AP High Court: పాణ్యం ఎమ్మెల్యే కాటసానిపై హైకోర్టు మండిపాటు

కర్నూలు జిల్లా పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై హైకోర్టు మండిపడింది. న్యాయస్థానం నోటీసు ఇచ్చిన విషయం తెలిసీ ఎందుకు స్పందించలేదని నిలదీసింది. తితిదే బోర్డు పాలక మండలి సభ్యుల నియామకంపై దాఖలైన వ్యాజ్యంలో రాంభూపాల్‌రెడ్డికి పత్రికల్లో ప్రకటన

Published : 20 Jan 2022 08:21 IST

కోర్టు ఇచ్చిన నోటీసును ఎలా నిరాకరిస్తారు?

ఈనాడు, అమరావతి: కర్నూలు జిల్లా పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై హైకోర్టు మండిపడింది. న్యాయస్థానం నోటీసు ఇచ్చిన విషయం తెలిసీ ఎందుకు స్పందించలేదని నిలదీసింది. తితిదే బోర్డు పాలక మండలి సభ్యుల నియామకంపై దాఖలైన వ్యాజ్యంలో రాంభూపాల్‌రెడ్డికి పత్రికల్లో ప్రకటన ద్వారా నోటీసు ఇవ్వాలంటూ ఈనెల 4న ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి (రీకాల్‌) తీసుకోవాలంటూ వేసిన అనుబంధ పిటిషన్‌పై విచారణ జరపాలని ఎమ్మెల్యే తరఫు న్యాయవాది కోరడంపై తీవ్రంగా స్పందించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే అయిఉండి అందుబాటులో లేరంటూ నోటీసులు అందుకోకపోతే.. పత్రికల్లో పేరు ప్రచురించేందుకు ఆదేశించకుండా ఏమి చేయమంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పి ఏమి ప్రయోజనం అని పేర్కొంది. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా కోర్టు ఇచ్చిన నోటీసును ఎలా నిరాకరిస్తారని నిలదీసింది. మీ తీరు ఆ విధంగా ఉంటే పత్రికల్లో పేర్లు ప్రచురించాలని ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు వెనక్కి తీసుకోవాలని ప్రశ్నించింది. గతంలో హైకోర్టు తితిదే బోర్డు సభ్యులైన ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చిన విషయం పత్రికల్లో విస్తృతంగా ప్రచురితం అయ్యిందని గుర్తు చేసింది. ఆ సమయంలో మీరెక్కడున్నారని ప్రశ్నించింది. మీ తీరు కోర్టు పట్ల గౌరవం లేనట్లుందని వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యే తరఫు న్యాయవాది బదులిస్తూ.. ఆ సమయంలో కుమారుడి వివాహం ఉందన్నారు. నోటీసుపై స్పందించనందుకు క్షమాపణలు కోరుతున్నామన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. వివాహ పనుల కారణంగా న్యాయవాదిని సంప్రదించలేకపోయారా? అని ప్రశ్నించింది. అంటే దాని అర్థం కోర్టు నోటీసులిచ్చిన విషయం మీకు తెలుసని పేర్కొంది. ఎమ్మెల్యేనే నోటీసులు నిరాకరిస్తే.. ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసింది. న్యాయాలయం ఆదేశాలపై కనీస గౌరవం ప్రదర్శించని వ్యక్తి.. తితిదే బోర్డు సభ్యునిగా నియమితులై దేవాలయం పట్ల భక్తితో మెలుగుతారని ఎలా భావించగలం అని ఘాటుగా వ్యాఖ్యానించింది. చివరికి న్యాయవాది అభ్యర్థన మేరకు రీకాల్‌ పిటిషన్‌పై గురువారం విచారణ చేసేందుకు అంగీకరించింది. నేరచరిత్ర, రాజకీయపార్టీలతో సంబంధం ఉన్న వారిని తితిదే పాలక మండలి సభ్యులుగా నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో కోర్టు నోటీసులు అందుకోని ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డి, మరో ఇద్దరి విషయంలో ఈనాడు, సాక్షి పత్రికల్లో ప్రకటనల ద్వారా నోటీసులు జారీ చేయాలని పిటిషనర్‌, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి, తితిదే మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు జి.భానుప్రకాశ్‌రెడ్డిని ఈనెల 4న హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం పై మేరకు వ్యాఖ్యానించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని