Covid Effect: తుంటికీలుపై కొవిడ్‌ దెబ్బ

చిన్నవయసులోనే తుంటికీలు అరిగిపోవడం ‘అవాస్క్యులర్‌ నెక్రొసిస్‌’  లక్షణమని నిపుణులు చెబుతున్నారు. బాధితుల్లో 95 శాతం మంది పురుషులే ఉంటున్నారు.

Updated : 19 Mar 2022 05:15 IST

స్టెరాయిడ్స్‌ వాడకంతో దుష్ప్రభావం
అవాస్క్యులర్‌ నెక్రోసిస్‌ వ్యాధి బారిన బాధితులు
20-50 ఏళ్ల వయసులోనే   కీలు అరుగుదల
బాధితుల్లో 95 శాతం పురుషులే
నాలుగోదశలోనే కీలు మార్పిడి అవసరమంటున్న నిపుణులు
ఈనాడు - హైదరాబాద్‌

చిన్నవయసులోనే తుంటికీలు అరిగిపోవడం ‘అవాస్క్యులర్‌ నెక్రొసిస్‌’  లక్షణమని నిపుణులు చెబుతున్నారు. బాధితుల్లో 95 శాతం మంది పురుషులే ఉంటున్నారు.

రీంనగర్‌కు చెందిన ఒక వ్యక్తి (43) రెండోదశ కొవిడ్‌ ఉద్ధృతిలో వైరస్‌ బారినపడ్డాడు. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో సుమారు మూడు వారాలు చికిత్స పొందాడు. ఐసీయూలోనే ఆక్సిజన్‌ సాయంతో 12 రోజులున్నాడు. ఆ సమయంలో వైద్యులు స్టెరాయిడ్స్‌ సహా ఇవ్వాల్సిన మందులన్నీ ఇచ్చారు. ఎట్టకేలకు ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కానీ గత రెండు నెలలుగా తుంటి దగ్గర విపరీతంగా నొప్పి పెడుతుండడంతో నిమ్స్‌ ఆర్ధోపెడిక్స్‌ విభాగంలో సంప్రదించాడు. ఎక్స్‌రే తీసిన వైద్యులు తుంటికీలు అరుగుదల రెండోదశలో ఉందని నిర్ధరించారు. సాధారణంగా 60-70 ఏళ్లు దాటిన వారికొచ్చే తుంటికీలు అరుగుదల ఇంత చిన్న వయసులో రావడంతో బాధితుడు, వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. లోతుగా విశ్లేషించగా.. ఇది కొవిడ్‌ చికిత్సానంతర దుష్ప్రభావమని తేలింది.

కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టినా.. దాని కారణంగా వచ్చే బాధలు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. కంటి నుంచి కాలి వరకూ అన్ని అవయవాలపైనా దుష్ప్రభావాలు కనిపిస్తూనే ఉన్నాయి. మోతాదుకు మించి స్టెరాయిడ్‌ చికిత్స పొందిన రోగుల్లో తాజాగా తుంటికీలు సమస్య తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతి 2021 మార్చిలో మొదలై.. ఏప్రిల్‌-ఆగస్టు వరకూ ఉద్ధృతంగా కొనసాగింది. వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడున్న పరిస్థితుల్లో స్టెరాయిడ్స్‌ చికిత్స అనివార్యమైంది. కానీ వాటిని విచ్చలవిడిగా వినియోగించడం వల్ల మ్యూకర్‌ మైకోసిస్‌ (బ్లాక్‌ఫంగస్‌) జబ్బు బారినపడి.. కనుగుడ్డు తీయాల్సి వచ్చిన బాధితులు కూడా వేలల్లో నమోదయ్యారు. ఇప్పుడు ఆ బాధల్లో తుంటికీలు కూడా చేరింది. ఏడాది కిందట వాడిన స్టెరాయిడ్స్‌ ప్రభావం ఇప్పుడు బయటపడుతోంది.


రోబోటిక్‌ సర్జరీతో మెరుగైన ఫలితాలు
- డాక్టర్‌ ఎ.వి.గురవారెడ్డి, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు, సన్‌షైన్‌ హాస్పిటల్స్‌.

కొవిడ్‌లో స్టెరాయిడ్స్‌ ఇచ్చిన వారిలో కొందరికి తుంటికీలులో ఈ వ్యాధి కనిపిస్తోంది. స్టెరాయిడ్స్‌ వాడిన ప్రతి ఒక్కరికీ వస్తుందని చెప్పలేం. రోజూ ఓపీలో కనీసం 2-3 కేసులొస్తున్నాయి. గత రెండు నెలల్లోనే దాదాపు 100 మందికి పైగా వచ్చారు. వీరిలో అత్యధికులు 20-40 ఏళ్ల మధ్య వయసు వారే. 95 శాతానికి పైగా పురుషులే. ప్రస్తుతం రెండు, మూడు దశలకు చేరిన తుంటికీలు సమస్యతో వస్తున్నారు. వీరికి ఎప్పుడు కీలు మార్పిడి అవసరమవుతుందనేది తీసుకునే జాగ్రత్తలపై ఆధారపడి ఉంటుంది. కానీ సాధారణ వయసు కంటే ముందే తుంటికీలు మార్పిడి చేయించుకోవాల్సి వస్తుంది. నాలుగో దశలోకి చేరి, బాగా నడవలేని స్థితికి చేరుకున్నప్పుడు కీలు మార్చాల్సి వస్తుంది. రోబోటిక్‌ హిప్‌ రిప్లేస్‌మెంట్‌తో 100 శాతం కచ్చితత్వంతో ఆపరేషన్‌ చేయొచ్చు. అవాస్క్యులర్‌ నెక్రోసిస్‌ కారణంగా పోయిన రక్తప్రసరణ తిరిగి రాదు. మృదులాస్థి (కార్టిలేజ్‌) బలాన్ని కాపాడే మందులు మాత్రం వైద్యుల సూచనల మేరకు వాడాల్సి ఉంటుంది.


25 శాతం పెరిగిన బాధితులు
- ఆచార్య డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌, ఆర్ధోపెడిక్స్‌, నిమ్స్‌

తుంటికీలు సమస్య రెండు, మూడు దశల్లో వచ్చిన రోగులకు.. ‘కోర్‌ డి కంప్రెషన్‌’ అనే చికిత్స చేస్తున్నాం. అంటే మోకీలు బంతిలోకి మల్టిపుల్‌ డ్రిల్లింగ్‌ ద్వారా రంధ్రాలు చేసి, రక్తప్రసరణ పెరగడానికి, వాపు తగ్గడానికి చికిత్స అందిస్తున్నాం. దీనివల్ల కొంత వరకూ కీలుమార్పిడిని వాయిదా వేయొచ్చు. సాధారణ తుంటి కీలు మార్పిడి రోగులతో పోల్చితే అదనంగా ఈ తరహా కేసుల సంఖ్య 25 శాతం పెరిగింది. ముఖ్యంగా స్టెరాయిడ్స్‌ వాడిన వారిపై ఈ ప్రభావం కనిపిస్తోంది. తుంటికీలు మార్పిడిని సాధ్యమైనంత వరకూ వాయిదా వేసుకోవాలి. తప్పదు అనుకున్నప్పుడే చేయించుకోవాలి. ఈలోగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నేలపై కూర్చోవద్దు. మెట్లు ఎక్కడం, దిగడం తగ్గించుకోవాలి. పరుగెత్తకూడదు. మోకాళ్లపై కూర్చునే విధంగా భారతీయ మరుగుదొడ్డి విధానాన్ని వినియోగించొద్దు. క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేసుకోవాలి. నొప్పి ఉన్నా రోజూ పెయిన్‌కిల్లర్స్‌ వేసుకోవద్దు. వాటిని ఎక్కువగా వాడితే మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదముంది. కాల్షియం, విటమిన్‌ డి వంటి మాత్రలు వైద్యుల సలహా మేరకు వాడుకోవాలి. సాధారణ ఆహారం తీసుకోవచ్చు. బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి.


ఏమిటీ అవాస్య్కులర్‌ నెక్రోసిస్‌?

తుంటికీలులో బంతి, గిన్నె రెండూ ఉంటాయి. వీటికి రక్తప్రసరణ తగ్గిపోవడాన్నే ‘అవాస్క్యులర్‌ నెక్రోసిస్‌’ అంటారు. దానివల్ల అక్కడ కండరం చచ్చుబడిపోతుంది. క్రమేణా తుంటికీలులో అరుగుదల పెరుగుతుంది. నొప్పి అధికమవుతుంది. ఇందులో నాలుగు దశలుండగా.. నాలుగో దశలోకి చేరితే, నడవలేని స్థితి వస్తుంది. ఈ దశలోనే తుంటికీలు మార్పిడి అవసరమవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని