AP PRC: ఇవిగో మీ కొత్త జీతాలు, పెన్షన్ స్లిప్పులు... చూసుకోండి!
రాష్ట్ర ప్రభుత్వం సీఎఫ్ఎస్ఎస్ సాయంతో కొత్త వేతన స్కేళ్ల ప్రకారం ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్ స్లిప్పులను సిద్ధం చేసింది. డీడీవోలు, ఖజానా అధికారులు ఎస్ఆర్లు పరిశీలించి చేయాల్సిన ప్రక్రియను సాంకేతిక సహకారంతో పూర్తి చేసింది.
సీఎఫ్ఎస్ఎస్ సాయంతో ప్రభుత్వం రూపకల్పన
ఈనాడు-అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సీఎఫ్ఎస్ఎస్ సాయంతో కొత్త వేతన స్కేళ్ల ప్రకారం ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్ స్లిప్పులను సిద్ధం చేసింది. డీడీవోలు, ఖజానా అధికారులు ఎస్ఆర్లు పరిశీలించి చేయాల్సిన ప్రక్రియను సాంకేతిక సహకారంతో పూర్తి చేసింది. కొత్త వేతన స్కేళ్ల ప్రకారం ఎవరికి ఎంత జీతం వస్తుందో, ఎంత పెన్షన్ వస్తుందో ఖరారు చేసింది. ఆ వివరాలు ఎవరైనా చూసుకోవచ్చని ఆర్థిక శాఖ అధికారులు సోమవారం రాత్రి ఒక ప్రకటన జారీ చేశారు. payroll.herb.apcfss.in వెబ్సైట్లోను, ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ యాప్లో లేదా CFSSలో మొబైల్ నెంబరు రిజిస్టరు అయి ఉంటే దాని ద్వారా పొందే లింకు ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 16వేలకు పైగా డీడీవోల్లో కొద్ది మంది మాత్రమే జీతాల బిల్లులు సమర్పించారు. అయినా ఎట్టి పరిస్థితుల్లో జనవరి నెల జీతాలు కొత్త వేతన సవరణ స్కేళ్ల ప్రకారమే చెల్లించాలనే దృక్పథంతో ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ఆయా స్లిప్పులు సిద్ధమయ్యాయి.
* మరో వైపు కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు తమకు కొత్త జీతాల బిల్లులు సిద్ధం చేయవద్దంటూ డీడీవోలకు లేఖలు సమర్పించారు. దాంతో ఆ ప్రక్రియ సాగలేదు. పోలీసులతో సహా మొత్తం మీద సుమారు 4.20లక్షల మంది ఉద్యోగులు ఉండగా సోమవారం రాత్రికి కేవలం 60 వేల మంది బిల్లులు మాత్రమే ఖజానా అధికారుల ద్వారా ప్రాసెస్ అయినట్లు సమాచారం.
* ప్రస్తుతం వేస్ అండ్ మీన్స్తో కూడా కలిపి ప్రభుత్వం వద్ద రూ.3,300 కోట్లు అందుబాటులో ఉన్నాయని అనధికార సమాచారం. సామాజిక పెన్షన్లు పోను మిగిలిన మొత్తం కొత్త జీతాలు, పెన్షన్ల కింద జమ చేయనున్నారని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.