Chandrababu: ఎక్కడున్నా శిక్షిస్తాం

తన తల్లిని తిట్టారు.. తనను తిట్టారు. బీపీ పెరిగిందని జగన్‌ అంటున్నారు. జీవితాలు బాగుపడతాయని రాజధానికి 35 వేల ఎకరాలిచ్చిన రైతుల్ని చితగ్గొట్టారే.. వారంతా 670 రోజులకు పైగా

Updated : 23 Oct 2021 06:50 IST

అన్యాయం చేసినవారిని వదలం

తెదేపా అధికారంలోకి రాగానే కమిషన్‌ వేస్తాం

పట్టాభి కుమార్తె మానసికంగా కోమాలోకి వెళ్లే పరిస్థితి తెచ్చారని చంద్రబాబు ధ్వజం

ప్రభుత్వ ఉగ్రవాదానికి చరమగీతం పాడాలనే రాష్ట్రపతి పాలన కోరాం

36 గంటల నిరశన విరమణ

తన తల్లిని తిట్టారు.. తనను తిట్టారు. బీపీ పెరిగిందని జగన్‌ అంటున్నారు. జీవితాలు బాగుపడతాయని రాజధానికి 35 వేల ఎకరాలిచ్చిన రైతుల్ని చితగ్గొట్టారే.. వారంతా 670 రోజులకు పైగా రోడ్డెక్కారు. ఆడవాళ్లను హింసించారు. వారికి బీపీ పెరగదా? కోపం రాదా? ఉపాధిహామీలో ఎంతో మంది గుత్తేదారుల బిల్లులు ఇవ్వకుండా సర్వనాశనం చేశారు.. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ కుటుంబాలకు బీపీ పెరగదా? ఎవరూ నోరు తెరవకూడదా? నీకొక్కడికేనా బీపీ? అన్యాయం జరిగితే అడగరా?

ఈనాడు - అమరావతి

‘ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అన్యాయం చేసినవారు ఎక్కడున్నా పట్టుకొస్తాం, చట్టప్రకారం శిక్షిస్తాం. తెలుగుదేశం అధికారంలోకి రాగానే కమిషన్‌ వేస్తాం.. పోలీసులు, అధికారులకు చెబుతున్నా..  తప్పుడు కేసులు పెడితే రేపు అనేది ఉందని మర్చిపోవద్దు’ అని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు కార్యకర్తలంతా ఉక్కు సంకల్పంతో రావాలి. ఎవరిమీదైనా కేసులు పెడితే నేను చూసుకుంటా. మీరేమీ లక్షల కోట్లు దోచుకున్న వాళ్లు కాదు తప్పుడు కేసులు పెడితే రికార్డు చేయండి. లాయర్లను పెట్టుకుని వాదిద్దాం. ఆ అధికారిపై ప్రైవేటు కేసు పెడదాం. తెదేపా వచ్చాక మీపై కేసులు లేకుండా చేస్తా’ అని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. 36 గంటల నిరాహారదీక్ష చేపట్టిన ఆయన.. శుక్రవారం రాత్రి 8.30కు విరమించారు. వైకాపా ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని నిప్పులు చెరిగారు. ‘డీజీపీ కార్యాలయం, బెటాలియన్‌కు సమీపంలోని తెదేపా కార్యాలయంపై ప్రభుత్వ ఉగ్రవాదంతోనే దాడి చేశారు. డీజీపీ అనుకుని ఉంటే ఇది జరిగేదా? పట్టాభిపై గతంలో దాడి చేశారు. మొన్న ఆయన ఇల్లు నాశనం చేశారు. ఆయన కుమార్తె మానసికంగా కోమాలోకి వెళ్లే పరిస్థితికి తెచ్చారు. అయినా దాడిచేసిన వారిపై కేసు లేదు. తెదేపా కార్యాలయాలపై జరిగిన దాడుల విషయంలో సీబీఐ విచారణ చేయించాలి. దోషుల్ని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రం నాశనమైపోతోందనే రాష్ట్రపతి పాలన అడుగుతున్నాం. ప్రభుత్వ ఉగ్రవాదానికి చరమగీతం పాడాలని కేంద్రాన్ని కోరుతున్నాం. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు సమయం అడిగాం. రాష్ట్రంలోని పరిణామాలను వివరిస్తాం’ అని చెప్పారు.
‘పట్టాభి ఏదో తిట్టారంట.. ‘ఆ’ పదమే ఎప్పుడూ వినలేదు. ఆయన ఏదో మాట్లాడారని రీసెర్చి చేసి.. తల్లినీ లాక్కొచ్చారు. తల్లిపై ఎంత మమకారం జగన్‌రెడ్డీ?

మీరు జైలుకు పోయినప్పుడు తల్లిని ఊరూరూ తిప్పారు. నన్ను కౌంటర్‌ చేయడానికి ఆ చెల్లి జగనన్న బాణం అని పాదయాత్ర పెట్టారు. ఇప్పుడా బాణం తెలంగాణలో తిరుగుతోంది. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని మీరు.. నాకు నీతులు చెబుతారా?’ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డిని నేనే చంపానని చెప్పారు. ఎన్నికలయ్యాక వివేకానందరెడ్డి కూతురు సీబీఐ విచారణ కావాలని కోర్టుకు వెళ్తే సహకరించడం లేదు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

తప్పుడు నివేదికలు తయారు చేయడంలో జగన్‌ సిద్ధహస్తుడు

‘తెదేపా కార్యాలయంపై దాడికి వచ్చిన ఒకరు దారి తెలియక దాక్కున్నారు. అతన్ని తెదేపా నేతలు మీడియా ఎదుటే పోలీసులకు అప్పగించారు. పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయినా కేసు నమోదు చేయలేదు’ అని చంద్రబాబు ఆగ్రహం వెలిబుచ్చారు. ‘లోకేశ్‌ హైదరాబాద్‌లో ఉంటే ఆయనపై కేసు పెట్టారు. నాదెండ్ల బ్రహ్మం కార్యాలయంలో లేకున్నా.. ఆయనపై కేసు పెట్టి అరెస్టు చేశారు. తప్పుడు నివేదికలు తయారుచేయడంలో జగన్‌రెడ్డి సిద్ధహస్తుడు. అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, రామానాయుడు స్పీకర్‌ను ఏదో అన్నారని శాశ్వతంగా సస్పెండ్‌ చేస్తారట’ అన్నారు. ‘మేం బూతులు మాట్లాడామంటున్నారు.. ఎవరు మాట్లాడుతున్నారో ప్రజల వద్దకు వెళ్లి రెఫరెండం కోరుదామా? జగన్‌రెడ్డీ.. సవాల్‌కు సిద్ధమా?’ అని పేర్కొన్నారు.

ఆ గెలుపూ.. ఓ గెలుపేనా?

‘ఎన్నికల్లో అన్నీ వీళ్లే గెలుస్తున్నారంట. నిజానికి వాళ్లు గెలవలేదు. బెదిరించి రిగ్గింగ్‌ చేశారు. బలవంతంగా పోలీసులతో నామినేషన్లు విత్‌డ్రా చేయించారు. ఇది ఎన్నికా? నలభై ఏళ్లుగా ఎప్పుడూ చూడలేదు. తిరుపతి గెలుపు.. ఒక గెలుపా? ఓటు దొంగల్ని సాక్ష్యాధారాలతో పట్టించాం. దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికలో ఎన్ని డ్రామాలు? దూదేకుల మహిళ ఎంపీపీ అవుతుంటే లోకేశ్‌ గెలిపించారని ఆమెను అడ్డుకుంటున్నారు’ అని విమర్శించారు. ‘అమరావతిలో అన్నారు కాబట్టి సరిపోయింది, రాయలసీమ అయితే లేపేసేవాళ్లం అని మైదుకూరు ఎమ్మెల్యే అన్నారు. ఆయనపై కేసు పెట్టే ధైర్యం డీజీపీకి ఉందా? ఇది చేతగానితనం కాదా?’ అని నిలదీశారు.


గంజాయి అక్రమ రవాణాపై మాజీ మంత్రి ఆనందబాబు, ఇతర నేతలు మాట్లాడారు.. వెంటనే నర్సీపట్నం నుంచి పోలీసులొచ్చి సమాచారం చెప్పాలని నోటీసులిచ్చారు. మాట్లాడిన వారందరికీ నోటీసులు ఇస్తున్నారు. ఎక్కడ జరుగుతోందో మీకు తెలియదా? పోలీసు చొక్కాలు తీసేయండి. విచారణ కూడా మాకే ఇచ్చేయండి.. మేమే చేస్తాం.
ఈ ఏడాది అమ్మఒడి ఆగిపోయింది.. నాన్న బుడ్డి అక్కడే ఉంది. దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్నక్యాంటీన్‌ పోయింది. పండగ కానుకలు, విదేశీ విద్య, చంద్రన్న బీమా పోయాయి. పింఛను రూ.3వేలు ఇస్తామని రూ.250 చొప్పున పెంచుకుంటూ పోతున్నారు. ఎప్పుడు పెంచుతారు? పదవి ఉండాలిగా, ఈయన పాలనలో ఎవరి జీవితాలైనా బాగుపడ్డాయా?

-చంద్రబాబు


ఎల్లుండి దిల్లీకి చంద్రబాబు

రాష్ట్రపతిని కలవనున్న తెదేపా బృందం

ఈనాడు, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ ముఖ్య నేతలు సోమవారం దిల్లీ వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్నారు. మాదకద్రవ్యాలకు, గంజాయికి రాష్ట్రం అడ్డాగా మారిందని, ప్రభుత్వంలోని వ్యక్తులే దాన్ని ప్రోత్సహిస్తున్నారని, శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్న తెదేపా.. అదే విషయంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనుంది.రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నట్టు సమాచారం. చంద్రబాబు శనివారం ఉదయం 10.30కు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. రాష్ట్రపతితో భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలతోపాటు భవిష్యత్‌ కార్యాచరణపైనా చర్చించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని