Rajampeta: రాజంపేటలో పెల్లుబికిన నిరసనలు

రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ శుక్రవారం కూడా ఆందోళనలు మిన్నంటాయి. రైల్వేకోడూరులోనూ భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. రాజంపేటనే... అన్నమయ్య జిల్లా

Updated : 29 Jan 2022 03:58 IST

విద్యార్థులు.. నేతల ర్యాలీ, ప్రదర్శనలు

రైల్వేకోడూరులోనూ సాగిన ఉద్యమం

ఈనాడు డిజిటల్‌, కడప: రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ శుక్రవారం కూడా ఆందోళనలు మిన్నంటాయి. రైల్వేకోడూరులోనూ భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. రాజంపేటనే... అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. రాజంపేటలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. రైల్వేకోడూరులో విద్యార్థులు, ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు భగ్గుమన్నారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆంక్షలతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు నేతలు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. రాజంపేటనే జిల్లా కేంద్రంగా ఎంపిక చేయాలంటూ పురపాలక సంఘం ప్రత్యేక తీర్మానం చేసినట్లు ఛైర్మన్‌ పోలా శ్రీనివాసులురెడ్డి తెలిపారు. తీర్మానాన్ని ముఖ్యమంత్రికి పంపినట్లు చెప్పారు. తమ డిమాండును ఆమోదించకపోతే రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు నియోజకవర్గాలను కలుపుతూ ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని వైస్‌ఛైర్మన్‌ మర్రి రవి డిమాండు చేశారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయకపోతే.. రైల్వేకోడూరును బాలాజీ జిల్లాలో కలపాలని వైకాపా విద్యార్థి నేత బండారు మల్లికార్జున అన్నారు.

ప్రజల మనోభావాలను గౌరవిస్తాం: శ్రీకాంత్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: జిల్లా కేంద్రంగా రాజంపేట ప్రకటించాలన్న అక్కడి ప్రజల మనోభావాలను గౌరవిస్తామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కడప జిల్లా విభజన విషయంలో స్థానికంగా వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘సరిహద్దులను నిర్ణయించడానికి 30 రోజుల గడువు ఉంది. కమిటీ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటాం. వివాదాలను ఎలా పరిష్కరించాలనే దానిపై ప్లానింగ్‌ కమిషన్‌ చాలా స్పష్టంగా చెప్పింది. జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఒక జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాం’’ అని పేర్కొన్నారు.

మదనపల్లె జిల్లా సాధన ఉద్యమం ఉద్రిక్తం

మదనపల్లె (గ్రామీణ, నేరవిభాగం), న్యూస్‌టుడే: మదనపల్లె జిల్లా ఏర్పాటు కోసం చేపట్టిన ఉద్యమం ఉద్రిక్తమైంది. శుక్రవారం మదనపల్లె జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించారు. తెదేపా, కాంగ్రెస్‌, జనసేన, జిల్లా సాధన కమిటీ నాయకులు పలువురు ఎంపీ కార్యాలయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు మాలమహానాడు, సీపీఐ నాయకులనూ అడ్డుకోవడంతో నిరసన చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. టమాటా మార్కెట్‌ ఎదుట రైతులు, హమాలీలు, ఆటో డ్రైవర్లతో కలిసి అర్ధనగ్న ప్రదర్శన, ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మదనపల్లెను జిల్లా కేంద్రం చేసేందుకు అన్ని అర్హతలున్నాయని తెదేపా, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్‌, షాజహాన్‌బాషా, జిల్లా సాధన జేఏసీ కన్వీనర్‌ గౌతంకుమార్‌ అన్నారు.

ఆదోని జిల్లా కోరుతూ రాస్తారోకో

ఆదోని, న్యూస్‌టుడే: ఆదోని జిల్లా డిమాండు ఊపందుకుంటోంది. కర్నూలు జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గ కేంద్రాల్లో శుక్రవారం తెదేపా, ప్రజాసంఘాల నేతలు తమ డిమాండును పునరుద్ఘాటించారు. పీడీఎస్‌యూ, డీఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆదోని భీమాస్‌ కూడలిలో రాస్తారోకో చేపట్టారు. ఎమ్మిగనూరులో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.

రంపచోడవరం జిల్లా కావాలని ఆందోళన

రంపచోడవరం, న్యూస్‌టుడే: పాడేరు కేంద్రంగా ఏర్పడే జిల్లాతో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని తూర్పుగోదావరి మన్యం వాసులు అంటున్నారు. పాడేరు జిల్లాను రద్దు చేసి, రంపచోడవరాన్ని జిల్లాగా ప్రకటించాలని మన్యంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం ఆందోళనలు చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఎంపీపీ శ్రీదేవి, జడ్పీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి, వైకాపా మండల కన్వీనర్‌ రామన్నదొర ఆధ్వర్యంలో సర్పంచి బొజ్జయ్య అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఎటపాక నుంచి పాడేరుకు 350 నుంచి 400 కి.మీ., రంపచోడవరం నుంచి 250 నుంచి 300 కి.మీ. దూరం ఉంటుందన్నారు. ర్యాలీగా వెళ్లి ఐటీడీఏ ఏపీవో నాయుడికి వినతిపత్రం అందజేశారు.

నరసాపురం బంద్‌ ప్రశాంతం

నరసాపురం, న్యూస్‌టుడే: కొత్తగా ఏర్పాటయ్యే పశ్చిమగోదావరి జిల్లాకు నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఐకాస ఆధ్వర్యంలో శుక్రవారం నరసాపురం పట్టణంలో బంద్‌ పాటించారు. ఈ సందర్భంగా వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసేశారు. ప్రభుత్వ కార్యాలయాలు తెరవలేదు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఐకాస నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు.

నేడు హిందూపురం బంద్‌

హిందూపురం, న్యూస్‌టుడే: హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండుతో అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని