భావ వ్యక్తీకరణ దేశద్రోహం ఎలా అవుతుంది?
తనపై దేశద్రోహంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద సీఐడీ పోలీసులు సుమోటోగా నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో
సీఐడీ ఏడీజీ దురుద్దేశంతో పెట్టిన కేసు ఇది
నాపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయండి
హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్
ఈనాడు, అమరావతి: తనపై దేశద్రోహంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద సీఐడీ పోలీసులు సుమోటోగా నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రాథమిక దర్యాప్తు నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకున్నా.. తనపై పెట్టిన సెక్షన్లేవీ చెల్లుబాటు కావన్నారు. దేశద్రోహం, తదితర సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ చెల్లుబాటు కాదన్నారు. ఈ నెల 11న పోలీసులు ఇంటికొచ్చి మంగళగిరి సీఐడీ పోలీసుల ఎదుట హాజరుకావాలని నోటీసులు ఇచ్చారన్నారు. నరసాపురం నియోజకవర్గానికి తాను వెళ్తున్నట్లు అధికారులకు చెప్పాకే నోటీసు ఇచ్చినట్లు కనపడుతోందన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని సీఐడీ కేసును కొట్టేయాలని అభ్యర్థించారు. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీ, మంగళగిరి సీఐడీ ఎస్హెచ్వో, వ్యక్తిగత హోదాలో సీఐడీ ఏడీజీ పీవీ సునీల్కుమార్ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
పిటిషన్లో ఏముందంటే
‘అధికారపార్టీ సభ్యుల అక్రమాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి మీడియా సమావేశాలు నిర్వహించి నా విధినిర్వహణలో భాగంగా ప్రజలకు తెలియజేస్తుంటాను. వీటిపై నామీద దేశద్రోహం కేసు నమోదుచేసి, అరెస్టుచేశారు. అనంతరం సుప్రీంకోర్టు బెయిలు మంజూరుచేసి, దర్యాప్తునకు సహకరించాలని నన్ను ఆదేశించింది. తర్వాత ఏడు నెలల నుంచి దర్యాప్తునకు రావాలని సీఐడీ ఎప్పుడూ పిలవలేదు. నా నియోజకవర్గానికి వెళ్లాలనుకున్న సమయంలో గతంలో నాపై పలు కేసులు నమోదుచేశారు. ఆ ఎఫ్ఐఆర్లను సవాలు చేస్తూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాను. నా వ్యవహారంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. నియోజకవర్గానికి వస్తున్నానని, శాంతిభద్రతల కోసం తగిన చర్యలు తీసుకోవాలని పశ్చిమగోదావరి కలెక్టర్, ఎస్పీకి ఈ నెల 10, 11 తేదీల్లో ఫోన్ ద్వారా తెలియజేశా.
* ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ ప్రత్యర్థులపై సీఐడీ ఏడీజీ సునీల్కుమార్ పలు తప్పుడు కేసులు నమోదు చేస్తూ ప్రభుత్వం చెప్పినట్లు వ్యవహరిస్తున్నారు. కులం పేరుతో ఆయన్ని దూషించానన్న దాంట్లో వాస్తవం లేదు.
* ఎస్సీ రిజర్వేషన్ను దుర్వినియోగం చేసి సునీల్కుమార్ ఐపీఎస్లో చేరారని కేంద్ర హోంశాఖకు నేను చేసిన ఫిర్యాదు పరిశీలనలో ఉంది. వివిధ ఠాణాల్లో పెట్టినట్లే.. మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదుచేసిన దేశద్రోహం కేసు కూడా సీఐడీ ఏడీజీ సునీల్కుమార్ ప్రేరణతో నమోదు చేసిందే. దీని వెనుక ఆయన దురుద్దేశం ఉంది’ అని పిటిషన్లో రఘురామ పేర్కొన్నారు.
అనారోగ్యం వల్ల విచారణకు హాజరుకాలేను
ఈనాడు, దిల్లీ: అనారోగ్యకారణాల రీత్యా సోమవారం విచారణకు హాజరుకాలేనని సీఐడీకి లేఖ రాశానని, అదే సమయంలో తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశానని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల కోసం మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పోరాడి గెలవడం కోసం తాను బతికి ఉండాల్సి ఉందన్నారు. ‘‘ఇవే నాకు ఆఖరి పార్లమెంటు సమావేశాలు. మళ్లీ ఎన్నికల్లో పోటీచేసి తిరిగి వచ్చేందుకు సమయం పట్టొచ్చు. నా నోటీసులకు కర్త, కర్మ, క్రియ జగన్మోహన్రెడ్డే. ఆయన తరఫున సునీల్కుమార్ ఇవన్నీ చేస్తున్నారు. వారిపై ప్రధానికి లేఖ రాశాను. తప్పుడు కేసులు పెడుతున్న పీవీ సునీల్కుమార్ను ఏపీ విధుల నుంచి తప్పించి వేరే రాష్ట్రంలో ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశాను. ప్రధాని, అమిత్ షాలను అపాయింట్మెంట్ కోరాను’ అని పేర్కొన్నారు. తన రాజీనామా ఆమోదించకుండా అనర్హత వేటు మాత్రమే వేయాలని తమ పార్టీ వ్యక్తి లోక్సభ స్పీకర్కు లేఖ రాశారని చెప్పారు. నియోజకవర్గానికి వెళ్లకుండా ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ అడ్డుకుంటుంటే తాను మొహం చాటేశానని విజయసాయిరెడ్డి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో తనను ఎవరో చంపడానికి వెంటపడ్డారని భయం వ్యక్తం చేస్తూ విజయసాయిరెడ్డి డీజీపీ ఆఫీసుకు పరుగులు తీశారని, అప్పుడు ఆయన్ను ఎవరు చంపడానికి ప్రయత్నించారో.. ఇప్పుడు తనను చంపడానికి వారే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘బాబాయ్ను ఎవరు చంపారో చెప్పాలి. తొలుత గుండెపోటు అని చెప్పి అది హత్య అని తేలిన తర్వాత ఆదినారాయణరెడ్డి, చంద్రబాబు, బీటెక్ రవి పేర్లు చెప్పారు. చివరకు అందులో సీబీఐ వైకాపా రాష్ట్ర కార్యదర్శిని అరెస్ట్ చేస్తే ఆయన జైల్లో ఉండకుండా ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నారు. వివేకానందరెడ్డి హత్య ఎవరు చేశారన్నది తేలిపోయింది. చేయించిందెవరన్నది త్వరలో బయటికొస్తుంది’ అని రఘురామ పేర్కొన్నారు. విజయసాయి నరసాపురంలో పోటీ చేయాలని, రాబోయే రోజుల్లో ఆయనకూ తన పరిస్థితే రాబోతోందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా