CM Jagan: మీ ప్రతిపాదన గొప్పది
వివిధ కేంద్రప్రభుత్వ విభాగాలు, కార్యాలయాలను నడిపించేందుకు సమర్థులైన ఐఏఎస్ అధికారుల్ని నియమించాలని ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న
హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం
ఐఏఎస్ల డిప్యూటేషన్ నిబంధనల సవరణ ప్రతిపాదనపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ
కోరినంత మంది ఐఏఎస్లను ఇస్తాం.. ఎవర్ని పంపాలో మేం నిర్ణయిస్తాం
మా ఇబ్బందినీ దృష్టిలో పెట్టుకోవాలని వినతి
ఈనాడు, అమరావతి: వివిధ కేంద్రప్రభుత్వ విభాగాలు, కార్యాలయాలను నడిపించేందుకు సమర్థులైన ఐఏఎస్ అధికారుల్ని నియమించాలని ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. పాలనను సజావుగా, నిరాటంకంగా సాగించేందుకు కేంద్రం చేతిలో శక్తిమంతులు, సమర్థులైన అధికారులతో కూడిన బృందం ఉండాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రాష్ట్రప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారుల్ని కేంద్ర సర్వీసుకు డిప్యూటేషన్పై పిలిపించుకునే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ సర్వీసు నిబంధనల్ని సవరించాలన్న ప్రతిపాదనపై పునరాలోచించాలని ఆయన ప్రధానిని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్రమోదీకి శుక్రవారం ఓ లేఖ రాశారు. కేంద్రం కోరినంతమంది ఐఏఎస్ అధికారుల్ని నిబంధనల ప్రకారం కేంద్రానికి డిప్యూటేషన్పై పంపేందుకు సిద్ధంగా ఉన్నామని... కానీ ఎవర్ని పంపించాలో నిర్ణయించుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వానికే ఉంచాలని సీఎం విజ్ఞప్తి చేశారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన మేరకు ఐఏఎస్ అధికారుల్ని తమ రాష్ట్ర కేడర్ నుంచి కేంద్ర సర్వీసుకు పంపకపోవడంతో, కేంద్రంలో ఐఏఎస్ అధికారుల కొరత ఏర్పడుతోంది. ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చినా లేకపోయినా కేంద్ర డిప్యూటేషన్ రిజర్వుకు నిర్దేశించిన సంఖ్యలో, ఎంపిక చేసుకున్న ఐఏఎస్ అధికారులను తీసుకునే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కల్పిస్తూ నిబంధనల్ని సవరించాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది. దానిపై రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. దానికి స్పందనగా ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి లేఖ రాశారు.
ఉన్నపళంగా తీసుకుంటే ఇబ్బంది
‘కేంద్రప్రభుత్వ విభాగాలు సమర్థులైన అధికారుల సారథ్యంలో పనిచేస్తే రాష్ట్రాలకు చాలా మేలు జరుగుతుంది. రాష్ట్ర కేడర్కి చెందిన ఐఏఎస్ అధికారులు కేంద్రంలో వివిధ హోదాల్లో ఉండటం, ఆయా రాష్ట్రాలకు చెందిన అంశాల్ని కేంద్రం వేగంగా పరిశీలించేలా చూసేందుకు తోడ్పడుతుంది’ అని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ‘మీరు తీసుకున్న ఆ నిర్ణయం ప్రశంసనీయం. ఆ ప్రతిపాదనను నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. అదే సమయంలో ప్రతిపాదిత సవరణ వల్ల తలెత్తే కొన్ని ఇబ్బందుల్ని మీ దృష్టికి తెస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో గానీ, ఆ అధికారుల అభీష్టంతో గానీ సంబంధం లేకుండానే కేంద్రం కావాలనుకున్న వారిని డిప్యూటేషన్పై తీసుకోవచ్చని, కేంద్ర ప్రభుత్వం కోరిన అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిత గడువులోగా తప్పనిసరిగా రిలీవ్ చేయాలని కేంద్రం సవరణ ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వాల్లో ఐఏఎస్ అధికారుల పాత్ర ఎంత కీలకమైందో మీకు తెలియంది కాదు. సాధారణంగా కేంద్ర సర్వీసుకు డిప్యూటేషన్పై వెళ్లేందుకు దరఖాస్తు చేసుకునే ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వాలు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇస్తాయి. ప్రస్తుతం వారు రాష్ట్రంలో ఏమైనా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారా? వారికున్న అనుభవం, నైపుణ్యం వంటి అంశాల్ని బేరీజు వేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఓసీ ఇస్తాయి. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం ఏర్పడకుండా ఎవర్ని పంపించాలో నిర్ణయించుకునే ముఖ్యమైన వెసులుబాటును.. కొత్త ప్రతిపాదనతో తొలగించినట్టవుతుంది. కేంద్రప్రభుత్వం ఎవరిని కోరితే వారిని, ఉన్నపళంగా రిలీవ్ చేస్తే... రాష్ట్రంలో వారు చూస్తున్న విభాగాలు, ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతుంది. అధికారుల అభీష్టంతో సంబంధం లేకుండా పంపితే వారి వ్యక్తిగత జీవితం కూడా ఒడుదొడుకులకు లోనవుతుంది. అప్పుడు వారు కేంద్ర సర్వీసులకు వెళ్లినా తమ సమర్థత మేరకు పనిచేయలేరు’ అని ఆ లేఖలో సీఎం పేర్కొన్నారు.
ఎన్ఓసీ విధానాన్ని కొనసాగించండి
‘ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని ఎన్ఓసీ ఇచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కొనసాగించండి. కేంద్ర డిప్యూటేషన్ రిజర్వుకు అవసరమైన సంఖ్యలో ఐఏఎస్ అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. ఐఏఎస్ అధికారుల డిప్యూటేషన్ నిబంధనల్ని కేంద్రం ఏ ఉద్దేశంతో మార్చాలనుకుందో నేను అర్థం చేసుకున్నాను. కానీ కేంద్రం ఎవరిని కోరితే వారిని తక్షణం పంపాలన్న నిబంధనపై పునరాలోచించాలని కోరుతున్నారు. ఈ దేశాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టేందుకు మీరు వేసే ప్రతి అడుగులోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంపూర్ణ మద్దతు మీకుంటుందని హామీ ఇస్తున్నాను’ అని ఆ లేఖలో సీఎం పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం