ప్రభుత్వ పథకాలకు సీఎం పేరుపై హైకోర్టులో పిల్‌

ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేస్తున్న సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, రాజకీయ నేతల పేర్లు పెట్టి వ్యక్తిగత ప్రచారం, ప్రయోజనం పొందడం చట్టవిరుద్ధమైన

Updated : 09 Dec 2021 05:53 IST

కేంద్రం సీఎస్‌కు రాసిన లేఖను కోర్టు ముందు ఉంచండి

పిటిషనర్‌కు సూచించిన ధర్మాసనం

విచారణ పది రోజులకు వాయిదా

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేస్తున్న సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, రాజకీయ నేతల పేర్లు పెట్టి వ్యక్తిగత ప్రచారం, ప్రయోజనం పొందడం చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. పథకాల పేర్ల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం, పెట్టిన పేర్లను పరిశీలించి ఆ వివరాలను కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్న సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం సొంత పేర్లను ఎలా పెట్టుకుంటుందని ప్రశ్నిస్తూ కేంద్రం..

రాష్ట్ర సీఎస్‌కు రాసిన లేఖ వివరాలను అదనపు అఫిడవిట్‌ రూపంలో కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌కు తెలిపింది. ఈ విచారణను పది రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ కె.మన్మథరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి రాజకీయ నేతల పేర్లతో పాటు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్లు పెట్టడాన్ని సవాలు చేస్తూ డాక్టర్‌ మద్దిపాటి శైలజ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని