రూ.320 కోట్ల మళ్లింపు!

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వివిధ బిల్లుల రూపంలో కేంద్రం రూ.320 కోట్లు తిరిగి చెల్లించినా ఆ మొత్తం రాష్ట్రంలోని ఇతర అవసరాలకు మళ్లిపోయింది. ఆ నిధులను పోలవరం ప్రాజెక్టు అవసరాలకు ఖర్చు చేయలేకపోయారు. ఈ

Published : 13 Jan 2022 02:28 IST

ఈసారి ఆర్థికశాఖ నుంచే పోలవరం నిధులు

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వివిధ బిల్లుల రూపంలో కేంద్రం రూ.320 కోట్లు తిరిగి చెల్లించినా ఆ మొత్తం రాష్ట్రంలోని ఇతర అవసరాలకు మళ్లిపోయింది. ఆ నిధులను పోలవరం ప్రాజెక్టు అవసరాలకు ఖర్చు చేయలేకపోయారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే రాష్ట్రం ఖర్చుచేసిన దాదాపు రూ.2,100 కోట్ల బిల్లులు కేంద్రం వద్ద పెండింగులో ఉన్నాయి. అందులో తాజాగా గతవారం రూ.320 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆర్బీఐ ఖాతాకు చేరుకున్నాయి. ఆ నిధులు వస్తాయని పోలవరంలో భాగస్వాములు అనేకమంది ఎదురుచూస్తున్నారు. కానీ ఈ రూ.320 కోట్లు పోలవరం అవసరాలకు ఇవ్వలేదు. ఇతర అవసరాలకు ఖర్చుచేయాల్సి వచ్చింది.

మరోవైపు పోలవరం ప్రధాన డ్యాం, ఇతరత్రా నిర్మాణ బిల్లుల రూపంలోనే రూ.900 కోట్ల వరకు చెల్లింపులు పెండింగులో ఉన్నాయని సమాచారం. ఆ నిధులు సకాలంలో అందక పనులు కాస్త వేగం తగ్గాయి. మరోవైపు తమకు నిధులు ఇవ్వట్లేదంటూ నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. వీరితో దీక్షలు విరమింపజేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు వీరిని కలిసి హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి నిధులు రాగానే నిర్వాసితుల కోసమే ఖర్చు చేస్తామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. మరో రూ.390 కోట్ల విడుదలకు కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. ఆ నిధులు వచ్చాకైనా తమ ఆశలు నెరవేరుతాయా అని ఎదురుచూస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కోసం ప్రత్యేక ఖాతా ప్రారంభించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ సన్నాహాలు చేసినా ఏపీ ఆర్థికశాఖ అధికారులు అందుకు ససేమిరా అన్నారు. ¸కేంద్రం తొలుత అడ్వాన్సుగా నిధులిచ్చే పక్షంలో ప్రత్యేక ఖాతా ఏర్పాటుకు అభ్యంతరం లేదని రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు పేర్కొన్నారు. ముందే రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి ఆ తర్వాత కేంద్రం ఇస్తున్నందువల్ల ఇలా ప్రత్యేక ఖాతా ఏర్పాటుచేయడం సాధ్యం కాదని ఆర్థికశాఖ పేర్కొంది.

కేంద్ర బడ్జెట్‌ నుంచి...

పోలవరం ప్రాజెక్టుకు ప్రస్తుతం రూ.320 కోట్లు కేంద్ర ఆర్థికశాఖ నేరుగా ఏపీ ప్రభుత్వ ఆర్బీఐ ఖాతాకు జమ చేసింది. ఇటీవలి కాలంలో ఇలా చెల్లించడం ఇదే తొలిసారి. నాబార్డుతో రుణ ఒప్పందం జరిగిన తర్వాత ఈ విధానం లేదు. రాష్ట్ర ప్రభుత్వం, పోలవరం అథారిటీ, కేంద్ర జల్‌శక్తి శాఖ, అక్కడి నుంచి ఆర్థికశాఖ, ఆ తర్వాత నాబార్డుకు ప్రతిపాదనలు వెళ్లేవి. నాబార్డు రుణం సమీకరించి తిరిగి అవే మార్గాల్లో పీపీఏకు నిధులు చేరేవి. ఏపీ ప్రభుత్వం చలానా సమర్పించి ఆ నిధులు తీసుకోవాల్సి వచ్చేది. ఈ మొత్తం ప్రక్రియకు 140 నుంచి 180 రోజుల సమయం పడుతోందని ఇంతకుముందు జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు కేంద్ర జల్‌శక్తి శాఖకు వివరించి ఈ విధానాన్ని మార్చాలని కోరారు. నాబార్డు రుణం సేకరించాలన్నా మొత్తం అవసరం రూ.1,000 కోట్లు అయ్యేవరకు వేచిచూడాల్సి వచ్చేది. దీనివల్లా ఆలస్యమయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని