
అంటార్కిటికా యాత్రకు నెల్లూరు కుర్రోడు
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: అంటార్కిటికాలో వాతావరణ మార్పుల్ని పరిశీలించేందుకు ‘అంటార్కిటికా ఎక్స్పిడీషన్-2022’ పేరిట నిర్వహిస్తున్న యాత్రకు నెల్లూరు జిల్లాకు చెందిన అభిషేక్ సొబ్బన ఎంపికయ్యారు. ఆయనతో పాటు 45 దేశాలకు చెందిన 150 మందికి పైగా ఈ యాత్రలో పాల్గొననున్నారు. ‘2041 ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు రాబర్ట్ స్వాన్ ‘ది లీడర్షిప్ ఆన్ ది ఎడ్జ్’ కార్యక్రమంలో భాగంగా అంటార్కిటికా ఎక్స్పిడీషన్ను ఏటా నిర్వహిస్తున్నారు. 2022లో మార్చి 17 నుంచి 28వ తేదీ మధ్య ఈ యాత్ర జరగనుంది. భూతాపం కారణంగా అంటార్కిటికాలో మంచు కరిగిపోవడం, వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పులు, అక్కడి జీవజాలానికి ఏర్పడుతున్న ముప్పు తదితర అంశాలను యువ బృందం తెలుసుకుంటుంది. గమనించిన విషయాలను.. భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారి దేశాలు, ప్రాంతాల్లో వీరు అవగాహన కల్పిస్తారు. యాత్రకు దరఖాస్తు చేసుకున్న అనంతరం మూడు దశల వడపోత అనంతరం ముఖాముఖి నిర్వహించి ఔత్సాహికుల్ని ఎంపిక చేస్తారని అభిషేక్ తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి జియో ఇన్ఫర్మాటిక్స్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభిషేక్.. దెహ్రాదూన్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ నుంచి ఇదే అంశంలో పీజీ చేశారు. ప్రస్తుతం శ్రీలంకలోని ఎస్ఎమ్ఈసీలో జియో ఇన్ఫర్మాటిక్స్ సిస్టమ్స్ నిపుణుడిగా పనిచేస్తున్నారు.
Advertisement