నిలపాల్సిన ఊపిరి ఆగింది.. నిలవాల్సిన ప్రాణం పోయింది!

ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వచ్చిన రోగి, ప్రాణం పోసేందుకు ప్రయత్నించిన వైద్యుడు... ఇద్దరూ గుండెపోటుతో మరణించిన విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా

Updated : 29 Nov 2021 06:43 IST

చికిత్స చేస్తూ వైద్యుడు గుండెపోటుతో కన్నుమూత

మరో ఆసుపత్రికి తరలిస్తుండగా రోగి కూడా మృత్యువాత

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వచ్చిన రోగి, ప్రాణం పోసేందుకు ప్రయత్నించిన వైద్యుడు... ఇద్దరూ గుండెపోటుతో మరణించిన విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా గాంధారిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజ్జుల్‌ తండాకు చెందిన కాట్రోత్‌ జగ్యానాయక్‌(48) గొల్లాడితండాలోని బంధువుల ఇంటికి శనివారం దినకర్మకు వెళ్లారు. కార్యక్రమం అనంతరం ఆదివారం తెల్లవారుజామున ఇంటికి ప్రయాణమవుతున్న సందర్బంలో గుండెపోటు వచ్చి సొమ్మసిల్లి పడిపోయారు. కుటుంబసభ్యులు ఆయనను వెంటనే గాంధారిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. జగ్యానాయక్‌కు వైద్యుడు లక్ష్మణ్‌ (43) చికిత్స అందిస్తుండగా హఠాత్తుగా ఆయనకు కూడా గుండెపోటు వచ్చి అక్కడే కుప్పకూలారు. ఆసుపత్రి సిబ్బంది చికిత్స చేస్తుండగానే లక్ష్మణ్‌ కన్నుమూశారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జగ్యానాయక్‌ను కామారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ఆయనా మృతి చెందారు. లక్ష్మణ్‌ది మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం టేకుపల్లి తండా. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌, ఎంఎస్‌ సర్జన్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం నిజామాబాద్‌లోని వైద్యకళాశాలలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తూ గాంధారిలో ప్రైవేట్‌ క్లినిక్‌ నడుపుతున్నారు. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు శ్రీజ(13), దక్షిణి(11), భార్య స్నేహలత ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని