తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాల ప్రదానం

తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథ రచయితలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి గానూ సాహితీ పురస్కారాలు

Published : 30 Oct 2021 05:21 IST

ఎన్టీఆర్‌ కళామందిరంలో ఘనంగా కార్యక్రమం

పురస్కార గ్రహీతలతో ఏనుగు నరసింహారెడ్డి, ఆచార్య తిరుపతిరావు, ఆచార్య తంగెడ కిషన్‌రావు, కొలకలూరి ఇనాక్‌, ఆచార్య మురళీకృష్ణ, రింగు రామమూర్తి

నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథ రచయితలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి గానూ సాహితీ పురస్కారాలు ప్రదానం చేసింది. శుక్రవారం సాయంత్రం వర్సిటీలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్‌రావు అధ్యక్షతన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. మణిపూర్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌ ఆచార్య తిరుపతిరావు ముఖ్యఅతిథిగా హాజరై సాహితీవేత్తలను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆధునిక యుగంలో గణనీయ సాంకేతిక మార్పులు వస్తున్నాయని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రచనలు చేయాలన్నారు. సభా ప్రారంభకులు ఆచార్య కొలకలూరి ఇనాక్‌, మేడ్చల్‌ అదనపు కలెక్టర్‌ డా.ఏనుగు నరసింహారెడ్డి, ఆచార్య తంగెడ కిషన్‌రావులు ప్రసంగించారు.  సంగీత శాఖ విద్యార్థులు సినీ నేపథ్య గాయని, గాయకులు కల్పన, మాళవిక, కృష్ణ చైతన్య వారి గానంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

పురస్కార గ్రహీతలు వీరే..
పద్య కవితా ప్రక్రియలో మొవ్వ వృషాద్రిపతి రచన ‘శ్రీకృష్ణదేవరాయ విజయప్రబంధము’, వచన కవితా ప్రక్రియలో కాంచనపల్లి గోవర్ధన్‌రాజు ‘కల ఇంకా మిగిలే ఉంది’, బాలసాహిత్యంలో సామలేటి లింగమూర్తి ‘పాటల పల్లకి’, కథానికా ప్రక్రియలో రావులపాటి సీతారాంరావు ‘ఖాకీకలం’, నవలా ప్రక్రియలో డా.గడ్డం మోహన్‌రావు ‘కొంగవాలు కత్తి’, సాహితీ విమర్శలో డా.కిన్నెర శ్రీదేవి ‘సీమకథ అస్తిత్వం’, నాటకం/నాటికల్లో ఎన్‌.ఎస్‌.నారాయణబాబు ‘అశ్శరభ శరభ’, అనువాదంలో కె.సజయ ‘అశుద్ధ భారత్‌’, వచన రచనల విభాగంలో లక్ష్మణరావు ‘పతంగే.. ‘హైదరాబాద్‌ నుంచి తెలంగాణ దాక’, రచయిత్రి ఉత్తమ గ్రంథం విభాగంలో సమ్మెట ఉమాదేవి ‘రేలపూలు’ గ్రంథాలకు సాహితీ పురస్కారాలతో పాటు రూ.20,116 చొప్పున నగదు బహుమతి అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని