CM Jagan: అగ్రవర్ణ పేదలకు అండ

అగ్రవర్ణాల్లోనూ పేదలు ఉన్నారని, వారికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ అమలు చేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారతకు, వారి ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందన్న సంకల్పంతోనే

Published : 26 Jan 2022 05:21 IST

వారికి మంచి జరగాలనే ఈబీసీ నేస్తం

పథక ప్రారంభోత్సవంలో సీఎం జగన్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అగ్రవర్ణాల్లోనూ పేదలు ఉన్నారని, వారికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ అమలు చేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారతకు, వారి ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందన్న సంకల్పంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ఇది ఎన్నికల వాగ్దానం కాదని, మేనిఫెస్టోలోనూ చెప్పలేదని, పేదవారు ఎక్కడున్నా మంచి చేయాలనే ఆలోచనతోనే ఈ బాధ్యత తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం ప్రారంభించారు. 3.93 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ.589 కోట్ల నగదును బటన్‌ నొక్కి జమ చేశారు. అనంతరం మాట్లాడుతూ... ‘ఈ పథకం కింద రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ తదితర అగ్రవర్ణాల్లోని 45-60 ఏళ్ల మధ్య ఉన్న పేద మహిళలకు మేలు చేస్తున్నాం. వీరికి ఏటా రూ.15వేల చొప్పున మూడేళ్లపాటు అందిస్తాం. గృహిణి బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. వారి ముఖంలో సంతోషం ఉంటేనే ఇంట్లో అందరికీ ఆనందం ఉంటుంది’ అని గుర్తుచేశారు.

33 లక్షల మందికి చేయూత

‘వైఎస్సార్‌ చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు నేస్తం పథకాల కింద కాపు, బలిజ, ఒంటరి మహిళలకు(45-60 ఏళ్ల మధ్య ఉన్న వారికి) ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తున్నాం. ఈ రెండు పథకాల కింద దాదాపు 29 లక్షల మంది మహిళలకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాం. ‘ఈబీసీ నేస్తం’తో కలిపితే దాదాపు 33 లక్షల మంది మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్నాం’ అని వెల్లడించారు.

డ్వాక్రాలో ఎన్‌పీఏలు తగ్గడమే మహిళాభివృద్ధికి నిదర్శనం

‘గత ప్రభుత్వం రుణమాఫీ పేరిట డ్వాక్రా మహిళల్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. ఏ-గ్రేడ్‌లో ఉన్న సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌లకు పడిపోయాయి. 18.36% ఎన్‌పీఏలుగా మారాయి. ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు చేయూత ఇస్తూ ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758 కోట్లను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశాం. దీంతో ఎన్‌పీఏ, అవుట్‌ స్టాండింగ్‌ అకౌంట్‌ 0.73 శాతానికి తగ్గింది. మహిళాభివృద్ధి జరిగిందనే దానికి ఇదే నిదర్శనం’ అని సీఎం వివరించారు. రాజకీయంగానూ మహిళా సాధికారతకు ప్రాధాన్యమిచ్చాం. నామినేటెడ్‌ పోస్టుల్లోనూ 51% సీట్లు ఇచ్చాం. గతంలో గ్రామంలో గుడి, బడి పక్కన కనిపించే మద్యం గొలుసు దుకాణాలను ఇప్పుడు ఎక్కడా లేకుండా కట్టడి చేశాం’ అని గుర్తుచేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి పలువురు మహిళలు మాట్లాడారు. కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని