CAG: బడ్జెట్‌ అనుమతులు లేకుండా చేసిన ఖర్చు 94,399 కోట్లు!

రాష్ట్రంలో బడ్జెట్‌ అనుమతి(ప్రొవిజన్‌) లేకుండానే రూ.94,399.04 కోట్లు ఖర్చు చేశారని కాగ్‌ అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం తప్పు పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22)లో డిసెంబరు నెలాఖరుకు రాష్ట్రంలో చేసిన మొత్తం ఖర్చును విశ్లేషించిన కాగ్‌ అధికారులు అనేక అభ్యంతరాలను వ్యక్తంచేశారు

Updated : 17 Aug 2022 16:25 IST

 తప్పుబట్టిన కాగ్‌ అకౌంటెంట్‌ విభాగం

కేటాయింపులకు మించి రూ.13,398 కోట్ల వ్యయం

9 నెలల రాష్ట్ర బడ్జెట్‌ పరిశీలన.. లోపాల ప్రస్తావన

రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ

ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో బడ్జెట్‌ అనుమతి(ప్రొవిజన్‌) లేకుండానే రూ.94,399.04 కోట్లు ఖర్చు చేశారని కాగ్‌ అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం తప్పు పట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021-22)లో డిసెంబరు నెలాఖరుకు రాష్ట్రంలో చేసిన మొత్తం ఖర్చును విశ్లేషించిన కాగ్‌ అధికారులు అనేక అభ్యంతరాలను వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఫైనాన్షియల్‌ కోడ్‌లోని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు బడ్జెట్‌లో వివిధ ప్రభుత్వ విభాగాలకు రూ.వేల కోట్ల కేటాయింపులు ఉన్నా ఖర్చు చేయడం లేదని విశ్లేషించారు. ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చుల వివరాలను కాగ్‌కు అధికారులు సమర్పిస్తుంటారు. వాటిని అకౌంటెంట్‌ విభాగ అధికారులు పరిశీలించి... బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఎంత కేటాయింపులు జరిపారు? ఎంత ఖర్చు చేశారు? రెవెన్యూ లోటు ఉందా? మిగులు ఉందా? ద్రవ్యలోటు ఉందా? వంటి అంశాలపై నివేదికలు ఇస్తారు.

ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి తొమ్మిది నెలల్లో ఏపీ ప్రభుత్వ ఖర్చులను పరిశీలించిన కాగ్‌... సంబంధిత నివేదికను వెల్లడించింది. ఖర్చులు జరిగిన తీరును విశ్లేషించి అనేక లోపాలను గుర్తించింది. వాటిని ప్రస్తావిస్తూ కాగ్‌ ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలోని ఒక ఉన్నతాధికారి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి తాజాగా లేఖ రాశారు. ఈ లోపాలను సరిదిద్ది, పరిష్కార చర్యలను చేపట్టి కాగ్‌కు తిరిగి తెలియజేయాలని అందులో సూచించారు.

లేఖలో కాగ్‌ ఎత్తిచూపిన ముఖ్య లోపాలు...

* ఏదైనా ఖర్చు చేయాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా దానికి తప్పనిసరిగా బడ్జెట్‌ ప్రొవిజన్‌ ఉండాలి. అయితే... ఎలాంటి బడ్జెట్‌ అనుమతి లేకుండానే దాదాపు 124 అంశాల్లో రూ.94,399.04 కోట్లను వివిధ ప్రభుత్వ శాఖలు ఖర్చు చేశాయి.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 947 అంశాల్లో బడ్జెట్‌లో కేటాయింపులకు మించి రూ.13,398.71 కోట్లు ఖర్చు చేశారు.

* మరోవైపు బడ్జెట్‌ కేటాయింపుల్లో రూ.30,327.26 కోట్లను వివిధ విభాగాల కింద ఖర్చు చేసేందుకు ప్రతిపాదించి... కనీసం పైసా కూడా ఖర్చు చేయలేదు. ఇలా 2,214 అంశాల్లో జరిగింది.

* రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా మార్కెట్‌ నుంచి రుణాలు తీసుకుంటుంది. అదే సమయంలో ప్రతినెలా గతంలో తీసుకున్న రుణాలకు అసలు, వడ్డీల రూపంలో కొంత మొత్తం చెల్లిస్తుంది. ఈ క్రమంలో 2021 డిసెంబరులో రూ.3,250 కోట్లను మార్కెట్‌ నుంచి, రూ.81.11 కోట్లను కేంద్రం నుంచి రుణంగా తీసుకుంది. అదే నెలలో కేంద్ర రుణాలకు సంబంధించి పాత చెల్లింపులు చేసినా... బహిరంగ మార్కెట్‌ రుణాలకు చెల్లింపులు జరపలేదు.

* కొన్ని అంశాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనస్‌ ఖర్చు చూపించారు.

వివిధ శాఖల్లో నిబంధనల ఉల్లంఘన

చాలా ప్రభుత్వ శాఖల్లో నిబంధనలను ఉల్లంఘిస్తూ బడ్జెట్‌ను దాటి ఖర్చులు చేస్తున్నారని కాగ్‌ ప్రస్తావించింది. బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించే సమయంలోనే నిక్కచ్చిగా వ్యవహరించాలని.... అంచనా, వాస్తవ ఖర్చుల మధ్య తేడా లేకుండా చూసుకోవాలన్న ఉత్తర్వులున్నా సరిగా అమలు కావడం లేదని ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ కార్యాలయం అభిప్రాయపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని