AP PRC: అమ్ముడుపోయారు.. అన్యాయం చేశారు

పీఆర్‌సీ పై మంత్రుల కమిటీతో శనివారం రాత్రి పీఆర్‌సీ సాధన సమితి నాయకులు చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు.

Updated : 07 Feb 2022 05:21 IST

సాధన సమితి నేతలపై ఉపాధ్యాయుల ధ్వజం

ఏపీటీఎఫ్‌ నాయకుల నిరసనలు

మంత్రుల కమిటీ ఒప్పంద పత్రాలను దహనం

ఈనాడు, అమరావతి, చోడవరం, న్యూస్‌టుడే: పీఆర్‌సీ పై మంత్రుల కమిటీతో శనివారం రాత్రి పీఆర్‌సీ సాధన సమితి నాయకులు చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. మంత్రుల కమిటీతో చేసుకున్న ఒప్పంద పత్రాలను దహనం చేశారు. ఫిట్‌మెంట్‌ పెంపు లేకుండానే ఒప్పందం చేసుకున్నారని, హెచ్‌ఆర్‌ఏ శ్లాబులతో గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల పాదాల ముందు దళారి నాయకులు ఉద్యమాన్ని తాకట్టుపెట్టారని విమర్శించారు. ప్రభుత్వంతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని, లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్‌దారులను నమ్మించి సాధన సమితి నాయకులు మోసం చేశారని పేర్కొన్నారు. సమ్మె విరమణ నిర్ణయం సమంజసం కాదని, ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు పూర్తి విరుద్ధంగా మంత్రుల కమిటీతో ఒప్పందాలు ఉన్నాయని విమర్శించారు.

లాలూచీ పడ్డారు..

‘ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వానికి లొంగిపోయారు.. నమ్ముకున్న వారిని నట్టేట ముంచారు’ అని అంటూ విశాఖ జిల్లా చోడవరంలోని గాంధీ విగ్రహం వద్ద ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆదివారం నిరసన తెలిపారు.‘అమ్ముడుపోయారు.. అన్యాయం చేశారు’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

* నర్సీపట్నంలో ఆర్డీవో కార్యాలయం లోపల వేతన ప్రతులను దహనం చేశారు. అనకాపల్లి, పాడేరు పట్టణాల్లోనూ ఏపీటీఎఫ్‌ నాయకులు చర్చల ఒప్పంద పత్రాలు దహనం చేశారు. ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటూ ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మోసూరి మహలక్ష్మినాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం కన్నా పీఆర్‌సీ సాధన సమితి నాయకులే ఉద్యోగులను ఎక్కువగా ద్రోహం చేశారని డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు.

మోసం చేశారు..

* గుంటూరులోని ఏపీటీఎఫ్‌ కార్యాలయం ఎదుట మంత్రుల కమిటీ ఒప్పంద పత్రాలను ఉపాధ్యాయులు దహనం చేశారు.
* రాష్ట్ర నాయకత్వం ఏకపక్షంగా సమ్మె విరమించిందంటూ నెల్లూరులో కోర్టు ఉద్యోగి కలెక్టరేట్‌ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.

దిష్టిబొమ్మల దహనం

చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు మండలాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు ఆదివారం భాకరాపేటలో నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు.  జిల్లా కేంద్రం చిత్తూరులోని ఎన్జీవో భవనంలో పీఆర్సీ సాధన సమితి జిల్లా నాయకులు రాఘువులు, గంటా మోహన్‌ తదితరులు సమావేశమయ్యారు. ప్రభుత్వం కొత్త పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకుంటేనే చర్చలకు వస్తామని చెప్పిన నాయకులు.. ఇప్పుడు ఏకంగా సమ్మె విరమణకు పిలుపునివ్వడమేంటన్నారు. నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తిరుపతిలో ఏపీ సీపీఎస్‌ ఉద్యోగులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నాలుగు జేఏసీల నాయకులు ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలను పణంగా పెట్టాôటూ మదనపల్లె డివిజన్‌ జేఏసీ సెక్రటరీ జనరల్‌ రవి ప్రకాష్‌, కో- ఛైర్మన్‌ వెంకట రమణ రాజీనామా చేశారు.
* ప్రకాశం జిల్లా పొదిలో యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ చేశారు. ఐకాస నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
* కడప జిల్లా పోరుమామిళ్లలోని గిరినర్‌లో ఐకాసల ఛైర్మన్ల శవయాత్రను నిర్వహించారు. ప్రభుత్వానికి అమ్ముడుపోయిన నాయకులు డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.

ఏపీ ఐకాసకు ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజీనామా

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దారుల ఆశలు వమ్ము చేసిన ఏపీ ఐకాస నాయకత్వ వైఖరికి నిరసనగా ఐకాసలోని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భానుమూర్తి, పాండురంగ వరప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు ఐకాసఛైర్మన్‌ బండి శ్రీనివాసరావుకు లేఖ రాశారు.

ఉపాధ్యాయుల ఉద్యమ బాట

ఈనాడు, అమరావతి: పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై ఉపాధ్యాయులు ఆందోళన బాటపట్టారు. ఫిట్‌మెంట్‌ 27శాతం ఇవ్వాలని, ఇంటి అద్దె భత్యం కనీసం 12 శాతానికిపైగా ఉండాలని, సీపీఎస్‌ రద్దుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) దశలవారీ పోరాటాలకు పిలుపునిచ్చింది. మంత్రుల కమిటీతో శనివారం రాత్రి జరిగిన చర్చల్లో ఫిట్‌మెంట్‌పై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడంతో చర్చల ఒప్పందాన్ని వ్యతిరేకించారు. ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ తక్కువగా ఉండకూడదని, ఇంటి అద్దె భత్యం కనీస శ్లాబు 12శాతం ఉండాలని మంత్రుల కమిటీ ముందు ప్రతిపాదన ఉంచినా పట్టించుకోలేదని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఫిట్‌మెంట్‌ 27శాతం ఉండాలని మంత్రుల కమిటీని కోరినా అది ముగిసిన అధ్యాయమని, దీనిపై సీఎంతోనూ మాట్లాడే అవకాశం లేదని చెప్పారని వెల్లడించారు. ఆ సమయంలోనే దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేశామని వెల్లడించారు. ఫిట్‌మెంట్‌, ఇంటి అద్దె భత్యం శ్లాబులు, సీపీఎస్‌ రద్దుపై స్పష్టమైన హామీ లభించకపోవడంపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కలిసొచ్చే సంఘాలతో ఉద్యమంలోకి వెళ్లాలని ఫ్యాప్టో నిర్ణయించింది. ఫ్యాప్టో ఛైర్మన్‌ జోసెఫ్‌ సుధీర్‌బాబు అధ్యక్షతన ఆదివారం వర్చువల్‌లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ పోరాటంలో కలిసి వచ్చే సంఘాలతో ఐక్యవేదిక ఏర్పాటు చేస్తామని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుధీర్‌బాబు, శరత్‌చంద్ర తెలిపారు. మంత్రుల కమిటీ చర్చలలో ఉపాధ్యాయులు, సీపీఎస్‌ సమస్యలు, ఒప్పంద, పొరుగుసేవలు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల ప్రస్తావన లేకపోవడాన్ని నిరసిస్తున్నామని పేర్కొన్నారు. మొదటి దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.

ఉద్యమ కార్యాచరణ ఇలా..

* సోమవారం నుంచి వారం రోజులపాటు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు
* 11న జిల్లా కలెక్టర్‌లకు వినతిపత్రాల సమర్పణ
* 12న విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని