ఐఏఎస్‌ కేడర్‌ రూల్స్‌ మార్పునకు వ్యతిరేకం 9.. అనుకూలం 8

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐఏఎస్‌ కేడర్‌ నిబంధనల మార్పుపై ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు తమ స్పందనలను తెలియజేశాయి. వాటిలో 9 రాష్ట్రాలు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించగా...మరో 8 రాష్ట్రాలు

Updated : 27 Jan 2022 04:51 IST

కేంద్రం ప్రతిపాదనకు ఇప్పటి వరకూ సమాధానమిచ్చిన రాష్ట్రాలివీ

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐఏఎస్‌ కేడర్‌ నిబంధనల మార్పుపై ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు తమ స్పందనలను తెలియజేశాయి. వాటిలో 9 రాష్ట్రాలు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించగా...మరో 8 రాష్ట్రాలు సమర్థించాయి. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరో సారి ఈ విషయాన్ని గుర్తు చేస్తామని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. రాష్ట్ర కేడర్‌ నుంచి వచ్చి కేంద్రంలో డిప్యుటేషన్‌పై పనిచేసే అధికారుల సంఖ్య తగ్గిపోతుందని పేర్కొంటూ ఐఏఎస్‌ కేడర్‌ రూల్స్‌-1954కు మార్పులను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటి వరకూ పరస్పర సంప్రదింపుల ద్వారా కేంద్రం, రాష్ట్రాలు అధికారుల డిప్యుటేషన్‌కు అనుమతులిచ్చేవి. అయితే, తాజా ప్రతిపాదన ప్రకారం.. ఏ అధికారినైనా డిప్యుటేషన్‌పై పంపించాలని కేంద్రం కోరితే ఆ అభ్యర్థనను తోసిపుచ్చే అవకాశం ఇక రాష్ట్రాలకు ఉండదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలు తెలపాలని కోరుతూ గత ఏడాది డిసెంబరు 20, 27, ఈ ఏడాది జనవరి 6,12 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం లేఖలు రాసింది. బుధవారం వరకు అభిప్రాయాలు చెప్పిన రాష్ట్రాల్లో 9.. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించలేదు. ఇవన్నీ భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కావడం గమనార్హం. వీటిలో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌ ఉన్నాయి. కేంద్రం ప్రతిపాదనకు సానుకూలత తెలిపిన రాష్ట్రాల్లో ...అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపుర్‌, త్రిపుర, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌ ఉన్నాయి.

* కర్ణాటక, మేఘాలయ రాష్ట్రాలు ప్రాథమికంగా కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకించినప్పటికీ ఆ అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

* బిహార్‌ కూడా తొలుత ఐఏఎస్‌ సర్వీసు నిబంధనల మార్పును అంగీకరించబోమని పేర్కొంది.

* కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై తగినంత మంది అధికారులను రాష్ట్రాలు కేటాయించకపోవడం వల్లే ఐఏఎస్‌ అధికారుల సర్వీసు నిబంధనల్లో మార్పులను ప్రతిపాదించాల్సి వచ్చిందని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు,శిక్షణ విభాగం వర్గాలు అంటున్నాయి. కేంద్రంలో సంయుక్త కార్యదర్శి స్థాయి ఐఏఎస్‌ అధికారుల ప్రాతినిధ్యం తగ్గిపోతోందని, సెంట్రల్‌ డిప్యుటేషన్‌ రిజర్వు(సీడీఆర్‌)కు తమ వంతు అధికారులను చాలా రాష్ట్రాలు కేటాయించడంలేదని చెబుతున్నాయి.

* కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన అమల్లోకి వస్తే రాష్ట్రాల్లో పరిపాలన కుంటుపడుతుందని, అభివృద్ధి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఒడిశా ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ వైఖరి సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికే విరుద్ధమని తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రులు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని