుకు చర్యలు..

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఎత్తివేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆంగ్ల మాధ్యమం అమలుకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున టెలికాన్ఫరెన్సుల ద్వారా మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలకు చెందిన జిల్లా విద్యాధికారులు ఇటీవల టెలి కాన్ఫరెన్సు నిర్వహించగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ తరఫున అధికారులు పాల్గొన్నారు. ఉన్నత పాఠశాలల్లో 3 నుంచి 8 తరగతుల దాకా ఒకే మాధ్యమం, ఒకే సెక్షన్‌ ఉండాలని ఆదేశించారు. ఒక మాధ్యమం ప్రకారమే ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తిని లెక్కించాలని ఆ ప్రకారం టీచర్ల జాబితాను పంపాలని సూచించారు. 9, 10 తరగతులకు రెండు మాధ్యమాలనూ కొనసాగించాలన్నారు. ఒకే మాధ్యమమంటే దేనిని ఉంచాలి? దేనిని తొలగించాలి?... అని కొంతమంది ప్రధానోపాధ్యాయులు ప్రశ్నించడంతో సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున తాము చెప్పకూడదని ఉన్నతాధికారులు సమాధానమిచ్చారు. 6, 7, 8 తరగతుల్లో తెలుగు మాధ్యమ విద్యార్థులు తక్కువగా ఉంటే వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఆంగ్ల మాధ్యమంలో కలిపేయాలని ఓ అధికారి వెల్లడించారు.

 ఉపాధ్యాయుల సర్దుబాటుకు ఎత్తుగడ..

నూతన విద్యా విధానమంటూ 2,663 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కలిపారు. ఏకోపాధ్యాయ ప్రాథమిక బడుల నుంచి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు విద్యార్థులు వచ్చినా ఉపాధ్యాయులు రాలేదు. వీరికి సబ్జెక్టుల వారీగా బోధన సాగించేందుకు టీచర్ల కొరత ఏర్పడింది. దీన్ని పరిష్కరించేందుకు ఒకే మాధ్యమ విధానాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. 60 మంది విద్యార్థుల వరకు ఒకే సెక్షన్‌ ఏర్పాటు చేయాలని ఇంకా పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటే మరో సెక్షన్‌ పెట్టాలని సూచించారు. మాధ్యమాలతో సంబంధం లేకుండా 40 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ చొప్పున... ఉపాధ్యాయులు, విద్యార్థుల జాబితాను సిద్ధం చేసి పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో మిగిలిన ఉపాధ్యాయులను అవసరమైన బడులకు సర్దుబాటు చేయనున్నారు.

 బోధన ఎలా?

తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కలిపేస్తే బోధన సాగించడం ఎలా? అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. అకడమిక్‌ మధ్యలో ఇలాంటి నిర్ణయంతో సమస్యలొస్తాయని పేర్కొంటున్నారు. ఆంగ్ల మాధ్యమం అమలు కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున రెండు మాధ్యమాలను కలిపేసినా? తెలుగును తొలగించినా తమకు ఇబ్బందులొస్తాయని ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత, ప్రాథమికోన్నత బడుల్లో ప్రస్తుతం తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల తరగతులను కలిపి బోధిస్తున్నారు. ఎవరికైనా భాషా సబ్జెక్టు ఒక్కటే కావడంతో సమస్య ఏర్పడటం లేదు. సబ్జెక్టు ఉపాధ్యాయులు వారానికి 32 పీరియడ్‌లు బోధిస్తున్నారు. ఇప్పుడు దీన్ని 48కు పెంచనున్నారు. తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున సబ్జెక్టు టీచర్లను ఇవ్వనున్నారు. 60 మంది లోపు ఉంటే ఒకే సెక్షన్‌ ఉంటుంది. సబ్జెక్టుకు ఒక్కరినే ఇస్తారు.

ఆ బడుల్లో విలీనం లేదు..

రాష్ట్రంలో 100 మందిలోపు విద్యార్థులున్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విలీనం నిలిపివేయాలంటూ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో వీటిని ఏం చేస్తారనే దానిపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


రెండూ ఉండాలి

తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు రెండింటినీ కొనసాగించాలి. ఎవరికి ఇష్టమైన దానిలో వారు చదువుకుంటారు. మాధ్యమం ఎంచుకునే అవకాశం పిల్లలకు ఉండాలి. మాతృభాష మాధ్యమం లేకపోతే బడి మానేసేవారు పెరుగుతారు.

- వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు, ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని