జోరు తగ్గని కరోనా

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి ఆగడం లేదు. తాజాగా 24 గంటల వ్యవధిలో 2,82,970 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒమిక్రాన్‌ బాధితులు 8,961. క్రియాశీల కేసుల్లోనూ(18,31,000) భారీ పెరుగుదలే కనిపిస్తోంది.

Updated : 20 Jan 2022 05:40 IST

24 గంటల్లో 2,82,970 కొత్త కేసులు

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి ఆగడం లేదు. తాజాగా 24 గంటల వ్యవధిలో 2,82,970 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒమిక్రాన్‌ బాధితులు 8,961. క్రియాశీల కేసుల్లోనూ(18,31,000) భారీ పెరుగుదలే కనిపిస్తోంది. వైరస్‌తో 441 మంది మృత్యువాత పడగా, అందులో అత్యధికం(122) కేరళ వాసులే, తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (53), పశ్చిమ బెంగాల్‌ (34) ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 4,87,202కు, మొత్తం కేసుల సంఖ్య 3,79,01,241కు చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు ప్రమాదకర స్థాయి(15.63%) లోనే ఉంటోంది.
* మసూరిలోని లాల్‌ బహాదూర్‌ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీలో శిక్షణ పొందుతున్న 84 మంది ఐఏఎస్‌లకు కొవిడ్‌-19 పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది.  

విమానాలపై నిషేధం పొడిగింపు: డీజీసీఏ
అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు కేంద్రం పొడిగించింది. ఈ మేరకు పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేక ఒప్పందం చేసుకున్న 40 దేశాలకు మాత్రం ఎప్పట్లానే విమాన రాకపోకలు కొనసాగుతాయి. కార్గో సర్వీసులకు నిషేధం వర్తించదు.


భారత్‌లో 23న పతాక స్థాయి
కాన్పుర్‌ ఐఐటీ శాస్త్రవేత్త మణీంద్ర అంచనా

దిల్లీ: భారత్‌లో కొవిడ్‌-19 మూడో ఉద్ధృతి ఈ నెల 23న పతాక స్థాయికి చేరుతుందని కాన్పుర్‌ ఐఐటీ శాస్త్రవేత్త మణీంద్ర అగర్వాల్‌ పేర్కొన్నారు. ఆ దశలోనూ రోజువారీ కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షల కన్నా తక్కువే ఉండొచ్చని అంచనావేశారు. దేశంలో కొవిడ్‌ కేసుల తీరుతెన్నులను పరిశీలించడంతోపాటు వాటిపై అంచనాలు కట్టేందుకు ఉద్దేశించిన ‘సూత్ర నమూనా’ రూపకర్తల్లో అగర్వాల్‌ కూడా ఉన్నారు. ఆయన తాజా అంచనాల ప్రకారం..

* ఈ వారం మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌లలో కొవిడ్‌ కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయి. ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, తమిళనాడులో వచ్చేవారం ఈ పరిస్థితి ఉత్పన్నం కావొచ్చు.

* 7.2 లక్షల రోజువారీ కేసులతో ఈ నెల 23న మూడో ఉద్ధృతి పతాక స్థాయికి చేరొచ్చని ఈ నెల 11 వరకూ వెలువడిన డేటాను విశ్లేషించినప్పుడు స్పష్టమైంది. అయితే కేసుల వాస్తవ గమనంలో ఇప్పటికే వైరుధ్యం చోటుచేసుకుంది. దీంతో పతాక స్థాయికి చేరిన రోజున కొత్త కేసుల సంఖ్య 4 లక్షలకు మించకపోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని