కొవిడ్‌పై నిర్లక్ష్యం తగదు

కొవిడ్‌ మూడో దశ ఉద్ధృతి పెరుగుతోంది. ఏపీలో రోజు సరాసరిన 6000-6500 వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 15నుంచి19వ తేదీ వరకు 5రోజుల వ్యవధిలో 30,686 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ప్రస్తుతం 44,835 క్రియాశీల కేసులున్నాయని వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి

Published : 20 Jan 2022 04:29 IST

చికిత్సపై ఐసీఎంఆర్‌-ఎయిమ్స్‌ మార్గదర్శకాలు

ఈనాడు, అమరావతి, హైదరాబాద్‌: కొవిడ్‌ మూడో దశ ఉద్ధృతి పెరుగుతోంది. ఏపీలో రోజు సరాసరిన 6000-6500 వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 15నుంచి19వ తేదీ వరకు 5రోజుల వ్యవధిలో 30,686 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ప్రస్తుతం 44,835 క్రియాశీల కేసులున్నాయని వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 95శాతానికి పైగా స్వల్ప లక్షణాలతో ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. లక్షణాల తీవ్రతను ఎలా గుర్తించాలి? ఎప్పుడు ఆసుపత్రిలో చేరాలి? ఎవరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి? తదితర అంశాలతో కూడిన మార్గదర్శకాలను ఇటీవల ఐసీఎంఆర్‌- దిల్లీ ఎయిమ్స్‌ విడుదల చేసింది. కొవిడ్‌ను మూడు దశలుగా విభజించింది. స్వల్ప లక్షణాలతో కూడిన వ్యాధి, మధ్యస్థ వ్యాధి, తీవ్ర వ్యాధిగా పరిగణించింది.
స్వల్ప వ్యాధి లక్షణాలు: జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి
చికిత్స: ఇంట్లోనే ఉండి చికిత్స పొందాలి. తేలికపాటి దగ్గు, జ్వరం ఐదు రోజులకు మించి వస్తుంటే.. వైద్యుడి సలహా మేరకు ఔషధాలను వాడాలి.
ఎప్పుడు అత్యవసరం?: శ్వాస పీల్చుకోవడం కష్టమైనప్పుడు

* ఆక్సిజన్‌ శాతం 93 కంటే తగ్గినప్పుడు ః జ్వరం, దగ్గు తీవ్రమైనప్పుడు

* 5 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోతే

* దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారైతే 3 రోజుల కంటే ఎక్కువగా లక్షణాలు కనిపిస్తున్నప్పుడు
ఎవరికి ఎక్కువ ముప్పు?: 60 ఏళ్లు దాటినవారు, మధుమేహులు, ఊబకాయులు, గుండె రక్తనాళాల జబ్బు, అధిక రక్తపోటు హెచ్‌ఐవీ, క్షయ, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయ జబ్బులు, మెదడు, రక్తనాళాల జబ్బులతో చికిత్స పొందుతున్నవారు

జాగ్రత్తలు
* ఇంట్లోనూ మాస్కు ధరించాలి.
* నీళ్లు తగినంతగా తాగాలి.
* రోజుకు 3 సార్లు టెంపరేచర్‌, ఆక్సిజన్‌ పరీక్షించుకోవాలి.
మధ్యస్థ వ్యాధి లక్షణాలు: నిమిషానికి 24 సార్ల కంటే అధికంగా శ్వాస పీల్చుకోవడం, ఆయాసం, రక్తంలో ఆక్సిజన్‌ 90-93 శాతం మధ్యలో ఉండడం.
చికిత్స: వీరికి ఆసుపత్రిలో చికిత్స అందించాలి. ః రక్తంలో ఆక్సిజన్‌ శాతం కనీసం 92-96 మధ్యలో ఉండేలా చూసుకోవాలి.ః కృత్రిమ ప్రాణవాయువును అందించాలి. ః స్టెరాయిడ్‌ చికిత్సను ఆసుపత్రిలోనే ప్రారంభించి, అక్కడే ముగించాలి. ఇంటికెళ్లాక కూడా స్టెరాయిడ్‌ వాడే విధానానికి స్వస్తి పలకాలి.

జాగ్రత్తలు
*శ్వాస తీరు ఎలా ఉందో పరీక్షిస్తూ ఉండాలి.
ఆరోగ్యం క్రమేణా క్షీణిస్తుంటేనే.. ఛాతీ ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ పరీక్షలు చేయించాలి.
* 2-3 రోజులకోసారి సీఆర్‌పీ, డీ డైమర్‌, షుగర్‌, సీబీసీ, కిడ్నీ, కాలేయ పనితీరు పరీక్షలు చేయిస్తుండాలి.
తీవ్ర వ్యాధి
లక్షణాలు: నిమిషానికి 30 సార్ల కంటే అధికంగా శ్వాస పీల్చుకోవడం, ఆయాసం, రక్తంలో ఆక్సిజన్‌ శాతం 90 కంటే తగ్గిపోవడం.
చికిత్స: ఐసీయూలో చేర్చాలి.పరికరాల ద్వారా ప్రాణవాయువును ఇవ్వాలి. వైద్యుడి సూచనల మేరకు స్టెరాయిడ్‌ ఔషధాలను, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ చికిత్సను అందించాలి.
రెమ్‌డెసివిర్‌ ఎప్పుడు?: లక్షణాలు కనిపించిన 10 రోజుల్లోపు ఈ ఇంజక్షన్‌ ఇవ్వాలి. ఇది మధ్యస్థ నుంచి తీవ్ర లక్షణాలున్న వారికి, ఆక్సిజన్‌ సాయంతో చికిత్స పొందుతున్న వారికే ఇవ్వాలి. ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వారికి, ప్రాణవాయువు అవసరం లేని వారికి ఇది అవసరం లేదు.  

జాగ్రత్తలు
* చికిత్స ఇస్తున్నా స్పందన లేని రోగులకు మాత్రమే సీటీస్కాన్‌ చేయించాలి. ః నిర్ధారణ పరీక్షలను రోజూ చేయించనక్కర్లేదు. 2-3 రోజులకొకసారి  సీఆర్‌పీ, డీ డైమర్‌, షుగర్‌, సీబీసీ, కిడ్నీ, కాలేయ పనితీరు పరీక్షలు చేయిస్తుండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని