కంచుకోటల నుంచే పోటీ

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ స్థానం నుంచి పోటీచేసేందుకైనా సిద్ధమేనంటూ తొలుత సవాళ్లు విసిరిన పలువురు సీనియర్‌ నేతలు ఇప్పుడు కాస్త మెత్తబడ్డారు! విజయంపై పూర్తి ధీమా ఉన్న సీట్ల నుంచే వారు బరిలో దిగుతున్నారు. ఇందుకోసం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పక్కనపెడుతున్నారు.

Updated : 25 Jan 2022 05:50 IST

యూపీలో సురక్షిత స్థానాల్లో బరిలో దిగుతున్న సీనియర్‌ నేతలు

ఈనాడు, దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ స్థానం నుంచి పోటీచేసేందుకైనా సిద్ధమేనంటూ తొలుత సవాళ్లు విసిరిన పలువురు సీనియర్‌ నేతలు ఇప్పుడు కాస్త మెత్తబడ్డారు! విజయంపై పూర్తి ధీమా ఉన్న సీట్ల నుంచే వారు బరిలో దిగుతున్నారు. ఇందుకోసం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పక్కనపెడుతున్నారు. దాదాపుగా అన్ని పార్టీల్లోనూ బడా నేతలది ఇదే తీరు. సులువుగా గెలిచేందుకు వీలున్న స్థానంలో పోటీ చేస్తే.. సొంత విజయం కోసం పెద్దగా శ్రమించాల్సిన అవసరం ఉండదని, ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేయొచ్చని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న ముగ్గురు ప్రముఖ నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలను పరిశీలిస్తే..


యోగి: రికార్డుస్థాయి ఆధిక్యంపై కన్ను

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తనకు, తమ పార్టీకి గట్టి పట్టున్న గోరఖ్‌పుర్‌ అర్బన్‌ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ నియోజకవర్గం జన్‌సంఘ్‌ కాలం నుంచి కమలదళానికి పెట్టని కోట. 1980, 1985ల్లో మాజీ ప్రధానమంత్రి లాల్‌బహదూర్‌శాస్త్రి కుమారుడు సునీల్‌ శాస్త్రి ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి ఒక్కసారి మినహా మిగిలిన ఏడుసార్లు భాజపా అభ్యర్థులదే జయభేరి. ఆ ఒక్క మినహాయింపునకు కారణం- యోగి ఆదిత్యనాథే. 1989 నుంచి 1996 వరకు వరుసగా నాలుగుసార్లు భాజపా అభ్యర్థి శివప్రతాప్‌ శుక్లా విజయకేతనం ఎగరేశారు. తర్వాత పరిస్థితులు ఉన్నట్టుండి మారిపోయాయి. స్థానిక గోరక్ష పీఠాధిపతి మహంత్‌ అవేధ్యనాథ్‌ ఉత్తరాధికారిగా ఉన్న యోగి 2002లో ఈ స్థానంలో పిల్లల డాక్టర్‌ రాధామోహన్‌దాస్‌ అగర్వాల్‌ను హిందూమహాసభ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. శుక్లాపై అగర్వాల్‌ గెలుపొందారు. అనంతరం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి 2017 వరకు ఈ స్థానంలో అగర్వాల్‌దే గెలుపు. ఈ నేపథ్యంలో భాజపాకు అత్యంత సురక్షిత స్థానంగా పేరున్న ఈ సీటు నుంచి పోటీకి యోగి సిద్ధమవుతున్నారు. మెజార్టీ విషయంలో కొత్త రికార్డు నెలకొల్పడంపై ఆయన కన్నేశారు.


అఖిలేశ్‌:  నల్లేరుపై నడకే

సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ మైన్‌పురి లోక్‌సభ పరిధిలోని కర్‌హల్‌ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. ఎస్పీకి సురక్షిత సీటుగా దీనికి పేరుంది. 1993కు ముందు సోషలిస్ట్‌ పార్టీ, లోక్‌దళ్‌, జనతాపార్టీ, జనతాదళ్‌ వంటి పార్టీల అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించినా.. ఆ తర్వాత ఎస్పీ గుప్పిట్లోకి వెళ్లిపోయింది. కాంగ్రెస్‌ ఇక్కడ ఒకే ఒక్కసారి(1980) గెలిచింది. యాదవ ఓటర్లు ఎక్కువ. ఇక్కడి నుంచి బాబూరాం యాదవ్‌ అత్యధికంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి 1985లో లోక్‌దళ్‌ నుంచి, తర్వాత జనతాదళ్‌, జనతా పార్టీల తరఫున నెగ్గారు. 1993, 1996ల్లో ఎస్పీ అభ్యర్థిగా గెలిచారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోబరన్‌ సింగ్‌ ఇక్కడ నాలుగుసార్లు గెలుపొందారు. 2002లో భాజపా నుంచి గెలుపొందిన ఆయన.. తర్వాత వరుసగా మూడు ఎన్నికల్లో ఎస్పీ తరఫున జయకేతనం ఎగరేశారు. గత ఎన్నికల్లో 38 వేల మెజార్టీతో విజయం సాధించారు.


కేశవ్‌ప్రసాద్‌ మౌర్య:  గతంలో గెల్చుకున్న సీటే..

కౌశాంబీ జిల్లాలోని సిరాథూ ప్రస్తుతం రాష్ట్రంలో వీఐపీ నియోజకవర్గంగా మారింది. డిప్యూటీ సీఎం, రాష్ట్రంలో భాజపా అగ్రనేతల్లో ఒకరైన కేశవ్‌ప్రసాద్‌ మౌర్య ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటమే అందుకు కారణం. 2012లో ఆయన ఇక్కడి నుంచే తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఫూల్‌పుర్‌లో గెలిచి పార్లమెంటుకు వెళ్లారు. 2017లో భాజపా ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఎమ్మెల్సీ పదవి చేపట్టారు. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల గోదాలోకి దిగారు. 1962లో సిరాథూలో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత హేమావతి నందన్‌ బహుగుణ గెలుపొందారు. 1989, 1991 ఎన్నికల్లో ఇక్కడ జనతాదళ్‌ విజయం సాధించింది. 1993 నుంచి 2007 వరకు బీఎస్పీ అభ్యర్థులు విజయకేతనం ఎగరేశారు. 2012లో ఈ స్థానం భాజపా చేతుల్లోకి వచ్చింది. మౌర్య లోక్‌సభకు వెళ్లడంతో ఇక్కడ జరిగిన ఉపఎన్నికలో ఎస్పీ అభ్యర్థి వాచస్పతి గెలుపొందారు. అయితే 2017 ఎన్నికల్లో సిరాథూలో భాజపా అభ్యర్థి సీతల్‌ప్రసాద్‌ రికార్డు మెజార్టీతో విజయం సాధించారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని