చివరి త్రైమాసికం అనుమతులు రానట్లేనా?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రూ.25,500 కోట్ల మేర బహిరంగ మార్కెట్‌ రుణం కావాలని రిజర్వు బ్యాంకుకు ప్రతిపాదనలు సమర్పించినా కేంద్రం అనుమతి

Published : 29 Jan 2022 03:15 IST

3 వారాలుగా సెక్యూరిటీల వేలానికి దూరం

రూ.2,123 కోట్ల రుణానికి తాజాగా అనుమతి

విద్యుత్తు సంస్కరణలకు ప్రోత్సాహకంగా..

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రూ.25,500 కోట్ల మేర బహిరంగ మార్కెట్‌ రుణం కావాలని రిజర్వు బ్యాంకుకు ప్రతిపాదనలు సమర్పించినా కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దాంతో రుణాలు తీసుకోవడం సాధ్యం కావడంలేదు. రుణాలపై కేంద్ర, రాష్ట్రాల లెక్కలకు మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటంతోనే తుది త్రైమాసికం రుణ పరిమితులు తేల్చలేదని సమాచారం. మరోవైపు విద్యుత్తు సంస్కరణలను చక్కగా అమలు చేసినందుకు తాజాగా రూ.2,123 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం శుక్రవారం అనుమతిచ్చింది. ఈ సౌలభ్యాన్ని వచ్చే మంగళవారం నాటి సెక్యూరిటీ వేలంలో వినియోగించుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది. శుక్రవారం రిజర్వుబ్యాంకు వెల్లడించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి ఒకటిన సెక్యూరిటీల వేలంలో ఏపీ పాల్గొనడం లేదు. ప్రతిపాదనలు పంపేందుకు ఇంకా సమయం ఉన్నందున పరిణామాలు ఎలా మారతాయో చూడాలి.

* జనవరిలో రూ.8,500 కోట్ల రుణం కావాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనలు పంపినట్లు ఆర్‌బీఐ క్యాలెండర్‌ పేర్కొంటోంది. నిజానికి ఆ క్యాలెండర్‌ ప్రకారం ఈనెల 4న ఏపీ రుణం తీసుకునే ప్రతిపాదన ఏదీ లేదు. 3న దిల్లీలో జరిగిన ప్రయత్నాల మేరకు రూ.2,500 కోట్లకు అవకాశం చిక్కడంతో 4న బహిరంగ వేలంలో పాల్గొని రాష్ట్రం రుణం తీసుకుంది. ఆ మేరకు 3న ఆర్‌బీఐ తన క్యాలెండర్‌ను సవరించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.25,500 కోట్ల మేర రుణాలు అవసరమవుతాయని అంచనా వేసింది. జనవరిలో తొలి మంగళవారం సెక్యూరిటీల వేలంలో పాల్గొన్న ప్రభుత్వం... ఇప్పటివరకు ఆ ప్రయత్నం చేయలేదు.

* మూడో త్రైమాసికం మూలధన వ్యయం లెక్కలు ఇంకా తేలలేదు. బహిరంగ మార్కెట్‌ రుణాలకు సంబంధించి ఇంకా కేంద్ర, రాష్ట్ర అధికారుల మధ్య లెక్కల్లో స్పష్టత లేకపోవడంతోనే చివరి త్రైమాసికం రుణ అనుమతులు రాలేదని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని