రన్‌వేపై పక్కపక్కనే!

ఒకే సారి దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు విమానాలు టేకాఫ్‌కు ప్రయత్నించాయి. చివరి క్షణంలో అధికారులు అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.  ఈ సంఘటనలో రెండు ఎమిరేట్‌ బోయింగ్‌-బి777

Published : 15 Jan 2022 02:57 IST

ఒకే సారి దూసుకొచ్చిన హైదరాబాద్‌, బెంగళూరు బోయింగ్‌ విమానాలు
దుబాయ్‌ విమానాశ్రయంలో తృటిలో తప్పిన ప్రమాదం

దుబాయ్‌: ఒకే సారి దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు విమానాలు టేకాఫ్‌కు ప్రయత్నించాయి. చివరి క్షణంలో అధికారులు అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.  ఈ సంఘటనలో రెండు ఎమిరేట్‌ బోయింగ్‌-బి777 విమానాలు హైదరాబాద్‌, బెంగళూరుకు వెళ్లాల్సినవే కావడం గమనార్హం. దుబాయ్‌ విమానాశ్రయ వర్గాల ప్రకారం... ఈ నెల 9న దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ఈకే-524 విమానం ఆదివారం రాత్రి 9.45 గంటలకు టేకాఫ్‌ కావాలి. ఐదు నిమిషాల వ్యవధిలోనే బెంగళూరు ఈకే-568 విమానమూ బయల్దేరాలి. అయితే, ఈ రెండు ఒకేసారి 30ఆర్‌ రన్‌వేపైకి వచ్చేశాయి. హైదరాబాద్‌ విమానం టేకాఫ్‌ కోసం రన్‌వేపై శరవేగంగా దూసుకెళుతున్న సమయంలో పక్కనుంచి మరో విమానం వేగంగా వస్తుండడాన్ని సిబ్బంది గమనించారు. దీంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) టేకాఫ్‌ను నిలిపివేయాలని ఈకే-524 పైలట్లకు సూచించింది. దీంతో 240 కిలోమీటర్ల వేగంతో ఉన్న హైదరాబాద్‌ విమానం... అతి కష్టంపై వేగాన్ని నియంత్రించుకొని ట్యాక్సీవేలోకి మళ్లి రన్‌వే నుంచి వైదొలగింది. ఈ ఘటనపై యూఏఈ విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ(ఏఏఐఎస్‌) విచారణకు ఆదేశించింది. దీనిపై భారత్‌ పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ కూడా స్పందించింది. తమకూ విచారణ నివేదిక ప్రతిని సమర్పించాలని యూఏఈ విమానయాన సంస్థను కోరింది. బోయింగ్‌-బి777 సీట్ల సామర్థ్యం 350 నుంచి 440గా ఉంటుంది. ఆ సమయంలో ఈ రెండు విమానాల్లో ఎంత మంది ఉన్నారో తెలీదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు